మహిళ అడిగిందని.. రైలు ఆపిన గార్డు

మహిళ అడిగిందని.. రైలు ఆపిన గార్డు

విశాఖ రైల్వే స్టేషన్ లో మానవత్వం ప్రదర్శించిన రైలు గార్డు
విశాఖపట్టణం:
మా వాళ్లు వస్తున్నారు.. కొద్దిసేపు రైలు ఆపమని ఓ మహిళ కంగారుగా అడగడంతో కదిలిన రైలును రైల్వే గార్డు వెంటనే ఆపేసిన ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఉదయం 7.35 గంటల సమయంలో సికింద్రాబాద్-భువనేశ్వర్ ఎక్స్ ప్రైస్ రైలును కదలడం గమనించిన ఓ మహిళ గార్డును ప్రాధేయపడడంతో వెంటనే ఆపేశాడు. కొద్దిసేపు ఆపినా వారు రాలేకపోవడంతో చూసి ఇక ఆపలేనంటూ మళ్లీ  రైలు కదిలించారు. ఇంతలో మహిళ తాలూకు వారు రైల్వే స్టేషన్  ఫ్లై ఓవర్ దిగుతూ కనిపించడంతో సదరు మహిళ పరిగెత్తుతూ మళ్లీ వెళ్లి గార్డును ప్రాధేయపడగా.. ఆయన చలించిపోయి ఆపేశాడు.

రైలు కదులుతూ.. ఆగుతూ ఉండడంతో ప్రయాణికులతోపాటు.. రైల్వే పోలీసులు ఏం జరిగిందోనని  హడావుడిగా రైల్వే గార్డు వద్దకు వచ్చి ఆరా తీశారు. ఎవరూ చైన్ లాగలేదని..ఆపింది రైల్వే గార్డేనని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. రైలు గార్డును వేడుకున్న మహిళ పరిగెత్తుకుంటూ తమ వారిని తీసుకొచ్చి రైలు ఎక్కించాక గార్డు విజిల్ ఊది రైలును కదిలించారు.