బెంగళూరులో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మాజీ గర్ల్ఫ్రెండ్ ఫొటోలను మార్ఫ్ చేసిందో మహిళ. అంతేకాకుండా ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి రూ. కోటి పైగా వసూల్ చేసింది.
కోలార్ నగరానికి చెందిన షాలిని అనే మహిళ తన భర్తతో కలిసి బెంగుళూరులోని వైట్ఫీల్డ్లో నివసిస్తూ ఒక సూపర్ మార్కెట్ నడుపుతోంది. ఈ దంపతులకు ఎనిమిదేళ్ల సంతానం ఉంది. వీరికి పెళ్లై సుమారు 11 సంవత్సరాలు అయింది. అయితే షాలిని కాలేజీలో చదువుకునే రోజుల్లో మహేష్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఆ తర్వాత కాలేజీ చదువు పూర్తి కాగానే వారిద్దరూ విడిపోయారు. కాగా.. గతేడాది జూలైలో మహేష్ వాట్సాప్ ద్వారా షాలినికి మెసెజ్ పంపాడు. దాంతో వారిద్దరూ మళ్లీ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. రెండు రోజుల తర్వాత.. అనుశ్రీ అనే మహిళ తాను మహేష్కు ప్రస్తుత గర్ల్ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేసుకుంది. దాంతో షాలిని.. అనుశ్రీతో కూడా మాట్లాడటం ప్రారంభించింది.
ఆ తర్వాత అనుశ్రీ కొన్ని ఫొటోలను పంపాలని షాలినిని కోరింది. దాంతో షాలిని తన ఫొటోలను అనుశ్రీకి పంపింది. తాను మహేష్తో సన్నిహితంగా ఉన్న ఫొటోలను, వీడియోలను అనుశ్రీ మార్ఫ్ చేసి షాలిని ఫొటో పెట్టింది. ఆ తర్వాత షాలినికి ఫొన్ చేసి మహేష్తో నువ్వు సన్నిహితంగా ఉన్న ఫొటోలున్నాయని మెసెజ్ చేసింది. అంతేకాకుండా శాంపిల్గా కొన్ని ఫోటోలను కూడా షాలినికి పంపించింది. తాను అడిగిన డబ్బు చెల్లించకపోతే ఆ ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని అనుశ్రీ షాలినిని బెదిరించింది. దాంతో బయపడిన షాలిని గత ఒకటిన్నర సంవత్సరాల నుంచి సుమారు 1.3 కోట్ల రూపాయలను అనుశ్రీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసింది.
అయితే గత నెలలో ఎక్కువ డబ్బు పంపిస్తే ఫొటోలను డిలీట్ చేస్తానని అనుశ్రీ షాలినికి చెప్పింది. ఈసారి అనుశ్రీ అడిగినంత డబ్బు ఇవ్వలేనని షాలిని తెగేసి చెప్పింది. అంతేకాకుండా అనుశ్రీ నెంబర్ను బ్లాక్లో పెట్టింది. ఈలోగా షాలిని భర్త.. తన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు వేరే ఖాతాకు మళ్లీంచడాన్ని గమనించాడు. దాంతో షాలినిని ఆమె భర్త డబ్బు గురించి అడగగా.. అసలు విషయం చెప్పింది. భర్త సూచన మేరకు షాలిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు మహేష్, అనుశ్రీలను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.