విమెన్ అట్రాసిటీ కేసులు జల్దీ తేల్చేస్తం

విమెన్ అట్రాసిటీ కేసులు జల్దీ తేల్చేస్తం
వీ6-వెలుగు ఇంటర్వ్యూలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్  వి.సునీతా లక్ష్మారెడ్డి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్​పర్సన్ గా శుక్రవారం బుద్ధభవన్ లో వి. సునీతా లక్ష్మారెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె ‘వెలుగు’కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముందుగా తనకు ఈ పదవి అప్పగించిన సీఎం కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్పారు. విమెన్ కమిషన్ సభ్యులతో కలిసి ఒక టీంగా మహిళల హక్కులు, వారి సమస్యపై పనిచేస్తామన్నారు. 24గంటలు మహిళలకు అందుబాటులో ఉండి వాళ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. మహిళలపై అత్యాచారాలు, అట్రాసిటీ, డొమెస్టిక్ వైలెన్స్, ట్రాఫికింగ్, కిడ్నాప్ కేసులు జల్దీ పరిష్కారం అయ్యేలా కమిషన్ పాటుపడుతుందని తెలిపారు. ఇందుకోసం విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్​మెంట్‌తో కలిసి వర్క్ చేస్తామన్నారు. మహిళా సమానత్వం కోసం, అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా కమిషన్ పనిచేస్తుందని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరుగుతున్నయి? వీటిని ఎట్ల కంట్రోల్ చేస్తరు? రాష్ట్రంలో చాలా వరకు క్రైమ్ తగ్గుతోంది. పోలీస్ డిపార్ట్​మెంట్ యాక్టివ్ గా వర్క్ చేస్తోంది. షీ టీమ్స్ బాగా పనిచేస్తున్నాయి. ఎక్కడైనా, ఎప్పుడైనా మహిళలపై సంఘటనలు జరిగితే తక్షణమే స్పందిస్తాం. అలాంటివి జరగకుండా అవేర్నెస్ కల్పిస్తాం. అన్ని డిపార్ట్​మెంట్స్ తో కలిసి కార్యక్రమాలు చేపడతాం. లాక్ డౌన్ లో గృహహింస కేసులు చాలా పెరిగాయి. వీటిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? అలాంటి ఇన్సిడెంట్స్ కమిషన్ దృష్టికి వచ్చినా, పోలీసులకు ఫిర్యాదులు వచ్చినా మహిళా ప్రొటెక్షన్ కోసం పనిచేస్తాం. ఇష్యూస్ జరుగుతున్నా కొంతమంది బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వారికోసం మహిళా సంఘాలున్నాయి. మహిళాసంఘాల సభ్యులను ఎడ్యుకేట్ చేస్తాం. మహిళల హక్కులు, న్యాయపరంగా వారికి కల్పించే సౌలత్​లపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాం. అవేర్నెస్ కల్పించడంతో పాటు ఒక చిన్న బుక్ లెట్ లాంటిది ఏర్పాటుచేసి మహిళాసంఘాలకు పంపిణీ చేయనున్నాం. దీనివల్ల వారికి ఏ సమస్య ఉన్నా కమిషన్ దృష్టికి, పోలీస్ డిపార్ట్​మెంట్‌కు లేదా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్​మెంట్‌కు తెలియజేసే అవకాశం ఉంటుంది. పబ్లిక్ ప్లేసెస్,  ట్రాన్స్ పోర్టేషన్, వర్క్ ప్లేస్​లో మహిళలు వేధింపులకు గురవుతున్నారు. దీనిపై ఎలా అవేర్నెస్ కల్పించబోతున్నారు? ఇష్యూస్ ఒక్కొక్కటిగా నా దృష్టికి వస్తున్నాయి. ట్రాన్స్ పోర్టేషన్, పబ్లిక్, ఆఫీస్, వర్క్ ప్లేస్ లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఏవైనా అవేర్నెస్ కల్పిస్తాం. 33 జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో సఖి సెంటర్లు ఉన్నాయి. వాటి ద్వారా మహిళలకు రక్షణ కల్పించే విధంగా ప్రయత్నం చేస్తాం. సమస్యలు తెలుసుకోవడానికి ఏం చేస్తారు? విమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. మహిళలకు ఎలాంటి హెల్ప్ కావాల్సి వచ్చినా 181 విమెన్ హెల్ప్ లైన్ కు కాల్ చేస్తే వెంటనే స్పందించి సాయం చేస్తం. ట్రాఫికింగ్ లో రెస్క్యూ చేసిన మహిళలకు ఏవిధమైన భరోసా కల్పించనున్నారు? మహిళలకు సంబంధించి ఏవైనా ఇష్యూస్ వచ్చినప్పుడు నిందితులపై కేసులు పెట్టడం, కౌన్సెలింగ్ ఇవ్వడం వంటివి జరుగుతున్నాయి. ట్రాఫికింగ్ నుంచి కాపాడిన వారిని రెస్క్యూ హోమ్స్ లో ఉంచుతున్నాం. వారు మళ్లీ బయటకు వెళ్లి బతికే పరిస్థితి ఉండదు. అటువంటి వాళ్లకి విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్​మెంట్, విమెన్ కార్పొరేషన్ కు సంబంధించి వివిధ రంగాల్లో ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు లోన్స్ ఇప్పించి ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం.