
వాషింగ్టన్ : కోవిడ్ దెబ్బకు కుబేరులు సైతం కుంగిపోయారు. గత వారం మార్కెట్లు భారీగా పతనం కావడంతో, సాధారణ ఇన్వెస్టర్లకు మాత్రమే కాక కోటీశ్వరులకు సైతం కోట్ల రూపాయల సంపద పోయింది. ప్రపంచంలోని టాప్ 500 ధనికులకు మొత్తంగా కలిపి 444 బిలియన్ డాలర్లు అంటే రూ.32,04,570 కోట్ల సంపద పోయిందని బ్లూమ్బర్గ్ బిలీనియర్ ఇండెక్స్లో వెల్లడైంది. కోవిడ్ వైరస్ చైనా వెలుపల విశ్వ రూపం చూపిస్తుండటంతో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే అవకాశాలున్నాయని అంచనాలొస్తున్నాయి. దీంతో 2008లో ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పటి కంటే దారుణంగా మార్కెట్లు పడటం, అంతకంటే ఎక్కువగా బిలీనియర్ల సంపద కరిగిపోవడం జరిగింది. ప్రపంచంలో టాప్ 3 ధనికులు అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్గేట్స్, ఎల్వీఎంహెచ్ ఛైర్మన్ బెర్నార్డ్ అర్నాల్డ్లు భారీగా నష్టపోయారు. వీరికి మొత్తంగా కలిపి 3,000 కోట్ల డాలర్ల సంపద పోయింది. టెస్లా ఇంక్ షేర్లు పడిపోవడంతో, ఎలన్ మస్క్ సంపద 9 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది.