ఇందిరమ్మ ఇండ్ల మెటీరియల్స్కు రేట్లు ఖరారు

ఇందిరమ్మ ఇండ్ల మెటీరియల్స్కు రేట్లు ఖరారు
  • అంతకు మించితే ఊరుకోం : అడిషనల్​కలెక్టర్లు

యాదాద్రి, వెలుగు :  ఇందిరమ్మ ఇండ్లకు అవసరమయ్యే సిమెంట్, స్టీల్, ఇటుక, ఇసుక రేట్లను యాదాద్రి జిల్లా ఆఫీసర్లు ఖరారు చేశారు. ఇంతకు మించకుండా ఇండ్లకు మెటీరియల్స్​సప్లయ్ చేయాలని సరఫరాదారులకు సూచించారు. ఎక్కువ రేట్లకు అమ్మితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి పేదకు సొంతిల్లు ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది. ఇండ్ల నిర్మాణం స్పీడప్​ కావడంతో అవసరమైన ఇటుక, ఇసుక, స్టీల్​, సిమెంట్​ రేట్లను ఒక్ససారిగా సప్లయ్​దారులు పెంచేశారు. ఈ విషయంలో ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు అడిషనల్ కలెక్టర్లు జి.వీరారెడ్డి, ఏ.భాస్కర్​రావు రేట్లు ఫిక్స్​ చేయడానికి రంగంలోకి దిగారు. 

సరఫరాదారులతో సోమవారం ప్రత్యేకంగా మీటింగ్​ఏర్పాటు చేశారు. ఒకరిద్దరు సరఫరాదారులు టాక్స్ తగ్గించాలని, డబ్బు భూములున్న వారికి ఇండ్లు వచ్చాయని అనడంతో అడిషనల్​ కలెక్టర్లు  సీరియస్​ అయ్యారు. అందరూ న్యాయంగానే వ్యాపారం చేస్తున్నారా..? తీసుకున్న అనుమతికి తగ్గట్టుగానే మట్టిని తోడుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. 'సహజ వనరులైన మట్టి, ఇసుక, స్టీల్​, సిమెంట్​లో ఎక్కువ లాభాలు ఆశించకుండా ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్​కు సహకరించాలని కోరారు. 

అనంతరం హౌసింగ్​ డిపార్ట్​మెంట్, ఇంజినీర్ల లెక్కల ప్రకారం రూపొందించిన రేట్ల ప్రకారం సరఫరా చేయాలని సూచించారు. ఎక్కువ రేట్లకు అమ్మితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీటింగ్​లో ఆర్డీవో కృష్ణారెడ్డి, మైనింగ్​ ఈడీ రాఘవరెడ్డి, హౌసింగ్​ పీడీ విజయ్​ సింగ్​, వివిధ మండలాల నుంచి సరఫరాదారులు ఉన్నారు.