పాల్గొంటున్నది మొదటి ఒలింపిక్స్. అయితేనేం, తనలో ఏ బెరుకు లేదు. ప్రపంచ చాంపియన్షిప్ లో గెలిచిన అనుభవం ఉంది. దానికి తోడు ఎలాగైనా పతకం సాధించాలన్న కసి, పట్టుదల. పైగా యువరక్తం. తన పంచ్ పవర్తో బాక్సింగ్లో కాంస్య పతకం సాధించింది లవ్లీనా బొర్గోహెన్. మూడో పతకాన్ని అందించి దేశమంతా గర్వపడేలా చేసింది. అంతేనా.. ఊరికి రోడ్డు కూడా తెచ్చింది.
వీడియో కాల్ సెంటిమెంట్
బాక్సింగ్ రింగ్లోకి దిగే ముందు తల్లిదండ్రులకి వీడియో కాల్ చేసి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఎందుకంటే లవ్లీనా ఆడే మ్యాచ్ని వాళ్లు టీవీలో చూడరు. టెన్షన్గా ఉండే వాళ్లని కూల్ చేసి, ప్రశాంతంగా రింగ్లోకి వెళుతుంది. కామ్గా ఉండే లవ్లీనా రింగ్లో అడుగు పెట్టిందంటే చురుగ్గా అడుగులేస్తూ పోటీ పడిన బాక్సర్ని చిత్తు చేస్తుంది. బాక్సర్గా రాణించడంలో హైట్ తనకు ప్లస్ అయింది. 69 కిలోల బాక్సింగ్ విభాగంలో సెమీఫైనల్లో ఓడిపోయి, కాంస్యంతోనే సరిపెట్టుకుంది. అయినా కూడా... ఒలింపిక్స్లో పతకం గెలవాలన్న తన ఎనిమిదేళ్ల కల నిజమైనందుకు లవ్లీనా పట్టలేనంత సంతోషంగా ఉంది. టోక్యో విమానం ఎక్కిన తొమ్మిది మంది బాక్సర్ల లో లవ్లీనా ఒకరు. అయితే, అందరి కళ్లు మేరీకోమ్ మీదే ఉన్నాయి. కానీ, మేరీకోమ్ ఓడిపోవడంతో బాక్సింగ్లో పతకం పోయినట్టే అనుకున్నారంతా. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ యంగ్ బాక్సర్ లవ్లీనా కాంస్య పతకం సాధించింది. అస్సాం నుంచి ఒలింపిక్స్కి వెళ్లిన మొదటి అమ్మాయి తనే. మొదటి ఒలింపిక్స్లోనే పతకం గెలిచిన లవ్లీనాది అస్సాంలోని గోలాఘట్ జిల్లాలోని బరోముఖియా. ఆమె తండ్రికి చిన్నపాటి తేయాకు తోట ఉంది. ఆమెకు రీచా, లీమా అనే ట్విన్ సిస్టర్స్ ఉన్నారు. ఇద్దరూ కిక్బాక్సింగ్లో జాతీయ స్థాయి వరకు వెళ్లారు. వాళ్లను చూస్తూ పెరిగిన లవ్లీనా తను కూడా బాక్సర్ అవ్వాలి అనుకుంది. వాళ్లనే ఇన్స్ఫిరేషన్గా తీసుకుంది. స్కూల్ రోజుల్లోనే ‘ముయే థాయ్’ అనే కిక్బాక్సింగ్ నేర్చుకుంది. ఒకరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) వాళ్లు లవ్లీనా చదువుతున్న స్కూల్లో బాక్సింగ్ ట్రయల్స్ పెట్టారు. తన ప్రతిభతో అధికారుల దృష్టిలో పడింది. శాయ్ అకాడమీలో బాక్సింగ్ బేసిక్స్ తెలుసుకుంది.
ట్రైనింగ్ ట్రిప్ మిస్ అయ్యి..
కిందటి ఏడాది జూలైలో లవ్లీనా వాళ్ల అమ్మకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు. ఒలింపిక్స్ కోసం పాటియాలలోని నేషనల్ క్యాంప్ నుంచి పిలుపు వచ్చింది. కానీ, తల్లిని చూసుకోవాలని వెళ్లలేదు. యూరప్లో 52 రోజుల ట్రైనింగ్ ట్రిప్కి వెళ్లడానికి ముందు రోజు లవ్లీనాకి కరోనా వచ్చింది. దాంతో ఇండియాలోనే ఉండిపోయింది. ఆ టైంలో ఖాళీ సిలిండర్తో సాధన చేసి, తర్వాత స్పోర్ట్స్ అథారిటీ వాళ్లు ఇచ్చిన ట్రైనింగ్ కిట్తో ప్రాక్టీస్ చేసింది.
కొత్త రోడ్డు వస్తోంది
లవ్లీనా వాళ్ల ఊరు మెయిన్రోడ్డుకి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మెయిన్రోడ్డుకు వెళ్లాలంటే మట్టి రోడ్డే దిక్కు. వానాకాలంలో బురదగా ఉండే ఆ దారిలో బండి కాదు కదా, నడిచి వెళ్లడం కూడా కష్టమే. ఏళ్లుగా ఆ రోడ్డుకి మరమ్మతు చేసినోళ్లు లేరు. లవ్లీనా కాంస్య పతకం గెలవడంతో ఊరికి కొత్త రోడ్డు వేయించే పనిలో పడ్డారు లోకల్ ఎమ్మెల్యే. ఎందుకంటే ఆ దారి గుండానే ఒలింపిక్ విజేత లవ్లీనా ఇంటికి వెళ్లాలి. ఆమె కారులో వెళ్లేటప్పుడు ఇబ్బంది పడకూడదని రోడ్డు రిపేర్ చేయిస్తున్నారు. ఒలింపిక్ మెడల్తో పాటు ఊరికి రోడ్డు తెచ్చిన లవ్లీనాని ఊరి వాళ్లంతా మెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా లవ్లీనా గౌరవార్థం ఆమె పేరుతో స్పోర్ట్స్ అకాడమీ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు ఎమ్మెల్యే.
కెరీర్ ముగిసింది అనుకుని..
బాక్సర్గా లవ్లీనా కెరీర్ 2012లో మొదలైంది. 2018లో ఐబా ఉమెన్స్ బాక్సింగ్ చాంపియన్షిప్లో కాంస్యం గెలవడంతో బ్రేక్ వచ్చింది. ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్లో గోల్డ్ మెడల్తో సత్తా చాటింది. కానీ, 2018 కామన్వెల్త్ పోటీల్లో ఓటమితో బాక్సింగ్కి గుడ్ బై చెప్పేద్దాం అనుకుంది. అయితే ‘బాక్సింగ్ అనేది మెంటల్ గేమ్. ఫోకస్డ్గా ఉండాలి. ఎంత నైపుణ్యం ఉన్నా, రింగ్లో చురుగ్గా కదలాలి’ అని కోచ్ చెప్పాకే తనకి అర్థమైంది. ఆ తర్వాత ఫిట్నెస్ మీద కంటే ధ్యానం మీద ఫోకస్ పెట్టింది. డైరీ కూడా రాసేది. తనపై తనకు నమ్మకం పెరిగింది. అప్పటి నుంచి బరిలో దిగిన ప్రతిసారి పతకంతో తిరిగొచ్చింది. కిందటి ఏడాది రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకుంది.