- ధరల వల్లే హార్డ్ కు మద్యంప్రియులు దూరం
- నవంబర్లో 24 లక్షల కేసుల లిక్కర్..
- 27 లక్షల కేసుల బీర్లు సేల్
హైదరాబాద్, వెలుగు: మద్యం ప్రియుల టేస్ట్ మారుతోంది. వణికించే చలిలో కూడా చిల్డ్ బీర్లనే తాగుతున్నారు. హార్డ్ కంటే ఎక్కువగా బీర్లనే కొంటున్నారు. ఎక్సైజ్శాఖ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం గురువారం రాష్ట్రంలో 94 వేల కేసుల లిక్కర్ అమ్ముడు పోతే, 1.48 లక్షల కేసుల బీర్లు సేల్ అయ్యాయి. ఏటా చలికాలంలో బీర్ల కంటే, హార్డ్ కేసులే ఎక్కువగా అమ్ముడు పోతాయని, ఈసారి మాత్రం ట్రెండ్ రివర్స్ అయిందని ఎక్సైజ్ శాఖ ఆఫీసర్లు చెబుతున్నారు. పది రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గి, విపరీతంగా చలి పెడ్తున్నా బీర్ల సేల్స్ ఏమాత్రం తగ్గలేదని వారు అంటున్నారు. గత వారం, పది రోజుల సగటు చూసినా మందు కంటే, బీరు కేసుల అమ్మకాలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నారు.
నవంబర్ నెల మొత్తంగా 51.97 లక్షల కేసుల మద్యం అమ్ముడు పోయింది. ఇందులో లిక్కర్ 24.18 లక్షల కేసులు సేల్ కాగా, 27.79 లక్షల బీరు కేసులు అమ్ముడుపోయాయని అధికారులు వెల్లడించారు. దారి మార్చిన ధర బీర్ల సేల్స్ పెరగడానికి రకరకాల కారణాలు ఉన్నాయని ఎక్సైజ్ ఆఫీసర్లు, వైన్ షాపుల ఓనర్లు చెబుతున్నారు. బీర్లతో పోలిస్తే బ్రాందీ, విష్కీ రేట్లు ఎక్కువగా ఉండడమే ముఖ్య కారణమని అంటున్నారు. రాష్ట్రంలో ప్రీమియం బీర్ 650 ఎంఎల్కు రూ.150 ఉంటే, మందు మినిమం క్వాలిటీ బ్రాండ్ క్వార్టర్కే రూ.190 నుంచి రూ.220 వరకూ ఉంది. చీప్ లిక్కర్ క్వార్టర్కు రూ.120 ధర ఉన్నా.. జనాలు చీప్ లిక్కర్ తాగేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు. అలాగని ఎక్కువ ధర పెట్టి మంచి మందు తాగేందుకూ ఆసక్తి చూపడం లేదు. మధ్యేమార్గంగా రూ.150 పెట్టి చిల్డ్ బీర్ కొట్టేస్తున్నారు. ధరల కారణంగా మందు నుంచి బీర్లకు మారిన జనాలు లైట్ కంటే, స్ర్టాంగ్ బీర్లనే ఎక్కువగా ఇష్టపడుతున్నారని వైన్ షాపు నిర్వాహకులు అంటున్నారు. ప్రధానంగా యూత్ ఎక్కువగా బీర్లకే మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా జనాలతో తాగించడమే టార్గెట్గా పెట్టుకుంది. ఇంకా ఎక్కువగా అమ్మాలని ఎక్సైజ్ ఆఫీసర్లకు టార్గెట్లు పెట్టి, తద్వారా సర్కార్ ఆదాయం పెంచుకుంటోంది. దీంతో వైన్ షాపుల్లో ఏజ్తో పనిలేకుండా ఎవరొచ్చినా మందు అమ్ముతున్నారు.