- 7 నిమిషాల పాటు సంపదలో మస్క్ను దాటిండంట!
- యూట్యూబర్ క్లెయిమ్
న్యూఢిల్లీ: ప్రపంచలోనే అత్యంత ధనవంతుడిగా ఏడు నిమిషాల పాటు కొనసాగానని, సంపద విషయంలో ఎలన్ మస్క్ను దాటేశానని ఓ యూట్యూబర్ చెప్పుకుంటున్నాడు. యూకేకి చెందిన యూట్యూబర్ మ్యాక్స్ ఫాష్ తను ఏ విధంగా ఎలన్ మస్క్ కంటే ధనవంతుడయ్యాడో ఓ వీడియోలో వివరించారు. ‘ యూకేలో కంపెనీని పెట్టడం చాలా ఈజీ. కంపెనీ హౌస్ అని ఒకటుంటుంది. అవసరమైన ఫామ్ను ఫిల్ చేస్తే సరిపోతుంది’ అని మ్యాక్స్ ఫాష్ తన యూట్యూబ్ వీడియోలో పేర్కొన్నారు. ‘కంపెనీకి ఒక పేరు అవసరం వచ్చింది. ఆ పేరు కూడా ‘లిమిటెడ్’ తో ముగియాలి. అందుకే నా బిజినెస్ వెంచర్ను ‘అన్లిమిటెడ్ మనీ లిమిటెడ్’ గా పేరు పెట్టా. ఆ తర్వాత ఈ కంపెనీ ఏం చేస్తుందో నిర్ణయించాలి. ఉదాహరణకు నూడుల్స్, మాకరోని (పాస్తా) వంటి ప్రొడక్ట్ల తయారు చేయడం. ఇదే విధంగా ‘ఫరినాసియోస్’ ప్రొడక్ట్ను తయారు చేసే కంపెనీగా నిర్ణయించా. నాకు ఫరినాసియోస్ అర్థం కూడా తెలీదు. కానీ, కంపెనీ వీటినే తయారు చేస్తుంది’ అని పేర్కొన్నారు. తర్వాత బిజినెస్ వెంచర్లో కీలకమైనది షేర్లను డిసైడ్ చేయడమని, మొత్తం 10 బిలియన్ షేర్లుగా తన కంపెనీని విడదీశానని అన్నారు. ‘ 10 బిలియన్ షేర్లతో నేనొక రిజిస్టర్డ్ కంపెనీని క్రియేట్ చేసి, షేరుని 50 పౌండ్లకు అమ్మితే, లీగల్గా తన కంపెనీ వాల్యూ 500 బిలియన్ పౌండ్లుగా మారుతుంది. దీంతో అత్యంత ధనవంతుడిగా మారుతా. ఎలన్ మస్క్ను ఈజీగా దాటేస్తా ’ అని ఈ యూట్యూబర్ తన వీడియోలో పేర్కొన్నారు. ఒక షాపులో రెండు చైర్లతో తన బిజినెస్ను పెట్టానని, కానీ, ఎవరూ తన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి రాలేదని గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత ఒక మహిళా ఇన్వెస్టర్ ఒక షేరును కొనడానికి వచ్చారని, ‘ఈ కంపెనీలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు?’ అని ఆమెను ప్రశ్నించగా, ఈ ఇన్వెస్ట్మెంట్ నుంచి భవిష్యత్లో ఎదో పొందుతానని నమ్మకం ఉందని ఆమె చెప్పిందని ఫాష్ అన్నారు. ఎటువంటి రెవెన్యూ లేని కంపెనీకి ఇంత వాల్యూ ఉందా? అని అధికారులు లెటర్స్ పంపారని, ఫ్రాడ్స్ చేస్తున్నానని అనుమానించారని చెప్పారు. వెంటనే కంపెనీని డిసాల్వ్ చేయాలని ఆదేశించారన్నారు.