మాటిమాటికీ గేటు..రోజుకు 40 సార్లు పడుతున్న రైల్వే గేట్

మాటిమాటికీ గేటు..రోజుకు 40 సార్లు పడుతున్న రైల్వే గేట్
  • పడ్డప్పుడల్లా 10 నిమిషాలు ట్రాఫిక్ జామ్
  • ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
  • చేగుంట వద్ద ఆర్‌‌వోబీ నిర్మించాలని డిమాండ్

మెదక్​ (చేగుంట), వెలుగు :మెదక్‌‌–హైదరాబాద్‌‌ వెళ్లే దారిలో చేగుంట వద్ద ఉన్న రైల్వే గేట్ మాటిమాటికి పడుతుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రింబవళ్లు వెహికల్స్‌‌తో రద్దీగా ఉండే రూట్‌‌ కావడంతో గేట్ పడ్డప్పుడల్లా 10 నిమిషాలకుపైగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. మెదక్​ నుంచి వ్యాపారులు, సాధారణ ప్రజలు వయా చేగుంట మీదుగానే హైదరాబాద్‌‌కు రాకపోకలు సాగిస్తుంటారు. మెదక్‌‌లోని గవర్నమెంట్​ఆఫీసుల్లో పనిచేసే ఎంప్లాయిస్​, స్కూళ్లలో పనిచేసే టీచర్లు కూడా ఇదే మార్గంలో వచ్చిపోతుంటారు. మెదక్ ఆర్టీసీ డిపో నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్‌‌కు సూపర్​ లగ్జరీ, డీలక్స్​, ఎక్స్​ప్రెస్​ బస్​లన్నీ ఈ రూట్లోనే నడుస్తున్నాయి. చిన్నశంకరంపేట మండలంలోని వివిధ కంపెనీలకు ముడిసరుకు తీసుకురావడంతో పాటు ఇక్కడ తయారయ్యే ప్రొడక్టులను ఇతర రాష్ట్రాలకు ట్రాన్స్​పోర్ట్​ చేసే ట్రక్కులు, ట్యాంకర్లు, కంటెయినర్లు కూడా ఈ మార్గంలోనే వెళ్తుంటాయి. 

రోజుకు 40 సార్లు 

సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి  మహారాష్ట్రలోని ముత్కేడ్​ మధ్య ఉన్న రైల్వే లైన్​ చేగుంట పట్టణం మీదుగా వెళ్తోంది. ఈ రూట్‌లో ప్రతిరోజు ఎక్స్​ ప్రెస్​, ప్యాసింజర్​ కలిపి 30 రైళ్లు నడుస్తాయి. రైలు వచ్చిన ప్రతిసారి చేగుంటలోని రైల్వే క్రాసింగ్ వద్ద గేట్​ వేస్తారు. అంతేగాక చేగుంట సమీపంలోని వడ్యారం రైల్వే స్టేషన్​వద్ద పలు రైళ్లు క్రాసింగ్​అవుతాయి. ఈ కారణంగా చేగుంట వద్ద ప్రతిరోజు దాదాపు 40 సార్లు గేటు పడుతోంది. ఇలా గేట్​పడినప్పుడల్లా కనీసం 10 నిమిషాల పాటు ట్రాఫిక్​ స్తంభిస్తోంది. అటు చేగుంట వైపు, ఇటు మెదక్ వైపు కిలో మీటర్​ పొడుగునా వెహికిల్స్​ నిలిచిపోతున్నాయి. దీనివల్ల ప్రయాణికులు, ఆఫీసులకు వెళ్లే ఎంప్లాయిస్‌‌కు​ ఇబ్బంది కలుగుతోంది.  కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీ ట్రీట్‌‌మెంట్​ కోసం షెంట్లను సికింద్రాబాద్​గాంధీ హాస్పిటల్​, హైదరాబాద్‌‌లోని ప్రైవేట్​ హాస్పిటల్‌‌కు తీసుకెళ్లే అంబులెన్స్‌‌లు కూడా ఆగిపోవాల్సి వస్తోంది. 

ఆర్‌‌వోబీతోనే  సమస్య పరిష్కారం

గేట్‌ సమస్య తీరాలంటే చేగుంట రైల్వే క్రాసింగ్​వద్ద రైల్వే ఓవర్​ బ్రిడ్జి ( ఆర్‌‌వోబీ) నిర్మించాలని ప్రయాణికులు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పలుసార్లు నిరసనలు కూడా తెలిపారు. స్పందించిన సంబంధిత అధికారులు ఆర్‌‌వోబీ కోసం రూ.60 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. కాస్ట్​ షేరింగ్​పద్ధతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలా 50 శాతం ఫండ్స్​ శాంక్షన్​ చేస్తే ఆర్‌‌వోబీ నిర్మించే అవకాశం ఉంటుంది. మెదక్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని తమ సమస్య తీర్చాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు