ఈ రోజుల్లో 40 ఏండ్లకే మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి. ‘ఎక్కువసేపు కూర్చో లేకపోతున్నాం బాబూ’ అని దీర్ఘాలు తీస్తారు. కానీ, గుజరాత్కు చెందిన ఈ ముసలి జంట ఏడుపదుల వయసులో దేశాన్ని చుట్టేస్తున్నారు. ఐకానిక్ మూవీ ‘షోలే’లో జై, వీర్లు సైడ్కార్ మోటార్ బైక్పై చక్కర్లు కొట్టినట్లు... వీళ్లు కూడా మోటార్బైక్పైన తిరుగుతున్నారు. ఇప్పటివరకు 30వేల కిలోమీటర్లు తిరిగారు. ‘ భార్యే నా బుల్లెట్కు బ్యాటరీ. అందుకే, ఆమె లేనిదే ఎక్కడికి వెళ్లలేను’ అంటున్నాడు మోహన్ లాల్ చౌహాన్. వాళ్ల జర్నీ ఏంటో ఓసారి చదివేద్దామా!
గుజరాత్ వడోదరాకు చెందిన మోహన్లాల్ చౌహాన్, లీలాబెన్ దంపతులు ఈతరం యువతకు ఛాలెంజ్ విసురుతున్నారు. ఏడుపదుల వయసులో ఓపికగా బండిపైన దేశం మొత్తం తిరుగుతున్నారు. 1974 మోడల్ బుల్లెట్కు సైడ్ కార్ తగిలించుకుని ఇప్పటివరకు నాలుగు లాంగ్ రోడ్డు ట్రిప్పులు వెళ్లారు. దాదాపు అన్ని రాష్ట్రాలను కవర్ చేసింది ఈ జంట. ‘ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ)’లో పనిచేసేవారు మోహన్లాల్. 2011లో ఆయనకు హార్ట్ఎటాక్ వచ్చింది. పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని, కనీసం స్టెప్స్ కూడా ఎక్కకూడదని డాక్టర్లు చెప్పారు. కానీ, 77ఏండ్ల మోహన్లాల్కు మాత్రం అలా ఇష్టంలేదు. ‘ఈ చిన్న జీవితాన్ని నచ్చినట్లు ఎంజాయ్ చేయాలి’ అనుకున్నాడు. ఎంజాయ్ చేయడమే కాకుండా.. మెసేజ్ కూడా ఇస్తున్నాడు. వాటర్ను సేవ్ చేయాలని, డ్రగ్స్ వాడొద్దని, బైకింగ్ బ్రదర్ హుడ్నెస్ పెంచుకోవాలని అవేర్నెస్ కల్పిస్తూ 72 ఏండ్ల భార్యతో కలిసి మోటార్బైక్పై దేశాన్ని చుట్టేస్తున్నాడు. అంతేకాకుండా భవిష్యత్తు తరానికి సేఫ్ ప్లానెట్ అందించాలంటే చెట్లు పెంచడం ఒక్కటే మార్గం అని అందరికీ అవేర్నెస్ కల్పిస్తున్నారు ఈ జంట. సాహసాలు చేసేందుకు వయసుతో సంబంధంలేదని నిరూపించాలనే ఇలా ట్రావెల్ చేస్తున్నామని అంటున్నారు.
ఆమె నా బండికి బ్యాటరీ
“ చిన్న జీవితాన్ని ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యాను. అందుకే, 2015లో రిటైర్మెంట్ తీసుకుని సోలో ట్రిప్స్ చేశాను. కానీ, ఏదో వెలితిగా అనిపించేది. లీలాబెన్ను తీసుకెళ్లాలని అనుకున్నాను. కానీ, గతంలో ఒకసారి ఆమెకు కాలు విరగడంతో ఎక్కువసేపు బండిపైన కూర్చోలేదు. అందుకే బుల్లెట్కు సైడ్ కార్ పెట్టించాను. 2016లో మా జర్నీ మొదలైంది. ఫస్ట్ ట్రిప్లో మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, గోవా, తమిళనాడు తిరిగాం. 2018లో సెకెండ్ ట్రిప్ థాయ్లాండ్ ప్లాన్ చేసుకున్నాం. మధ్యప్రదేశ్,ఉత్తర్ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, వెస్ట్బెంగాల్, అస్సాం కవర్ చేసుకుంటూ మేఘాలయకు వెళ్లాం. అక్కడ నుంచి థాయ్లాండ్ వెళ్లాలనుకునే టైంకి కొండచరియలు విరిగిపడుతున్నాయని చెప్పి రోడ్డు క్లోజ్ చేశారు. దాంతో థాయ్లాండ్ వెళ్లలేకపోయాం. 2019లో రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కవర్ చేశాం” అని చెప్పారు మోహన్. కరోనాకు ముందు గుజరాత్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంకు వెళ్లారు ఈ గోల్డెన్ కపుల్ . ఇప్పుడిక కరోనా కారణంగా ట్రిప్స్ ప్లాన్ చేయట్లేదు.
కాలు విరిగినా..
చాలామందికి ఇంటి నుంచి బయటికి వెళ్లి నాలుగురోజులుంటే బెంగ మొదలవుతుంది. కానీ, లీలాబెన్కి మాత్రం ట్రావెలింగ్ చేయకపోతే బెంగగా ఉంటుందట. అందుకే, ట్రిప్స్ వేస్తుంటారట ఈ జంట. అలా 2018లో ట్రిప్కు వెళ్లినప్పుడు లీలాబెన్కు ప్రమాదవశాత్తు కాలు విరిగింది. అయినా కూడా ఆమె ఏ మాత్రం తగ్గలేదు. సర్జరీ చేసినా కూడా ట్రావెలింగ్ ఆపలేదు లీలాబెన్. “ లీలాబెన్ది చాలా స్ట్రాంగ్ బాడీ. కాలువిరిగి సర్జరీ అయినా కూడా ఆమె ట్రావెలింగ్ వద్దు అనలేదు. ఒక్కసారి కూడా కాలు నొప్పి పెడుతుందని, ఇంటికి వెళ్లిపోదామని చెప్పేది కాదు” అన్నారు మోహన్లాల్.
ఫుడ్ విషయంలో జాగ్రత్తలు
మోహన్లాల్, లీలాబెన్ దంపతులు ఏ రాష్ట్రానికి వెళ్లినా, ఏ ప్లేస్కు వెళ్లినా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవారట. ఏ హోటల్కు వెళ్లినా మోహన్లాల్ స్వయంగా తానే చెఫ్ దగ్గరకు వెళ్లి కావాల్సినట్లు వండించుకునే వారట. అంతేకాకుండా ఒక చిన్న స్టవ్ కూడా తీసుకెళ్లి వండుకుంటారట. “ అలా వండుకుంటాం కాబట్టే ఆరోగ్యంగా ఉన్నాం, ఓపికగా తిరుగుతున్నాం”అని చెప్తున్నారు ఆ దంపతులు. అంతేకాకుండా ఫైనాన్స్ మేనేజ్మెంట్లో లీలాబెన్ చాలా స్ట్రిక్ట్. అందుకే, ట్రిప్ కోసం బడ్జెట్ ప్లాన్ చేసుకుని, దానికి తగ్గట్లుగానే ఖర్చు చేస్తాం అంటున్నాడు మోహన్లాల్.
పిల్లలు పోవద్దన్నారు. ఫండింగ్ లేదు. నా సేవింగ్స్తో ట్రావెల్ చేస్తున్నాం. ట్రావెలింగ్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. సాహసాలు చేయడానికి వయసు ఎప్పుడూ అడ్డుకాదు. ట్రావెలింగ్తో పాటు అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ జర్నీ స్టార్ట్ చేశాం. ఒక్కో ట్రిప్ ఒక్కో అనుభూతినిచ్చింది. శ్రీలంక ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు బార్డర్లో కొన్ని ఇష్యూస్ వల్ల వెళ్లలేదు. కానీ, రామేశ్వరంలో చూసిన సన్రైజ్, సన్సెట్ను జీవితంలో మర్చిపోలేం.
“ హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పాడు. కానీ, నాకు అలా ఉండటం ఇష్టంలేదు. చిన్నప్పుడు నాన్నతో ట్రిప్స్కు వెళ్తుండేవాడిని. అలా ట్రావెలింగ్ అలవాటు అయ్యింది. మేము ముందే అన్నీ ప్లాన్ చేసుకుంటాం. నిజానికి మాకు ప్లానింగ్ చేసుకోవడం, ట్రిప్కు వెళ్లడం కష్టంకాదు. కానీ, జనాలు అడిగే ప్రశ్నలే ఇబ్బంది పెడతాయి. ‘అన్ని కిలోమీటర్లు ఎలా వెళ్లారు. అది కష్టం కదా. వెళ్లలేరు’ అని వాళ్లు అనే మాటలే ఒక్కోసారి ఇబ్బంది కలిగిస్తాయి. నిజానికి మా పిల్లలు ఈ ట్రిప్స్ వద్దు అన్నారు. కానీ ఇప్పుడు మా జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకున్నాం. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుని ట్రిప్కు బయలుదేరతాం. ఉదయం 8 గంటలకు జర్నీ స్టార్ట్ చేసి సాయంత్రం 4 గంటల వరకు 200 కిలోమీటర్లు మాత్రమే ట్రావెల్ చేస్తాం. ఇద్దరికీ మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం. ట్రావెలింగ్ ఖర్చు మొత్తం నా సేవింగ్స్లోవే. ఎవరి మీద ఆధారపడం. ట్రిప్ మొదలయ్యేముందు దాదాపు 10 నెలల పాటు రీసెర్చ్ చేస్తాను. గూగుల్మ్యాప్స్, బుక్స్ అన్నీ చూసి లిస్ట్ చేసుకుని బయలుదేరతాం. ”
- మోహనలాల్ చౌహాన్