తన గాయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు. తనకు నిన్న దెబ్బ తగిలిందని..ప్రస్తుతానికి గాయం చిన్నగా ఉన్నా.. బాగానే ఉన్నానని చెప్పాడు. ఇంగ్లండ్తో కీలకమైన సెమీ ఫైనల్ ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పెద్ద గాయం నుంచి బయటపడ్డాడు.
మంగళవారం జరిగిన నెట్ ప్రాక్టీస్లో త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు వేసిన ఓ త్రో.. హిట్ మ్యాన్ కుడి ముంజేతిని బలంగా తాకింది. దీంతో రోహిత్ నొప్పితో విలవిలలాడిపోయాడు. సాధారణంగా వేసిన బాల్.. లెంగ్త్ ఏరియాలో పడటంతో షార్ట్ పిచ్గా పైకి దూసుకొచ్చింది. దీనిని కెప్టెన్ ఫుల్షాట్ కొట్టే ప్రయత్నం చేయగా, మిస్ అయి చేతికి తగిలింది. వెంటనే ఐస్ ప్యాక్ అప్లై చేయడంతో గాయం తీవ్రంగా మారలేదు. 40 నిమిషాల తర్వాత రోహిత్ మళ్లీ ప్రాక్టీస్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
రోహిత్ శర్మ ఈ టీ20 వరల్డ్ కప్లో పెద్దగా రాణించడం లేదు. ఇప్పటివరకు మొత్తం 89 పరుగులు మాత్రమే చేశాడు. నెదర్లాండ్స్పై మాత్రమే అత్యధికంగా 53 రన్స్ చేశాడు. రేపు ఇంగ్లాండ్ తో భారత్ కు సెమీఫైనల్ మ్యాచ్ ఉంది. మరీ హిట్ మ్యాన్ రాణిస్తాడా? లేదా అన్నది చూడాలి.