కేజీబీవీలో నిబంధనలకు పాతర.. అలకేషన్ కాకున్నా నిధుల వినియోగం

కేజీబీవీలో నిబంధనలకు పాతర.. అలకేషన్ కాకున్నా  నిధుల వినియోగం
  • 17 స్కూళ్లకు  రూ.లక్ష విలువైన టీఎల్ఎం కొనుగోలు
  • ఎస్ వో లకు మెమోలు జారీ, ఎంక్వైరీ

మెదక్, వెలుగు: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) నిబంధనలకు విరుద్ధంగా నిధుల వినియోగం జరిగింది. జిల్లాలో మొత్తం19 కేజీబీవీలు ఉన్నాయి. వాటికి నిర్వహణ నిధులతో పాటు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం) కోసం నిధులు మంజూరవుతాయి. ఇవి కాకుండా పీఎం శ్రీ స్కీమ్ కింద ఎంపికైన వాటికి ప్రత్యేక నిధులు మంజూరవుతాయి. ఆయా గ్రాంట్ల కింద వచ్చిన నిధులను నిబంధనలకు అనుగుణంగా నిర్దేశిత పనులకు మాత్రమే వినియోగించాలి. 

కాగా జిల్లాలోని 17 కేజీబీవీలలో నిబంధనలకు విరుద్ధంగా ఇతర పద్దుల్లో బ్యాలెన్స్ ఉన్న నిధులతో టీఎల్ఎం కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇలా ఒక్కో స్కూల్ ఒక లక్ష విలువైన టీఎల్ఎం కొనుగోలు చేశారు. గత మార్చి 28న కేజీబీవీలకు టీఎల్ఎం గ్రాంట్ మంజూరు అయినప్పటికీ, విడుదల కాలేదని సమాచారం. ఆయా కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లు ఇదేమి పట్టించు కోకుండా టీఎల్ఎం కొనుగోలుకు చర్యలు తీసుకున్నారు. టీఎల్ఎం గ్రాంట్ రాకపోవడం వల్ల కేజీబీవీ అకౌంట్ లో ఉన్న ఇతర గ్రాంట్ నిధులు టీఎల్ఎం మెటీరియల్ సప్లై చేసే  ఏజెన్సీలకు వెళ్లిపోయాయి.

 ఈ విషయం ఇటీవల విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగా సమగ్ర విచారణకు ఆదేశించారు. డీఈవో రాధా కిషన్ ను వివరణ కోరగా జిల్లాలోని 17 కేజీబీవీలలో నిబంధనలకు విరుద్ధంగా టీఎల్ఎం కొనుగోలు చేసినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ మేరకు సంబంధిత స్పెషల్ ఆఫీసర్ లకు మెమోలు జారీ చేసి, ఆయా కేజీబీవీలలో టీఎల్ ఎం ఉందా ? లేదా? అన్నది ఎంక్వరీ చేస్తున్నట్టు తెలిపారు. విచారణ పూర్తి అయ్యాక ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని  పేర్కొన్నారు.