
- కమిషన్లు నిల్.. సీఎంవో ఫుల్!
- జనానికి అక్కరకొచ్చే ఆఫీసుల్లో పోస్టులన్నీ ఖాళీ
- సీఎం ఆఫీసు మాత్రం రిటైర్డ్ అధికారులతో నింపుడే నింపుడు
- రెండేండ్లుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్లో నియామకాల్లేవ్
- 5 నెలలుగా మానవ హక్కుల కమిషన్దీ అదే పరిస్థితి
- సమాచార కమిషన్లోనూ ఖాళీ కుర్చీలే
- సీఎంవోలో మాత్రం ఇద్దరు చీఫ్ అడ్వయిజర్లు, పది మంది అడ్వయిజర్లు
- అందులో తొమ్మిది మంది రిటైర్డ్, మాజీ ఆఫీసర్లే
హైదరాబాద్, వెలుగు: తమ గోస చెప్పుకుందామని మానవ హక్కుల కమిషన్ దగ్గరికి జనం పోతే అక్కడ చైర్మన్ సీటు ఖాళీ.. సభ్యుల సీట్లూ ఖాళీ. ఎస్సీ, ఎస్టీ కమిషన్ వద్దకు పోతే అక్కడా ఖాళీ కుర్చీలే. సమాచార కమిషన్లోనూ అదే పరిస్థితి. ప్రజలకు ఎంతో అక్కరకు వచ్చే కీలకమైన కమిషన్లను రాష్ట్ర సర్కారు గాలికి వదిలేసింది. కమిషన్లలోని పోస్టులు ఖాళీ అయి నెలలు, ఏండ్లు గడుస్తున్నా భర్తీ చేయడం లేదు. అదే.. చీఫ్ మినిస్టర్ ఆఫీసు (సీఎంవో)ను మాత్రం రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లతో నింపేస్తున్నది. అయినోళ్లను, అక్కరకు వస్తరనుకున్నోళ్లను ఇట్ల రిటైర్డ్ అవగానే.. అట్ల సీఎంవోలోకి తెచ్చిపెట్టుకుంటున్నది. ప్రత్యేక పోస్టులు క్రియేట్ చేసి బాధ్యతలు అప్పగిస్తున్నది. లక్షల జీతంతో చీఫ్ అడ్వయిజర్లుగా, అడ్వయిజర్లుగా నియమించుకొని, కేబినెట్ హోదా ఇచ్చి, వాళ్ల పదవీకాలాన్ని ఏండ్లకేండ్లు పొడిగిస్తున్నది.
ఎస్సీ, ఎస్టీ కమిషన్.. పేరుకే ఉంది!
‘‘రాజ్యాంగం, చట్టాల అమలు. దళితులు, గిరిజనులకు రక్షణ. ప్రతి నెలా 30న జరిగే పౌర హక్కుల దినోత్సవంలో అన్ని గ్రామాల ప్రజలు పాల్గొని సమసమాజాభివృద్ధికి తోడ్పడాలని మా మనవి’’... ఇదీ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే కనిపించే సందేశం. కానీ, వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ప్రతి నెలా పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించడం సంగతి దేవుడెరుగు.. మొదాలు ఆ కమిషన్కే పెద్ద దిక్కు లేకుండా పోయింది. అసలు కమిషన్ను ఏర్పాటు చేయడంలోనే చాలా ఆలస్యం జరిగింది. రాష్ట్రం ఏర్పడినప్పట్నుంచి దాదాపు నాలుగేండ్ల పాటు కమిషన్ లేకుండానే సర్కారు నెట్టుకొచ్చింది. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు పోరాడగా పోరాడగా 2018లో కమిషన్ను ఏర్పాటు చేసింది.
అదే ఏడాది ఫిబ్రవరిలో చైర్మన్ను, సభ్యులను నియమించింది. కమిషన్ చైర్మన్గా బీఆర్ఎస్ లీడర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, సaభ్యులుగా బోయుల్లా విద్యాసాగర్, ఎం.రాంబాల్ నాయక్, కుస్రం నీలా దేవి, సుంకపాక దేవయ్య, చిలకమర్రి నర్సింహలను మూడేండ్ల కాలపరిమితితో నియమించింది. వాళ్లు స్వచ్ఛందంగా తప్పుకోవాలనుకుంటే.. వారి రాజీనామాను ప్రభుత్వం ఆమోదించి కొత్త చైర్మన్ సభ్యులను నియమించే దాకా వారు ఆ పదవిలోనే కొనసాగుతారని అప్పట్లో నియామక ఉత్తర్వుల్లో సర్కారు పేర్కొంది. అయితే, ఆ కమిషన్ మొత్తం 2021 ఫిబ్రవరిలో ఖాళీ అయింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ను ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్కు చైర్మన్గా నియమించడంతో కమిషన్ కుర్చీ వెకెంట్గా ఉంది. అప్పట్నుంచి సర్కారు కొత్తగా ఎవరినీ చైర్మన్గా నియమించలేదు. అసలు దాని గురించే పట్టించుకోవడం లేదు. అంతేకాదు.. ప్రతి నెలా నిర్వహించాల్సిన పౌర హక్కుల దినోత్సవమూ మూలకు పడింది. దళితులపై జరుగుతున్న దాడులు, అరాచకాలపై ఫిర్యాదు చేసేందుకు వేదికంటూ లేకుండా పోయింది. అంతేకాదు.. చైర్మన్ ఉన్నప్పుడు ఇచ్చిన ఫిర్యాదులూ ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు మేజర్ ఫిర్యాదులను తీసుకుని రిజిస్టర్ చేస్తున్నా అవీ ఫైళ్లకే పరిమితమవుతున్నాయి. ఏదైనా సంఘటన జరిగితే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషనే నేరుగా రంగంలోకి దిగాల్సి వస్తున్నది. కమిషన్లో నియామకాలకు సంబంధించి ఇటీవల సర్కారుకు హైకోర్టు మొట్టికాయలు వేసినా.. స్పందన లేదు.
రిటైరవ్వుడే ఆలస్యం.. సీఎంవోలోకి
కీలకమైన కమిషన్లన్నింటినీ ఖాళీగా పెట్టిన సర్కారు.. తనకు కావాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రిటైరైతే మాత్రం వెంటనే సీఎంవోలోకి తెచ్చి పెట్టుకుంటున్నది. ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, సలహాదారులుగా పోస్టులు క్రియేట్ చేసి వాళ్లకు ఇస్తున్నది. అట్లా ఇప్పటిదాకా తొమ్మిది మందిని నియమించింది. రాజీవ్ శర్మనైతే.. 2016 డిసెంబర్లో అలా సీఎస్గా రిటైరయ్యారో లేదో ఆ వెంటనే ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా సర్కారు నియమించింది. ఇప్పటికీ ఆయన ఆ పదవిలోనే కొనసాగుతున్నారు. ఈ మధ్యే వీఆర్ఎస్ తీసుకున్న మాజీ సీఎస్ సోమేశ్ కుమార్.. కొద్ది రోజుల కింద మహారాష్ట్రలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయనను తీసుకొచ్చి ముఖ్య సలహాదారు పోస్టులో ప్రభుత్వం కూర్చోబెట్టింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కేవీ రమణాచారి, శైలేంద్ర కుమార్ జోషి, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ఆఫీసర్ ఆర్.శోభ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు ఏకే ఖాన్, అనురాగ్ శర్మ, రిటైర్డ్ ఐఈఎస్ ఆఫీసర్ జీఆర్రెడ్డితోపాటు మరో రిటైర్డ్ ఆఫీసర్ఈ. శ్రీనివాస రావును ప్రభుత్వ సలహాదారులుగా కొనసాగుతున్నారు. వీరితోపాటు టంకశాల అశోక్, సుద్దాల సుధాకర్ తేజ, రాజేంద్ర ప్రసాద్ సింగ్ కూడా ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారు. మొత్తంగా ప్రభుత్వ సలహాదారులుగా 12 మంది సీఎంవోలో ఉండగా.. వీరిలో తొమ్మిది మంది రిటైర్డ్, మాజీ ఆఫీసర్లే. ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎస్, సీఎంవో సెక్రటరీలు, పర్సనల్ సెక్రటరీలున్నా కూడా.. కావాల్సిన వాళ్లకు పదవులు క్రియేట్ చేసి ఇచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫిబ్రవరి నుంచి సమాచార కమిషన్ ఖాళీ
సమాచార కమిషన్పైనా సర్కారు చిన్నచూపే చూస్తున్నది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కమిషన్లోని సభ్యులంతా ఒకేసారి రిటైర్ అయ్యారు. దీంతో అప్పట్నుంచి అది కూడా ఖాళీగానే ఉంది. 2017లో ఏర్పాటు చేసిన కమిషన్కు తొలి చీఫ్ కమిషనర్గా జస్టిస్ ఎస్. రాజా సదారాం, కమిషనర్గా బుద్ధా మురళిని ఆనాటి గవర్నర్ నర్సింహన్ నియమించారు. వారితో పాటు సీనియర్ జర్నలిస్టులు కట్టా శేఖర్ రెడ్డి, మైదా నారాయణరెడ్డి, లాయర్లు సయ్యద్ ఖలీలుల్లా, మహ్మద్ అమీర్ హుస్సేన్, గిరిజన విద్యార్థి నేత శంకర్ నాయక్ను నియమించారు. సదారాం రిటైర్ అయిన తర్వాత బుద్ధా మురళి చీఫ్ కమిషనర్గా ఎంపికయ్యారు. బుద్ధా మురళి ఈ ఏడాది జనవరిలో, మిగతా కమిషనర్ల పదవీ కాలం ఫిబ్రవరిలో ఒకేసారి ముగిసింది. దీంతో అక్కడా ఖాళీ చైర్లే కనిపిస్తున్నాయి. కమిషనర్లు ఉన్నప్పుడే వేల సంఖ్యలో పిటిషన్లు పెండింగ్లో ఉండగా.. ఇప్పుడు వాటికి మరిన్ని పిటిషన్లు తోడవుతున్నాయి. పిటిషన్లకు రిప్లై ఇచ్చేందుకు నెలల టైం పడుతున్నది.
మానవ హక్కుల కమిషన్కు వెబ్సైట్ కూడా లేదు
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నిరుడు డిసెంబర్లో ఖాళీ అయింది. ఈ కమిషన్ ఏర్పాటులోనూ సర్కారు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే 2019 డిసెంబర్ 21న ఏర్పాటు చేసింది. కమిషన్కు మొట్టమొదటి చైర్మన్గా జస్టిస్ చంద్రయ్యను నియమించారు. మెంబర్గా రిటైర్డ్ సెషన్స్ జడ్జి నడిపల్లి ఆనందరావు, నాన్ జ్యుడీషియల్ మెంబర్గా మహ్మద్ ఇర్ఫాన్ను నియమించారు. వాళ్ల పదవీకాలం 2022 డిసెంబర్ 22తో ముగిసింది. దాదాపు ఐదు నెలల నుంచి ఖాళీ కుర్చీలే కమిషన్లో దర్శనమిస్తున్నాయి. ఇటీవల నాలుగేండ్ల బాలుడిపై కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే కమిషన్ ఆఫీసులో ఎవరూ లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతున్నది. దీంతో బాధితులు గతిలేక అక్కడి ఉద్యోగులకు ఫిర్యాదును అందజేశారు. సంచలనంగా మారిన మెడికో ప్రీతి మృతి కేసు.. రాష్ట్రంలో హక్కుల కమిషన్ లేకపోవడంతో జాతీయ హక్కుల కమిషన్కు చేరింది. అసలు రాష్ట్రంలో కమిషన్ పెట్టి ఇన్నేండ్లవుతున్నా.. దానికంటూ ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ అంటూ ఏదీ లేదు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలూ తమ తమ మానవ హక్కుల కమిషన్లకు వెబ్సైట్లను నిర్వహిస్తున్నాయి. కానీ, మన దగ్గర అదీ లేదు.
సీఎంవోలో అంతా వాళ్లే
సీఎంవోలో చీఫ్ సెక్రటరీ, సీఎంవో సెక్రటరీలు, పర్సనల్ సెక్రటరీలు ఉండగా.. వారికి తోడు ముఖ్య సలహాదారు, సలహాదారులను ప్రభుత్వం నియమించింది. ఇందులో మాజీ సీఎస్ రాజీవ్ శర్మ.. ఆరేడేండ్ల నుంచి ముఖ్య సలహాదారుగా కొనసాగుతున్నారు. మొన్నామధ్య వీఆర్ఎస్ తీసుకున్న మాజీ సీఎస్ సోమేశ్ కుమార్కు ప్రభుత్వం ఇటీవలే ముఖ్య సలహాదారు పదవిని ఇచ్చింది. రిటైర్డ్ ఆఫీసర్లయిన కేవీ రమణాచారి, శైలేంద్ర కుమార్ జోషి, ఆర్.శోభ, ఏకే ఖాన్, అనురాగ్ శర్మ, జీఆర్రెడ్డి, ఈ. శ్రీనివాస రావు అడ్వయిజర్లుగా కొనసాగుతున్నారు. టంకశాల అశోక్, సుద్దాల సుధాకర్ తేజ, రాజేంద్ర ప్రసాద్ సింగ్ కూడా సలహాదారులుగా ఉన్నారు. మొత్తంగా 12 మంది అడ్వయిజర్లలో.. తొమ్మిది మంది రిటైర్డ్, మాజీ ఆఫీసర్లే.