- ఆ పోస్టులను ఖాళీల్లో చూప్తలె
- వేకెన్సీల సంఖ్యను భారీగా తగ్గించే ప్రయత్నం
- కొత్త రిక్రూట్మెంట్, నోటిఫికేషన్ల మాటెత్తకుండా దాటవేత
- రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పదం ఉండదని గతంలో చెప్పిన కేసీఆర్
తెలంగాణలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉండవు.. అంతా సర్కార్ ఉద్యోగులే ఉంటరు.. సమైక్య పాలకులు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను చాలా బాధలు పెట్టిన్రు.. ప్రత్యేక రాష్ట్రం రాగానే ఒక్క సంతకంతో అందరినీ రెగ్యులర్ చేస్త. - తెలంగాణ ఉద్యమ సమయంలో..
కాంట్రాక్ట్ ఉద్యోగి, కాంట్రాక్ట్ లెక్చరర్, కాంట్రాక్ట్ డాక్టర్, కాంట్రాక్ట్ నర్స్, సెకండ్ ఏఎన్ఎం, థర్డ్ ఏఎన్ఎం అని ఏంటేంటో వాళ్ల మొహాల పేర్లు.. ఔట్సోర్స్, ఇన్సోర్స్, మన్నుసోర్స్, మశానం సోర్స్ అని పెట్టిన్రు. నిజంగా ఏదైనా వారం రోజులో, నెల రోజులో చేసే పనైతే టెంపరరీగా చేపిస్తే తప్పులేదు. కానీ, సంవత్సరాల తరబడి చేసే ఉద్యోగాలను కూడా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ అని పేరు పెట్టి అర్ధాకలితో చంపుతున్నరు. తెలంగాణలో అట్లా ఉండొద్దని, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ మేము రెగ్యులరైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నం.- 2017 మార్చిలో అసెంబ్లీలో..
ఖాళీలపై గడికో లెక్క!
50 వేల పోస్టులు నింపుతమని సీఎం కేసీఆర్ చెప్పి ఏడాదవుతున్నా.. ఇప్పటికీ ఖాళీల గుర్తింపు పూర్తి కాలేదు. ఇటీవల కొత్త జిల్లాల వారీగా, జోన్ల వారీగా ఉద్యోగుల విభజన పూర్తి కావటంతో అన్ని శాఖలు తమ పరిధిలోని ఖాళీల వివరాలు అందించాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులున్న పోస్టులను వేకెంట్గా చూపించ వద్దని ప్రభుత్వం మెలిక పెట్టినట్లు తెలిసింది. దీంతో అన్ని శాఖలు తమ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పక్కన పెట్టి మిగిలిన ఖాళీల జాబితాను ఇస్తున్నాయి. ఫలితంగా వేకెంట్ పోస్టుల సంఖ్య భారీగా తగ్గిపోయే అవకాశముంది. మరోవైపు ఖాళీల సంఖ్యపై ఆఫీసర్లు గడికో మాట చెప్తున్నారు. గత ఏడాది నుంచి ఈ లెక్క పొంతనలేకుండా మారుతూనే ఉంది. ఒకసారి 50 వేలు, మరోసారి 80 వేలు, ఇప్పుడు 76 వేలు ఇలా ఒక్కోసారి ఒక్కోలా చూపిస్తున్నారు. అసలు కాంట్రాక్టు ఉద్యోగులను వేకెన్సీ పోస్టుల్లో చూపకపోవడం, ఆ స్థాయిలో ఉద్యోగాల భర్తీ చేపట్టకూడదని రాష్ట్ర ప్రభుత్వం అనుకోవడంతోనే ఈ లెక్కల్లో తేడాలు వస్తున్నట్లు ఆఫీసర్లు అంటున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో 1.91 లక్షల ఖాళీలున్నాయని గతంలో పీఆర్సీ తన రిపోర్టులో వెల్లడించింది.
హైదరాబాద్, వెలుగు: అటు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో.. ఇటు నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. ఏండ్లుగా చాలీచాలని జీతాలు ఇచ్చి టెంపరరీ ఉద్యోగులతో పనులు చేయిస్తున్నది. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయక నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నది. ప్రస్తుతం వివిధ శాఖల్లో దాదాపు రెండు లక్షల మంది టెంపరరీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొన్ని కీలకమైన విభాగాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే రెగ్యులర్ ఉద్యోగులకంటే ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ డిపార్ట్మెంట్లు, ఇన్స్టిట్యూషన్లలో మొత్తం శాంక్షన్డ్ స్ట్రెంత్ 5,00,565. ప్రస్తుతం రెగ్యులర్ ఎంప్లాయీస్ 3,38,514 మంది పనిచేస్తుండగా.. మరో లక్షన్నర మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్టైం వాళ్లు పనిచేస్తున్నారు. శాంక్షన్డ్ పోస్టులకు సంబంధం లేకుండా పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇంకో 62 వేల మంది దాకా ఉంటారని ఆఫీసర్లు చెప్తున్నారు. కాంట్రాక్టు వద్దన్న ప్రభుత్వం ఇప్పుడు కాంట్రాక్టే ముద్దు.. రెగ్యులర్ వద్దు.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. గతంలో ఎన్నడూ లేనంతగా హెల్త్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ విధానాన్ని ఎంకరేజ్ చేస్తున్నది. చివరికి మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ పోస్టులను కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే రిక్రూట్ చేస్తున్నారు. దవాఖాన్లలో ఖాళీగా ఉన్న డాక్టర్, స్టాఫ్ నర్స్, పారామెడికల్ పోస్టుల భర్తీ ప్రతిపాదనలను ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది. డాక్టర్లను కాంట్రాక్ట్ బేసిస్లో, నర్సింగ్, ఇతర స్టాఫ్ను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్ చేసుకోవాలని ఆదేశించింది. దీంతో ఇటీవలే గాంధీ, ఉస్మానియా సహా 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 645 అసిస్టెంట్ ప్రొఫెసర్, 120 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ఇతర హాస్పిటళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులను వాక్ ఇన్ పద్ధతిలో భర్తీ చేయాలని జిల్లా డీఎంహెచ్వోలకు హెల్త్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఒకట్రెండు రోజుల్లో జిల్లాలవారీగా ఈ నోటిపికేషన్లు విడుదల కానున్నాయి. రాష్ట్రంలో అన్ని దవాఖాన్లు, మెడికల్ కాలేజీల్లో కలిపి సుమారు 4 వేల వరకూ డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉండగా.. 6 వేలకుపైగా స్టాఫ్ నర్స్, పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ లెక్కన దాదాపు 15 వేలకుపైగా పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని ఆఫీసర్లు చెప్తున్నారు.
అన్ని డిపార్ట్మెంట్లలోనూ ఇదే తంతు
అన్ని డిపార్ట్మెంట్లలోనూ ఇదే తంతు కొనసాగుతున్నది. జూనియర్ అసిస్టెంట్ నుంచి జూనియర్ లెక్చరర్ దాకా ఇట్లనే రిక్రూట్ చేస్తున్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను ప్రభుత్వమే మూడేండ్ల కాంట్రాక్టు పద్ధతిన తీసుకుంది. ఎడ్యుకేషన్, హెల్త్, రెవెన్యూ, మున్సిపల్ డిపార్ట్మెంట్లలో ఈ టెంపరరీ ఎంప్లాయీస్ ఎక్కువ. స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో 25,290 మంది కాంట్రాక్టు, 1813 మంది ఔట్ సోర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. ఇంటర్మీడియెట్, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నికల్ కాలేజీల్లో హవర్లీ బెస్ట్ టీచర్లు (హెచ్బీటీలు), గెస్ట్ లెక్చరర్లుగా 8,778 మంది పనిచేస్తున్నారు. వివిధ యూనివర్సిటీలు, గురుకులాల్లో 12 వేల మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. హెల్త్ డిపార్ట్మెంట్లో మొత్తం 17,200 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్లో 9,100 మంది జూనియర్ పంచాయతీ సెక్రటరీలు, 300 మంది పంచాయతీ సెక్రటరీలు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. పశుసంవర్ధకశాఖలో 628 మంది వెటర్నరీ డాక్టర్లు టెంపరరీ బేసిస్లో పనిచేస్తున్నారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 23 వేల మంది ఆర్టిజన్ల రెగ్యులరైజేషన్ వ్యవహారం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. గురుకులాల్లో టీచింగ్ స్టాఫ్ రెగ్యులర్ పోస్టులు శాంక్షన్ చేసినా కొన్ని మాత్రమే రిక్రూట్ చేశారు. మిగతా ఖాళీ టీచింగ్ పోస్టుల్లో సబ్జెక్ట్ అసోసియేట్స్ను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్ చేశారు. నాన్ టీచింగ్ పోస్టులైతే మొత్తంగా ఔట్ సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. సెర్ఫ్లో 4,086 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఈజీఎస్లో 430 మంది ఏపీవోలు, రెవెన్యూ శాఖలో ఆరొందల మంది ధరణి ఆపరేటర్లుగా ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. జీహెచ్ఎంసీలో 26 వేల మంది ఔట్సోర్సింగ్లో పనిచేస్తున్నారు. ఇందులో 18 వేల మంది శానిటేషన్ కార్మికులు ఉండగా, డ్రైవర్లు, సూపర్వైజర్లు, టెక్నికల్ స్టాఫ్ మరో 8 వేల మంది ఉన్నారు. కమిషనర్ అండ్ డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో 22,533 మంది శానిటేషన్ వర్కర్లు, 7,271 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీస్ స్టాఫ్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఖాళీలన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పిన టీఆర్ఎస్.. అధికారంలోకి వచ్చాక అనుసరిస్తున్న తీరుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.
క్లారిటీ ఇస్తలే
తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ అనే మాటే ఉండదని, అంతా ప్రభుత్వ ఉద్యోగులే ఉంటారని ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారిని రెగ్యులర్ చేస్తామని పలుమార్లు చెప్పారు. అయితే ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసెంబ్లీలోనూ ప్రకటన చేసిన సీఎం.. 2016లో ఒక జీవో ఇచ్చినప్పటికీ దానిపై హైకోర్టులో పిల్ పడింది. దీనిని ఇటీవల కోర్టు కొట్టివేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నాన్చుతున్నది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కు రిక్రూట్మెంట్లో వారికి ప్రాధాన్యం ఇచ్చే విషయం, వయస్సు విషయంలో సడలింపులు కలిగించే వంటి వాటిపై పీఆర్సీ సిఫార్సులు చేసినా పక్కన పెట్టేసింది. ఫలితంగా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్లో పనిచేస్తున్న ఉద్యోగులు తక్కువ జీతాలు తీసుకోవడమే కాకుండా, ఏ టైంలో తమ ఉద్యోగం పోతుందోననే ఆందోళనలో ఉన్నారు.
తెలంగాణ తెచ్చుకుంది ఇందుకేనా?
రాష్ట్రంలో లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వం వాటిని భర్తీ చేయకుండా ఆలస్యం చేస్తున్నది. మరోవైపు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పోస్టులు ఉండవని చెప్పిన సీఎం కేసీఆర్.. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలోనే రిక్రూట్ చేసుకోవాలని ఆదేశాలు ఇస్తున్నారు. భర్తీ చేస్తామని చెప్పిన ఖాళీల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పోస్టులు చూపించకుండా లెక్కలు తయారు చేస్తున్నారు. రిక్రూట్మెంట్పై ఒక విధానాన్ని తీసుకురావడంలో తెలంగాణ ప్రభుత్వం ఫెయిలైంది. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో సర్కారు చెలగాటమాడుతున్నది. - నీల వెంకటేశ్, నిరుద్యోగ జేఏసీ చైర్మన్
ఖాళీలపై శ్వేత పత్రం ఇవ్వాలి
ఖాళీలపై బడ్జెట్ సమావేశాల్లో శ్వేత పత్రం రిలీజ్ చేయడంతో పాటు రిక్రూట్మెంట్ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలి. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను రెగ్యులర్ చేయడమా, ప్రభుత్వ రిక్రూట్మెంట్లో ప్రయారిటీ ఇవ్వడమా ఏదో ఒకటి విడతల వారీగా కంప్లీట్ చేయాలి. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తామని సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు ప్రకటించారు. కానీ ఇప్పటికీ ఇది అమలు కాలేదు. కనీసం సమాన పనికి సమాన వేనతం కూడా ఇవ్వడం లేదు.
- జె. వెంకటేశ్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ నేత