- రానున్న ఆర్థిక సంవత్సరం కోసం బడ్జెట్ టార్గెట్ పెట్టుకోనున్న ప్రభుత్వం
- పీఎం కిసాన్ కింద రైతులకు ఇచ్చే అమౌంట్ పెరిగే అవకాశం
- గ్రామీణ ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడంపై ఫోకస్ పెట్టాలని ఎక్స్పర్టుల సలహా
న్యూఢిల్లీ: ఈసారి ఇంటెరిమ్ బడ్జెట్లో వ్యవసాయ రంగంపై ఫోకస్ పెంచాలని కేంద్రం చూస్తోంది. ముఖ్యంగా ఈ రంగానికి ఇచ్చే అప్పులను పెంచే అవకాశం ఉంది. 2022–23 లో 4 శాతం గ్రోత్ నమోదు చేసిన రూరల్ ఎకానమీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.8 శాతం తగ్గేటట్టు (డీగ్రోత్) కనిపిస్తోంది. దీంతో ఈ సెక్టార్పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టనుంది. 2019 ఇంటెరిమ్ బడ్జెట్లో కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి స్కీమ్లను ప్రకటించారు. ఈ స్కీమ్ కింద రైతులకు ఏడాదికి రూ.6 వేల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్ ఉండడం వలన రానున్న ఇంటెరిమ్ బడ్జెట్లో ఈ అమౌంట్ను పెంచే అవకాశం ఉంది. అంతే కాకుండా వ్యవసాయ రంగంలో ఇచ్చే అప్పుల విలువను ఏకంగా రూ.22–25 లక్షల కోట్లకు పెంచాలని కూడా కేంద్రం ఆలోచిస్తోంది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రతీ రైతుకి అప్పు దొరకడం మరింత సులభంగా మార్చాలని భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ అగ్రి క్రెడిట్ టార్గెట్ రూ.20 లక్షల కోట్లు. కిందటి నెల నాటికి ఇందులో 82 శాతం టార్గెట్ను చేరుకున్నారు. అంటే వ్యవసాయం రంగంలో రూ.16 లక్షల కోట్లకు పైగా లోన్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇచ్చారు. అగ్రికల్చర్, రూరల్ సెగ్మెంట్లపై రానున్న తాత్కాలిక బడ్జెట్లో ప్రయారిటీ ఉంటుందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ భావిస్తున్నారు. ‘అగ్రికల్చర్లో వేర్హౌసింగ్ను ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. వేస్టేజ్ను తగ్గించడంపై ఫోకస్ పెట్టాలి. కవరేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్హౌస్ రిసీట్స్ (ఈఎన్డబ్ల్యూఆర్ఎస్) పెంచాలి. ఫైనాన్స్కు, వ్యాపారానికి, సెటిల్మెంట్స్కు వీటిని వాడుకోవడానికి అనుమతి ఇవ్వాలి’ అని వివరించారు.
ఈఎన్డబ్ల్యూఆర్ఎస్ను రిజిస్టర్ అయిన వేర్హౌస్లు ఇష్యూ చేస్తాయి. రైతులు తమ ప్రొడక్ట్లను ఈజీగా అమ్ముకోవడానికి వీలుంటుంది. రైతులకు ఇచ్చే ఫెర్టిలైజర్ సబ్సిడీని డైరెక్ట్గా క్యాష్ రూపంలో అందించాలని కూడా సీఐఐ భావిస్తోంది. మార్కెట్లోని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఫార్మర్ ప్రొడ్యూషర్ ఆర్గనైజేషన్ల (ఎఫ్పీఓ) కు బడ్జెట్ సపోర్ట్ అవసరమని ది ఆర్గానిక్ వరల్డ్ ఎండీ గౌరవ్ మంచంద పేర్కొన్నారు. పంట బీమా పెంచాలని, గ్రామాల్లో ఉద్యోగాలు పెంచేందుకు ఎక్కువగా ఖర్చు చేయాలని, ఇరిగేషన్ సిస్టమ్ను మెరుగుపరచాలని అన్నారు. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచడం ద్వారా ఎకానమీ వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
కేటాయింపులు పెరగాలి
అగ్రికల్చర్ సెక్టార్ కోసం ప్రభుత్వం 2023–-24 బడ్జెట్లో రూ.1.25 లక్షల కోట్లు కేటాయించింది. 2013–14 లో కేటాయించిన రూ.27,662 కోట్లతో పోలిస్తే ఇది చాలా రెట్లు ఎక్కువ. రానున్న బడ్జెట్లో కూడా అగ్రికల్చర్ సెక్టార్కు కేటాయింపులు పెరుగుతాయని ఎక్స్పర్టులు అంచనా వేస్తున్నారు. అగ్రికల్చర్ ప్రమోషన్కు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ధనుకా అగ్రిటెక్ ఎండీ ఎంకే ధనుకా అన్నారు. ‘ముఖ్యంగా పీఎం – కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఇచ్చే డబ్బులు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. ఇప్పటికే తీసుకొచ్చిన కీలకమైన రూరల్ స్కీమ్ల కోసం కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం ప్రభుత్వ ప్రయారిటీగా కనిపిస్తోంది’ అని వెల్లడించారు.
చివరి బడ్జెట్లో పీఎం కిసాన్ స్కీమ్ కోసం రూ.60 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. కిందటేడాది నవంబర్ 30 నాటికి ఈ స్కీమ్ కింద రూ.2.81 లక్షల కోట్లను అర్హులకు ట్రాన్స్ఫర్ చేసింది. సీడ్ (విత్తనం) సెక్టార్లోకి విదేశీ ఇన్వెస్ట్మెంట్లు ఈజీగా వచ్చేలా పాలసీలు తీసుకురావాలని ఫెడరేషన్ ఆఫ్ సీడ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఐఐ) చైర్మన్ అజయ్ రాణా కోరారు. రైతుల ఆదాయం పెరగాలంటే సీడ్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్స్ పెరగాలని, ఇంటలెక్చువల్ ప్రాపర్టీని రక్షించేలా ఒక పాలసీ తేవాలన్నారు. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించడం ద్వారా ఎకానమీ మెరుగుపడుతుందని, రైతులు బాగుపడతారని చెప్పారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్కు ప్రభుత్వం ప్రయారిటీ ఇవ్వాలని ఐడీ ఫ్రెష్ ఫుడ్ గ్లోబల్ సీఈఓ పీసీ ముస్తఫా అన్నారు. టెక్నాలజీపై పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని పేర్కొన్నారు. రెగ్యులేషన్స్ను సులభం చేసి ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ మరింత విస్తరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.