World Idli Day : నేడు ప్రపంచ ఇడ్లీ దినోత్సవం..

World Idli Day : నేడు ప్రపంచ ఇడ్లీ దినోత్సవం..

ఉదయం టిఫిన్ అంటే అందరికీ టక్కున గుర్తుకొచ్చేది ఇడ్లీ. దోశ, బజ్జీ, ఉప్మా, పూరీ ఇలా ఎన్ని ఉన్నా.. ఇడ్లీకి ఉండే ప్రత్యేకతే వేరు. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే దీన్ని కడుపు నిండా ఆరగించవచ్చు. చాలా ఈజీగా జీర్ణం చేసుకోవచ్చు. జర్వంతో నీరసించేవారికి కూడా శక్తినిచ్చేది ఇడ్లీ. ఏదైనా సర్జరీలు జరిగినప్పుడు ముందుగా ఇడ్లీని పెట్టమని చెబుతుంటారు డాక్టర్లు. చాలామందికి ఫెవరేట్ బ్రేక్ ఫాస్ట్ ఇది. ఉదయం తినే టిఫిన్ లలో పూరి, దోష కంటే కంటే ఇడ్లీకే చాలామంది ఓటేస్తారు. ఇడ్లీల ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలు సమకూరుతాయి. మినుపపప్పు, బియ్యం మిశ్రమంతో చేసే ఇడ్లీలో కొలెస్ట్రాల్‌ ఉండదు. దీంట్లో క్యాలరీలు కూడా తక్కువే. అందుకే చాలా మంది ఉయదం ఇడ్లీకే ఓటేస్తారు. 

ఒక ఇడ్లీలో దాదాపు 40 నుండి 60 క్యాలరీలు ఉంటాయి. మినుప పప్పులోని ప్రొటీన్లు, బియ్యం రవ్వలోని పిండి పదార్థాలు శరీరానికి శక్తినిస్తాయి. ఇడ్లీ తయారీలో రవ్వకు బదులుగా బ్రౌన్‌ రైస్‌ వాడితే పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్లు లభిస్తాయి. ఇడ్లీలో పిండి పదార్థాలు ఉండటం వల్ల తేలికగా జీర్ణం అవుతాయి. ఇడ్లీతోపాటు పప్పు, గుడ్లు, బాదం, మొలకెత్తిన గింజలు తీసుకుంటే త్వరగా ఆకలేయదు. ఈ మధ్య చాలామంది చాలారకాలుగా ఇడ్లీలు తయారు చేస్తున్నారు. ముఖ్యంగా చిరు ధాన్యాలతోనూ ఇడ్లీలు చేస్తున్నారు. బియ్యానికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల్ని ఉపయోగిస్తున్నారు. మినుములు, కొర్రలు, రాగి వంటి వాటితో కూడా ఇడ్లీలను తయారు చేస్తున్నారు. వీటిలో ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే.. ఇడ్లీకి ఇండియాలో అంత డిమాండు ఉంది. 

ఇడ్లీకి కూడా ఒక రోజు ఉందన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు...? మదర్స్ డే, ఫాదర్స్ డే, ఎర్త్ డే ... ఇలా అన్నింటికీ ఒక ప్రత్యేకమైన రోజు ఉన్నట్లే ఇడ్లీకి కూడా మార్చి 30న ప్రత్యేకమైన రోజు ఉంది. మార్చి 30వ తేదీని ఇడ్లీ రోజుగా పిలుస్తారు. 2015లో చెన్నైకి చెందిన ఇడ్లీ క్యాటరర్ ఎనియావన్ దీనిని గుర్తించాడు. మార్చి 30న ఇడ్లీ దినోత్సవం నిర్వహించుకునేందుకు ఎనియవన్ సుమారు 1,328 రకాల ఇడ్లీలను తయారు చేసి.. ఇడ్లీ ప్రత్యేకతను, ప్రముఖ్యతను ప్రపంచానికి చాటాడు.అంతేకాదు.. ప్రపంచ ఇడ్లీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏకంగా 44 కిలోల ఇడ్లీని కట్ చేసి సంబరాలు కూడా చేశాడు. 

ఇడ్లీ ఎక్కడ పుట్టిందో తెలుసా..? 

ఇడ్లీ మొదట ఇండోనేషియాలో పులియబెట్టిన ఆహారంగా ఉద్భవించింది. ఇది క్రీస్తుశకం 800-1200లో భారతదేశానికి వచ్చింది. అయితే, ఈ ఇడ్లీ దక్షిణ భారతదేశ ప్రధాన వంటకంగా ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచింది. దక్షిణ భారత ప్రజలు ఎక్కువగా ఇడ్లీని సాంబార్, పచ్చడితో తింటుంటారు. ఇడ్లీ దినోత్సవం ఏడాదికోసారి మార్చి 30న వస్తుంది కానీ, సగటు దక్షిణాది కుటుంబాలకు మాత్రం ప్రతిరోజూ ఇడ్లీ దినోత్సవమే. ఈ ఇడ్లీకి ఇండియన్ ఫుడ్‌గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఈ రోజు ‘ప్రపంచ ఇడ్లీ డే’ సందర్భంగా.. ఇడ్లీలు లేదా చట్నీల్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో అన్ని రకాలు ట్రై చేయండి.