
- 2 లక్షల కొత్త ఉద్యోగాలు
- సెమీకండక్టర్స్, సోలార్ మాడ్యుల్స్, ఫార్మా ఇంటర్మీడియెట్స్ సెక్టార్లలోకి భారీగా రానున్న ఇన్వెస్ట్మెంట్స్
- తగ్గనున్న ప్రభుత్వ క్యాపెక్స్ : ఇక్రా
న్యూఢిల్లీ : ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ (పీఎల్ఐ) స్కీమ్తో రానున్న నాలుగేళ్లలో రూ.3–4 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. సెమీకండక్టర్స్, సోలార్ మాడ్యూల్స్, ఫార్మా ఇంటర్మీడియెట్స్ సెక్టార్లలోకి భారీగా పెట్టుబడులు వస్తాయని, ఫలితంగా 2 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని పేర్కొంది. రానున్న కాలంలో ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్, మైనింగ్, హాస్పిటల్స్, హెల్త్కేర్, సిమెంట్ సెక్టార్లలో ప్రైవేట్ కంపెనీల క్యాపెక్స్ (క్యాపిటల్ ఎక్స్పెండిచర్) పెరుగుతుందని ఇక్రా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కే రవిచంద్రన్ అన్నారు.
కానీ, ప్రైవేట్ క్యాపెక్స్ పెరగడానికి ప్రభుత్వ సాయం అవసరమని, ట్యాక్స్లను తగ్గించాలని సలహా ఇచ్చారు. కాగా, పీఎల్ఐ స్కీమ్ను 2021 లో 14 సెక్టార్ల కోసం తీసుకొచ్చారు. టెలీకమ్యూనికేషన్, వైట్ గూడ్స్, టెక్స్టైల్స్, మెడికల్ డివైజ్ల తయారీ, ఆటోమొబైల్స్, స్పెషాలిటీ స్టీల్, ఫుడ్ ప్రొడక్ట్స్, హై ఎఫీషియెన్సీ సోలార్ మాడ్యుల్స్, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీస్, డ్రోన్లు, ఫార్మా సెక్టార్ల కోసం పీఎల్ఐ స్కీమ్ ప్రకటించారు.
ఇండియాలో తయారీ మొదలు పెట్టే కంపెనీలకు రూ.1.97 లక్షల కోట్ల విలువైన రాయితీలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ డేటా ప్రకారం, కిందటేడాది నవంబర్ నాటికి పీఎల్ఐ స్కీమ్ కింద రూ.1.03 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 6.78 లక్షల మందికి ఉద్యోగాలొచ్చాయి.
ప్రైవేట్ కంపెనీల ఖర్చులు పెరగాలి..
భవిష్యత్లో గ్రీన్ ఎనర్జీ, రెన్యువబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ వంటి సెక్టార్లలో కంపెనీల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతుందని రవిచంద్రన్ పేర్కొన్నారు. కంపెనీల క్యాపెక్స్ మరింత పెరగాలంటే డిమాండ్ పుంజుకునేలా చేయాలని, మార్కెట్లోని కింది స్థాయిలో వినియోగం పెరిగేలా చూడాలని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం తగ్గిందని పేర్కొన్నారు. ట్యాక్స్ రాయితీలను ఇవ్వడం ద్వారా ప్రజల దగ్గర ఎక్కువ డబ్బులు ఉండేలా చేయొచ్చని, ఫలితంగా వ్యవస్థలో వినియోగం పెరుగుతుందని రవిచంద్రన్ అభిప్రాయపడ్డారు.
పరిశ్రమల్లో ప్రొడక్షన్ కెపాసిటీ 75 శాతం దగ్గర ఉందని, డిమాండ్ పెరిగితేనే కంపెనీలు తమ ఖర్చులను పెంచుతాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తన క్యాపెక్స్ను మార్చకపోవచ్చన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11.11 లక్షల కోట్లు క్యాపెక్స్ కోసం ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. ‘ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చులు ఇంతకు మించి పెద్దగా పెరగకపోవచ్చు. ఫిస్కల్ డెఫిసిట్, అప్పులు తగ్గించుకోవడంపై గవర్నమెంట్ ఫోకస్ పెట్టింది. దీంతో రానున్న కాలంలో బడ్జెట్లో ఇన్ఫ్రా కోసం కేటాయింపులు తగ్గొచ్చు.
అందుకే ప్రైవేట్ క్యాపెక్స్ పుంజుకోవాల్సిన అవసరం ఉంది’ అని రవిచంద్రన్ వివరించారు. ప్రభుత్వ క్యాపెక్స్ 2020–21 లో కేటాయించిన రూ.4.39 లక్షల కోట్లతో పోలిస్తే 2024–25 లో రెండింతలకు పైగా పెరిగి రూ.11 లక్షల కోట్లకు ఎగసింది.