- రికవరీ రేట్ 10 శాతమే
- సైబర్ నేరగాళ్లలో శిక్ష ఎదుర్కొంటోంది ఒక శాతం కంటే తక్కువ
- వర్చువల్ అకౌంట్లతో మనీ లాండరింగ్కు చాన్స్: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
న్యూఢిల్లీ : డిజిటల్ పేమెంట్స్ సెగ్మెంట్పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ‘నమ్మకం తగ్గుతోంది’ అని కామెంట్ చేసింది. గత ఆరు నెలల్లో రూ.5,574 కోట్లు సైబర్ ఫ్రాడ్స్ వలన నష్టపోయామని తన లేటెస్ట్ రిపోర్ట్లో వెల్లడించింది. స్టాండింగ్ కమిటీ ఆన్ కమ్యూనికేషన్స్ అండ్ ఐటీ ‘డిజిటల్ పేమెంట్స్ అండ్ ఆన్లైన్ సెక్యూరిటీ మెజర్స్ ఫర్ డేటా ప్రొటెక్షన్’ పేరుతో ఓ రిపోర్ట్ను పార్లమెంట్కు సబ్మిట్ చేసింది.
సైబర్ మోసాల వలన నష్టపోయిన అమౌంట్లో రికవరీ అయిన అమౌంట్ చాలా తక్కువగా ఉందని, ఇప్పటి వరకు కేవలం 10.4 శాతం మాత్రమే రికవరీ అయ్యిందని తెలిపింది. బాధితులకు రికవరీ అమౌంట్ను అందించడాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మెయిటీ) వేగవంతం చేయాలని పేర్కొంది. వర్చువల్ అకౌంట్స్ను తప్పుగా వాడుతున్నారని, స్క్రూటినీ నుంచి తప్పించుకునేందుకు వీటిని ఉపయోగిస్తున్నారని ఈ రిపోర్ట్ పేర్కొంది. ‘బ్యాంకింగ్ సిస్టమ్లో పెద్ద గ్యాప్ కనిపిస్తోంది’ అని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కామెంట్ చేసింది.
వర్చువల్ అకౌంట్స్కు యూనిక్ కస్టమర్ ఐడీ నెంబర్ ఉంటుంది. రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్స్ కంటే ఇవి వేరుగా ఉంటాయి. రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్స్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే వివరాలను మాన్యువల్గా నింపాల్సి ఉంటుంది. అదే వర్చువల్ అకౌంట్ నుంచి పే బటన్ నొక్కితే చాలు మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వర్చువల్ అకౌంట్స్ యాంటీ మనీలాండరింగ్, కౌంటర్ టెర్రరిజం ఫైనాన్షింగ్ మెకానిజంను నుంచి తప్పించుకోగలుగుతాయని పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ పేర్కొంది. ఫిన్టెక్ సెక్టార్లో ఇండియన్ కంపెనీలను ప్రమోట్ చేయాలని తెలిపింది.
200 ఇల్లీగల్ యాప్లను గుర్తించాం
సైబర్ ఫ్రాడ్స్ను అరికట్టడంలో ఫెయిల్ అవుతున్నామని పార్లమెంటరీ కమిటీ వ్యాఖ్యానించింది. 2021 లో మొత్తం 54,979 కేసులు నమోదు కాగా, కేవలం 491 కేసులు అంటే ఒక శాతం కేసుల్లో మాత్రమే క్రిమినల్స్కు శిక్షలు పడ్డాయని తెలిపింది. సైబర్ క్రైమ్స్ను అరికట్టేందుకు సపరేట్గా ఓ లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థ ఉండాలంది. ప్రభుత్వం 200 కి పైగా బ్యాంకింగ్ మాల్వేర్ ఉన్న యాప్లను గుర్తించిందని, గూగుల్తో వీటి వివరాలు పంచుకున్నామని తెలిపింది. సైబర్ ఫ్రాడ్స్ను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలను రికమండ్ చేసింది.