
న్యూఢిల్లీ: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్కు చెందిన జియో పేమెంట్స్ బ్యాంక్ సోమవారం ‘సేవింగ్స్ ప్రో’ అనే కొత్త ఫీచర్ను ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా కస్టమర్లు తమ ఖాతాలో ఖాళీగా ఉన్న అమౌంట్పై గరిష్టంగా 6.5శాతం వరకు వడ్డీ సంపాదించొచ్చు. జియో పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులు జియో ఫైనాన్స్ యాప్ ద్వారా కొన్ని క్లిక్స్తోనే సేవింగ్స్ ప్రో ఖాతాకు అప్గ్రేడ్ అవ్వొచ్చు.
ప్రారంభ దశలో కనీసం రూ.5 వేల థ్రెషోల్డ్ అమౌంట్ను సెట్ చేయాలి. ఈ మొత్తాన్ని మించి ఖాతాలో ఉండే డబ్బు తక్కువ రిస్క్ ఉన్న ఓవర్నైట్ మ్యూచువల్ ఫండ్స్లో ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ అవుతాయి. ఈ ఫీచర్ ద్వారా రోజుకు రూ.1,50,000 వరకు పెట్టుబడి పెట్టొచ్చు. సెబీ మార్గదర్శకాలకు అనుగుణంగా రిడెంప్షన్ ప్రాసెస్ జరుగుతుంది.
ఖాతాదారులు తక్షణమే 90శాతం వరకు రిడీమ్ చేసుకోవచ్చు. కానీ రూ.50 వేల వరకు మాత్రమే ఇన్స్టంట్ రిడెంప్షన్ (విత్డ్రా) అందుబాటులో ఉంటుంది. మిగిలిన మొత్తం 1–2 పని రోజులలో అందుతుంది. ఈ సర్వీస్ పూర్తిగా ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. ఎలాంటి ఎంట్రీ/ఎగ్జిట్ ఛార్జీలు, హిడెన్ ఫీజులు లేకుండా, ఖాతాదారులు తమ డబ్బుపై పూర్తి నియంత్రణతో గరిష్ట లాభాలు పొందగలుగుతారని కంపెనీ పేర్కొంది. మ్యూచువల్ ఫండ్స్ ఎంపిక, థ్రెషోల్డ్ సెట్/మార్పు, రిటర్న్స్ ట్రాకింగ్ వంటివి ఒకే దగ్గర ఉంటాయని తెలిపింది. ఈ ఫీచర్ ద్వారా స్మార్ట్ సేవింగ్స్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కంపెనీ పేర్కొంది.