- ఐదు కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చే చాన్స్
- వెల్లడించిన సీఐఐ స్టడీ రిపోర్ట్
న్యూఢిల్లీ : కొత్త యునికార్న్లు భారత ఆర్థిక వ్యవస్థకు భారీగా ప్రయోజనాలను తెచ్చిపెడతాయని తేలింది. ఇవి జీడీపీకి ట్రిలియన్ డాలర్లను అందించే అవకాశం ఉందని తాజా స్టడీ ద్వారా వెల్లడయింది. 2030 నాటికి భారత జీడీపీ విలువ 7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, కొత్తగా ఐదు కోట్ల మందికి ఉద్యోగాలు వస్తాయని పరిశ్రమల సంస్థ సీఐఐ వెల్లడించింది. బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన స్టార్టప్ సంస్థలను యునికార్న్గా పిలుస్తారు.
నాలెడ్జ్ పార్టనర్గా మెకిన్సే అండ్ కంపెనీతో కలిసి ‘యునికార్న్ 2.0: యాడింగ్ ది నెక్స్ట్ ట్రిలియన్ డాలర్స్’ పేరుతో నివేదికను రూపొందించినట్లు సీఐఐ తెలిపింది. దీనిప్రకారం...యునికార్న్ 2.0 వల్ల 2030 ఆర్థిక సంవత్సరం నాటికి ఆర్థిక వ్యవస్థకు స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ ట్రిలియన్ డాలర్లను అందించగలుగుతుంది. రిటైల్, ఈ–-కామర్స్, తదుపరి తరం ఆర్థిక సేవలు, తయారీ, సాఫ్ట్వేర్యాజ్ సర్వీస్, డిజిటల్ వంటి రంగాలు రాబోయే సంవత్సరాల్లో భారీ వృద్ధిని సాధించడానికి సిద్ధంగా ఉన్నాయి.
మనదేశంలో 2011లో మొట్టమొదటి యునికార్న్ ఆవిర్భవించింది. దశాబ్దం తర్వాత భారతదేశంలో యునికార్న్ల సంఖ్య వంద దాటింది. జనవరి 2024 నాటికి 113 యునికార్న్ల మొత్తం విలువ 350 బిలియన్ డాలర్లు ఉంది. వందకు పైగా యునికార్న్ల ఆవిర్భావం ఒక గొప్ప విజయమని, మొబైల్ ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరగడం, మధ్యతరగతి ఎదుగుదల, డిజిటల్ నైపుణ్యాలు కలిగిన యువ జనాభాను కలిగి ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని సీఐఐ ప్రెసిడెంట్ దినేష్ అన్నారు. స్టార్టప్ ఎకోసిస్టమ్ ఎంతో శక్తివంతమైనదని కామెంట్ చేశారు.
2023–24 ఆర్థిక సంవత్సరంలో 140 బిలియన్ డాలర్లు
సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ మాట్లాడుతూ స్టార్టప్లు, కార్పొరేట్లు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదపడుతున్నాయని చెప్పారు. ఇవి 2022–-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థకు 140 బిలియన్ డాలర్లను అందించాయని వివరించారు. "2030 నాటికి ఈ విలువ ట్రిలియన్ డాలర్లకు పెరగవచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. స్టార్టప్ల ప్రభావం బ్యాలెన్స్ షీట్స్కు మించి ఉంటుంది.
భారతదేశంలో విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలకు ఎంతో మేలు జరుగుతుంది. స్టార్టప్లు మార్పునకు ప్రతినిధులు అవుతాయి”అని ఆయన వివరించారు. సీఐఐ నివేదిక ఫలితాల ప్రకారం, భారతదేశంలోని వందకుపైగా యునికార్న్స్, సుమారు లక్ష స్టార్టప్లు 2016– 2023 మధ్య జీడీపీకి 15 శాతం వరకు ఆర్థికపరమైన మద్దతును ఇచ్చాయి. వేగవంతమైన డిజిటలైజేషన్ పట్టణ కేంద్రాలను మార్చడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది.
అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కాయి. ఉపాధి అవకాశాలు 20–-25 శాతం పెరిగాయి. తొమ్మిది సూర్యోదయ రంగాలను (వృద్ధికి అవకాశాలు ఉన్న కొత్త వ్యాపార రంగాలు), భారతదేశ ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేయడంలో స్టార్టప్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి - తయారీ, ఐటీ, డిజిటల్ సేవలు, వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలు, ఆరోగ్య సంరక్షణ సేవలు, ప్రయాణం పర్యాటకం, ఆధునిక రిటైల్, ఈ–-కామర్స్, తదుపరి తరం ఆర్థిక సేవలు, కమ్యూనికేషన్, మీడియా వినోదం వంటి రంగాలను సన్రైజ్సెక్టార్స్గా పిలుస్తున్నారు. ఈ రంగాలు ప్రస్తుత వృద్ధికి ఇంజన్లుగా మారుతాయని సీఐఐ పేర్కొంది. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి వీటితో ఎగుమతులపై 20–-23 రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి.