మార్చి 29తో ముగియనున్న ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీకాలం
బూడిద భిక్షమయ్యకే సీటు ఖాయమంటున్న అనుచరులు
కాంగ్రెస్ లీడర్ను తీసుకొచ్చే ప్రయత్నంలో ఎమ్మెల్యే పైళ్ల
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ సీటుపై అధికార పార్టీ నాయకుల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. దీంతో ఈ సీటు ఎవరికి కేటాయిస్తారన్న విషయం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఈ సీటు బీఆర్ఎస్కే చెందిన ఓ లీడర్కు కేటాయిస్తారని కొందరు అంటుండగా, కాంగ్రెస్కు చెందిన ఓ నాయకుడిని అధికార పార్టీలో చేర్చుకొని అతడిని ఎమ్మెల్సీ చేస్తారంటూ మరికొందరు అంటున్నారు.
ఎమ్మెల్సీ సీటుపై బూడిద ధీమా...
ప్రతిపక్షాలకు తగినంత బలం లేనందున ఎమ్మెల్యే కోటలో ఖాళీ అవుతున్న ఈ సీటు తిరిగి అధికార పార్టీకే దక్కనుంది. కృష్ణారెడ్డికి మరోసారి పదవి ఇచ్చే చాన్స్ లేకపోవడంతో ప్రస్తుతం కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే ఈ సీటు తనకే దక్కుతుందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ధీమాతో ఉన్నారు. ఈయన 2018 ఎన్నికల్లో ఆలేరు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీఆర్ఎస్లో చేరి మూడేళ్లు పనిచేశారు. అక్కడ తగినంత గుర్తింపు లేదంటూ బీఆర్ఎస్ను వదిలి బీజేపీలో చేరారు. ఇటీవల జరిగిన మునుగోడు బైపోల్ టైంలో అనూహ్యంగా మళ్లీ బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. అయితే జిల్లాలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ సీటు తనకే ఇస్తానని సీఎం కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ వచ్చినందునే భిక్షమయ్యగౌడ్ బీఆర్ఎస్లో చేరినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఈ సారి ఎలాగైనా ఎమ్మెల్సీ సీటు భిక్షమయ్యగౌడ్కు దక్కడం ఖాయమని ఆయన అనుచరులు కూడా ధీమాగా ఉన్నారు.
కాంగ్రెస్ లీడర్ను చేర్చుకునేందుకు పైళ్ల ప్రయత్నం
యాదాద్రి జిల్లా కాంగ్రెస్కు చెందిన ఓ ముఖ్య నాయకుడిని బీఆర్ఎస్లో చేర్చుకొని, అతడిని ఎమ్మెల్సీ చేసేందుకు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి ప్రయత్నిస్తున్నారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరితే ఎమ్మెల్సీ టికెట్ ఇప్పిస్తానని పైళ్ల శేఖర్రెడ్డి ఇప్పటికే సదరు లీడర్కు హామీ ఇచ్చినట్లు సమాచారం. వాస్తవానికి 2021 నవంబర్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల టైంలోనే సదరు కాంగ్రెస్ లీడర్ను బీఆర్ఎస్లో చేర్పించేందుకు పైళ్ల ప్రయత్నం చేశారని ఆ పార్టీ లీడర్లు అంటున్నారు. పాడి కౌశిక్రెడ్డి గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఎంపికైతే, యాదాద్రి జిల్లాకు చెందిన ఆ కాంగ్రెస్ లీడర్ను అప్పుడే ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ చేసేందుకు ప్రయత్నించారని సమాచారం. కానీ కౌశిక్రెడ్డి నామినేట్విషయంలో ఆటంకాలు ఎదురుకావడంతో అతడిని ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ చేశారు. దీంతో జిల్లాకు చెందిన కాంగ్రెస్ లీడర్ చేరిక లేట్ అయిందని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పదవీకాలం ముగుస్తుండడంతో ఆ కాంగ్రెస్ లీడర్ను బీఆర్ఎస్లో చేర్చుకొని పదవి ఇచ్చేందుకు పైళ్ల శేఖర్రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టారని ఆ పార్టీ లీడర్లు చెబుతున్నారు. దీంతో త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ సీటు అధికార పార్టీ నాయకులకు దక్కుతుందా ? లేక కాంగ్రెస్ నుంచి చేరిన లీడర్కా ? అన్న చర్చ సాగుతోంది.