
- కాఫర్ డ్యామ్ కట్టడమా.. రింగ్ బండ్ నిర్మించడమా అనే దానిపై స్టడీ
- మరోవైపు బావర్, సీడబ్ల్యూపీఆర్ఎస్ ప్రతినిధులతో అధికారుల సంప్రదింపులు
- డయాఫ్రమ్ వాల్కు సహకరిస్తామన్న బావర్ సంస్థ
- జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ వరకు చేస్తామన్న సీడబ్ల్యూపీఆర్ఎస్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. కొద్ది రోజుల కింద మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) తుది నివేదికను సమర్పించింది. ఈ నేపథ్యంలోనే సీడబ్ల్యూసీతోపాటు పలువురు నిపుణులతో సంప్రదింపుల అనంతరం బ్యారేజీల పునరుద్ధరణపై ప్రభుత్వం ఓ కమిటీ వేసినట్టు తెలిసింది. సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా చైర్మన్గా, ఈఎన్సీ జనరల్, రాష్ట్ర అధికారులు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ.. మేడిగడ్డలో కాఫర్ డ్యామ్ నిర్మించడమా లేదంటే రింగ్బండ్ లాంటి నిర్మాణాల ద్వారా పునరుద్ధరణకు సంబంధించిన చర్యలు చేపట్టడమా అనేది నిర్ణయించనున్నది.
వరద ముప్పులో పంప్హౌస్లు
మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వద్ద ప్రస్తుతం జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్లు చేయించేందుకు అనువైన పరిస్థితులు లేవని అధికారులు గుర్తించారు. అక్కడ ఇప్పటికే వరద మొదలు కావడం, ఇసుక మేటలు వేయడంతో టెస్టులు సాధ్యమయ్యే పరిస్థితి లేదని చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి పనులు చేయాలన్నా లోపలికి అప్రోచ్ రోడ్లను నిర్మించాల్సి ఉంటుందని.. ప్రస్తుత వర్షాలు, వరదలతో ఆ పనులు సాధ్యం కావని అంటున్నారు. ఇక, చాన్నాళ్లపాటు ఇటు బ్యారేజీలు, అటు పంప్హౌస్ల మెయింటెనెన్స్లేకపోవడంతో.. పూర్తి ఓ అండ్ఎం పనులు చేయాలని అధికారులు, నిర్మాణ సంస్థలకు ఈఎన్సీ జనరల్ సూచించినట్టు తెలిసింది. గేట్లకు గ్రీజింగ్, చిన్న చితకా రిపేర్లు ఏవైనా ఉంటే చేపట్టాలని సూచించినట్టు సమాచారం. మరోవైపు పంప్హౌస్ల మెయింటెనెన్స్ లేకపోవడంతో అవి కూడా మరోసారి ప్రమాదానికి గురయ్యే ముప్పు ఉందని అధికారులు భావిస్తున్నారు. పంప్హౌస్లకూ అవసరమైన ఓ అండ్ ఎం పనులు చేయాల్సిందిగా నిర్మాణ సంస్థలకు సూచనలిచ్చినట్టు తెలిసింది. అన్నారం పంప్హౌస్ చుట్టూ రక్షణగా నిర్మిస్తున్న గోడ నిర్మాణం అసంపూర్తిగా ఉన్నది. వరదలు మొదలవుతున్న నేపథ్యంలో ఆ గోడ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, లేదంటే మరోసారి పంప్హౌస్ మునిగే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. వర్షాకాలం వచ్చేసిన నేపథ్యంలో వీలైనంత త్వరగా బ్యారేజీలు, పంప్హౌస్లకు సంబంధించిన అన్ని ఓ అండ్ ఎం యాక్టివిటీస్ను పూర్తి చేయాల్సిందిగా సూచించినట్టు తెలిసింది.
రంగంలోకి బావర్ సంస్థ
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కన్సల్టెంట్గా వ్యవహరించిన అంతర్జాతీయ సంస్థ బావర్ కూడా మేడిగడ్డ పునరుద్ధరణపై రంగంలోకి దిగుతున్నది. దీనిపై ఇప్పటికే బావర్ సంస్థ ప్రతినిధులతో ఇరిగేషన్ శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్టు తెలిసింది. ఎన్డీఎస్ఏ చెప్పిన ప్రకారం రీహాబిలిటేషన్ డిజైన్లను సూచించాలని బావర్ సంస్థ ప్రతినిధులను అధికారులు కోరగా.. సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. బ్యారేజీ పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై మాత్రమే తాము సూచనలిస్తామని.. డయాఫ్రమ్ వాల్ వంటి నిర్మాణానికి సహకారం అందిస్తామని చెప్పినట్టు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో సంస్థ ప్రతినిధులు మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శిస్తారని ఇరిగేషన్ ఆఫీసర్లు చెప్తున్నారు. ఇటు మేడిగడ్డ బ్యారేజీ కుంగినప్పటి నుంచి అక్కడ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ నిర్వహించిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్)తోనూ బ్యారేజీకి సంబంధించిన పూర్తి పునరుద్ధరణ పనులపై అధికారులు చర్చించినట్టు తెలిసింది. సీడబ్ల్యూపీఆర్ఎస్కూడా తాము ఇన్వెస్టిగేషన్ల వరకు మాత్రమే చేస్తామని, మిగతా విషయాల్లో జోక్యం చేసుకోబోమని చెప్పినట్టు సమాచారం.