ఎల్బీ నగర్, వెలుగు: పోగొట్టుకున్న బంగారాన్ని బాధితులకు 10 గంటల్లోనే అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు అందజేశారు. ఇన్స్పెక్టర్ స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాజమండ్రి నుంచి బంధువుల కారులో సిటీకి వచ్చిన గద్దె సోనియా సాయంత్రం 4 గంటలకు అబ్దుల్లాపూర్ మెట్లోని రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర దిగింది. కొంత దూరం నడుచుకుంటూ వెళ్లిన తర్వాత ఆమె నగల బ్యాగ్ కనిపించలేదు.
అందులో 10 తులాల బంగారు నగలు ఉండటంతో వెంటనే సోనియా అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్లో కంప్లయింట్ చేసింది. కేసు ఫైల్ చేసి సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోనియా బ్యాగ్ పడేసుకున్న తర్వాత బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి దాన్ని చూసి ఇంటికి తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. శుక్రవారం అతడి ఇంటికి వెళ్లి బ్యాగ్ ను కలెక్ట్ చేసుకున్నారు. తర్వాత సోనియాకు నగల బ్యాగ్ ను అందజేశారు.