
- ఇందిరమ్మ ఇంటి బిల్లు మంజూరుకు రూ.20 వేలు డిమాండ్ చేసిన విలేజ్ సెక్రటరీ
- వీఎల్టీ ఇచ్చేందుకు రూ. 7 వేలు తీసుకున్న ఆర్ఐ
- రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ ఆఫీసర్లు
మంచిర్యాల, వెలుగు : ఇందిరమ్మ ఇంటి బిల్లు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన విలేజ్ సెక్రటరీని ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామానికి చెందిన డోల్క నాగమణి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటోంది. బేస్మెంట్ లెవల్ పూర్తి కావడంతో మొదటి విడత బిల్లు కోసం ఇంటి ఫొటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని విలేజ్ సెక్రటరీ వెంకటస్వామిని కలవడంతో అతడు రూ. 30 వేలు డిమాండ్ చేశాడు.
దీంతో రూ. 20 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్న నాగమణి తర్వాత ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేసింది. వారి సూచన మేరకు బుధవారం సెక్రటరీ వెంకటస్వామిని తన ఇంటికి పిలిచి రూ.20 వేలు ఇచ్చింది. అప్పటికే అక్కడ ఉన్న ఆదిలాబాద్ ఏసీబీ ఇన్చార్జి డీఎస్పీ పి.విజయ్కుమార్ సెక్రటరీని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాడు.
పంచాయతీ ఆఫీస్లో ఎంక్వైరీ చేసిన అనంతరం వెంకటస్వామని అరెస్ట్ చేసి కరీంనగర్కు తీసుకెళ్లారు. గురువారం ఉదయం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. దాడిలో ఇన్స్పెక్టర్లు కిరణ్, తిరుపతి పాల్గొన్నారు.
వీఎల్టీ ఇచ్చేందుకు రూ. 7 వేలు తీసుకుంటూ...
నిజామాబాద్, వెలుగు : ఖాళీ స్థలానికి వెకెంట్ ల్యాండ్ నంబర్ ఇచ్చేందుకు రూ. 7 వేలు తీసుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ను ఏసీబీ ఆఫీసర్లు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన అవినాశ్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యాడు. వినాయకనగర్లో ఖాళీ స్థలాన్ని అద్దెకు తీసుకొని ఫ్రూట్ షాప్ ఏర్పాటు చేసుకున్నాడు.
షాప్కు విద్యుత్ మీటర్ కోసం ఖాళీ జాగాపై వీఎల్టీ ఇవ్వాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ కర్న శ్రీనివాసరావును కలువగా.. అతడు రూ. 10 వేలు డిమాండ్ చేశాడు. రూ.7 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న అవినాశ్ తర్వాత ఏసీబీ ఆఫీసర్లను కలిశాడు.
వారి సూచన మేరకు బుధవారం ఆర్ఐ శ్రీనివాస్రావును కలిసి డబ్బులు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ డీఎస్పీ శేఖర్గౌడ్ తన సిబ్బందితో కలిసి ఆర్ఐని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆఫీస్లో సోదాలు నిర్వహించిన అనంతరం ఆర్ఐని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టేందుకు తీసుకెళ్లారు.