హైదరాబాద్: రీసెంట్గా ముగిసిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎలక్షన్కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ విజువల్స్ కావాలని సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ కోరారు. ఈ మేరకు ఎలక్షన్ తాలూకు వీడియో దృశ్యాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్కు ఆయన లేఖ రాశారు.
‘ఎలక్షన్కు సంబంధించిన ప్రతి సమాచారాన్ని పొందే హక్కు మాకు ఉంది. పోలింగ్రోజు కొంతమంది వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. మోహన్ బాబు, నరేశ్ మా సభ్యులను బెదిరించారు, దాడులకు పాల్పడ్డారు. ఈ ఎన్నికలు జరిగిన తీరు జనంలో మనల్ని చులకన చేసింది. అసలేం జరిగిందన్నది ‘మా’ సభ్యులు కూడా తెలుసుకోవాలని భావిస్తున్నారు. పోలింగ్ సమయంలో సీసీ కెమెరాలు వాడినట్లు మీరే చెప్పారు. ఆ సీసీటీవీ దృశ్యాలు మాకు ఇవ్వండి. సీసీటీవీ విజువల్స్ ఇవ్వమని అడిగే హక్కు మాకు ఉంది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 3 నెలల వరకు దృశ్యాలు భద్రపరచడం మీ బాధ్యత’ అని కృష్ణ మోహన్కు రాసిన లెటర్లో ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.
ఇచ్చేందుకు రెడీ
‘మా’ ఎలక్షన్ జరిగిన రోజు సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలంటూ ప్రకాశ్ రాజ్ రాసిన లేఖపై ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ స్పందించారు. సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సీసీటీవీ విజువల్స్ తమ ఆఫీసులో సేఫ్గా ఉన్నాయని చెప్పారు. అయితే రూల్స్ ప్రకారం ఎవరు అడిగినా ఇచ్చేందుకు సిద్ధమని పేర్కొన్నారు.