కాక్పిట్లోకి అనధికారిక మహిళలు ప్రవేశిస్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. సరిగ్గా నెలరోజుల క్రితం స్నేహితురాలిని కాక్పిట్లోకి అనుమతించిన పైలట్ను డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఎయిర్ ఇండియా సంస్థకు డీజీసీఏ రూ.30 లక్షల జరిమానా కూడా విధించింది. అయినప్పటికీ.. నెల రోజుల తర్వాత మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది.
స్నేహితురాలితో సంభాషించడానికి సమయం లేదనుకున్న ఫైలెట్లు ఆమెను కాక్ పిట్లోకి ఆహ్వానించారు. ఈ ఘటన గత వారం ఢిల్లీ నుంచి లేహ్(ఏఐ-445)కి ప్రయాణించిన ఎయిర్ ఇండియా విమానంలో చోటుచేసుకుంది. ఈ విషయంపై క్యాబిన్ సిబ్బంది ఎయిర్ ఇండియా యాజమాన్యానికి పిర్యాదు చేయడంతో.. వారు పైలట్, కో పైలట్పై చర్యలు తీసుకున్నారు. వారిని విధులకు దూరంగా ఉంచారు.
"ఏఐ-445 విమాన పైలట్ మహిళా స్నేహితురాలు నిబంధనలు పాటించకుండా కాక్ పిట్లోకి ప్రవేశించిందని, ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరు పైలట్లను సంస్థ విధులకు దూరంగా ఉంచిందని ఎయిర్ ఇండియా ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
ఈ ఘటనపై డీజీసీఏ స్పందిస్తూ.. 'ఈ విషయం డీజీసీఏకు తెలుసనీ, విధివిధానాలకు అనుగుణంగా ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. దర్యాప్తు కోసం ఇప్పటికే ఎయిర్ ఇండియా సంస్థ ఓ కమిటీని ఏర్పాటు చేసిందని ఓ అధికారి మీడియాకు తెలిపారు. దీనిపై ఎయిర్ ఇండియా నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.