హాంకాంగ్ : ప్రపంచంలోనే అతి పెద్ద ఈ–కామర్స్ కంపెనీగా పేరొందిన అలీబాబా హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజీలో ప్రైమరీ లిస్టింగ్ పొందాలని చూస్తోంది. చైనా ఇన్వెస్టర్లకు మరింత అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే షేర్ల లిస్టింగ్ స్టేటస్ను మార్చుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. టెక్ కంపెనీలు తమ సంపదను పబ్లిక్తో పంచుకోవాలని చైనా ప్రభుత్వం ఇటీవల కాలంలో కొంత ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలోనే అలీబాబా తాజా నిర్ణయం తీసుకుంది. 2022 చివరికి హాంకాంగ్ ఎక్స్చేంజ్లో ప్రైమరీ లిస్టింగ్ పూర్తవుతుందని అంచనా. ఇప్పటికే అలీబాబా షేర్లు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజీలో ప్రైమరీ స్టేటస్తో ట్రేడవుతున్నాయి. తాజా నిర్ణయంతో రెండు ఎక్స్చేంజీలలోనూ ప్రైమరీ స్టేటస్తో ట్రేడయ్యే కంపెనీగా అలీబాబా మారుతుంది.
ఇన్వెస్టర్ బేస్ పెంచుకునే క్రమంలోనే మరో ఎక్స్చేంజీని వెతకడం మొదలు పెట్టినట్లు అలీబాబా సీఈఓ డేనియల్ ఝాంగ్ చెప్పారు. హాంకాంగ్ కూడా న్యూయార్క్లాగే పెద్ద ఫైనాన్షియల్ సెంటర్ కావడంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. చైనా ఎకానమీ, భవిష్యత్ పట్ల తమకు నమ్మకం ఉందని, కంపెనీ గ్లోబలైజేషన్ స్ట్రాటజీకి హాంకాంగ్ లిస్టింగ్ సాయపడుతుందని పేర్కొన్నారు. తాజా చొరవ వల్ల లక్షలాది మంది చైనీయులు కంపెనీ ఇన్వెస్టర్లుగా మారడం ఈజీ అవుతుందని వివరించారు. ఆడిటింగ్ రూల్స్ను పూర్తి స్థాయిలో పాటించకపోతే చైనా కంపెనీలకు డీ లిస్టింగ్ తప్పదని అమెరికా రెగ్యులేటర్లు గతంలో హెచ్చరించిన విషయం తెలిసిందే.