
- నిమిషాల వ్యవధిలో క్లోజ్
- నెలనెలా మీసేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్న దివ్యాంగులు
- స్లాట్స్ సంఖ్య పెంచాలని వేడుకోలు
కరీంనగర్, వెలుగు: సదరం క్యాంపునకు హాజరు కావాలనుకునే దివ్యాంగులకు నెలల తరబడి తిరిగినా స్లాట్ బుక్ కావడం లేదు. నెల, రెండు నెలలకోసారి అధికారులు స్లాట్స్ విడుదల చేయగానే.. నిమిషాల్లో క్లోజ్ అయిపోతున్నాయి. సదరం క్యాంపునకు హాజరయ్యేందుకు ఎదురు చూసే దివ్యాంగుల సంఖ్య ఎక్కువగా ఉండడం, స్లాట్స్ సంఖ్య తక్కువగా ఉండడంతో తిప్పలు తప్పడం లేదు. దీంతో వారు ఒక నెల బుకింగ్స్ అయిపోతే మరో నెల వరకు ఎదురుచూడాల్సి వస్తోంది. ఇలా సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్న దివ్యాంగులు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు.
స్లాట్స్ రిలీజైన రోజు మీ సేవ కేంద్రాల్లో బారులు
వైకల్య ధ్రువీకరణ కోసం ఎవరైనా సదరం క్యాంపులకు హాజరు కావాల్సి ఉంటుంది. గతంలో మండల, డివిజన్ కేంద్రాల్లో ఒకేసారి వేలాది మందికి క్యాంపులు పెట్టి నిర్ధారణ పరీక్షలు చేసేవారు. కానీ, ఆ తర్వాత నెలకు 50 నుంచి 100 సాట్ల చొప్పున రిలీజ్ చేస్తున్నారు. ఇందులో కంటి చూపు, ఆర్థో, మానసిక బుద్ధి మాంద్యం, వినికిడి(మూగ, చెవుడు) తదితర దివ్యాంగులను అసెస్ చేస్తున్నారు. డీఆర్డీఏ ముందుగా ప్రకటించిన రోజున నిర్ణీత సమయంలోనే మీ సేవ కేంద్రాల వద్దకు వెళ్లి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
దీంతో అధికారులు ప్రకటించిన రోజు జిల్లాలోని అన్ని మీ సేవ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వారి బంధువులు బారులు తీరుతున్నారు. ఆపరేటర్లు స్లాట్ కోసం వివరాలు నమోదు చేయడం ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే మొత్తం స్లాట్స్ క్లోజ్ అయినట్లు చూపుతుండడంతో చాలా మంది నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఒక్కో సెంటర్ లో ఒకటి, రెండు స్లాట్లు మాత్రమే నమోదవుతున్నట్లు ఆపరేటర్లు వెల్లడిస్తున్నారు.
పెద్దపల్లిలో ప్రీ స్క్రీనింగ్ క్యాంప్
పెద్దపల్లి జిల్లాలో అర్హులైన దివ్యాంగులకు మీ సేవ కేంద్రాల్లో స్లాట్లు బుక్ కాకపోవడం, అనర్హులే స్లాట్స్ బుక్ చేసుకుంటుండడంతో డీఆర్డీఏ అధికారులు స్పె షల్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా స్లాట్ బుక్ చేసుకునేందుకు అర్హులెవరో తేల్చేందుకు జనవరి 23న పీహెచ్ సీల్లో ప్రీ స్క్రీనింగ్క్యాంప్ నిర్వహించారు. ఇందులో 300 మందిని గుర్తించి ఫిబ్రవరి, మార్చిలో స్లాట్ బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో వీరికి మీ సేవ కేంద్రాల చుట్టూ తిరిగే ఇబ్బందులు తప్పాయని డీఆర్డీఓ శ్రీధర్ వెల్లడించారు. ఆర్థో విభాగంగా కాంపిటీషన్ ఎక్కువ ఉన్నందున వీరికే అవకాశం ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
రెన్యువల్ కోసం ఇబ్బందులు..
వైకల్యాన్ని నిర్ధారించే క్రమంలోనే కొందరికి పర్మినెంట్ సదరం సర్టిఫికెట్, మరికొందరికి రెండు, మూడేండ్ల కాలపరిమితితో సర్టిఫికెట్లు జారీ చేస్తుంటారు. ఇలా రెండు, మూడేండ్ల కాలపరిమితితో సర్టిఫికెట్లు పొందినవాళ్లు..గడువు తీరిన తర్వాత మళ్లీ స్లాట్ బుక్ చేసుకుని వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. లేదంటే వారికి ఆసరా పింఛన్ ఆగిపోతుంది. ఇలాంటి వారు స్లాట్స్ బుక్ కాక నెలల తరబడి మీ సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీంతో నెలలు, సంవత్సరాల తరబడి పింఛన్ కోల్పోతున్న బాధితులు వందల్లో ఉన్నారు.
ఇది తమ హక్కులను హరించడమేనని, ఇప్పటికైనా స్లాట్స్ సంఖ్య పెంచి అర్హులందరికీ సదరం సర్టిఫికెట్లు జారీ చేయాలని దివ్యాంగులు కోరుతున్నారు. దివ్యాంగులకు స్లాట్ వ్యవస్థ ద్వారా తీవ్ర అన్యాయం జరుగుతోందని, స్లాట్ దొరకకపోవడం వల్ల సదరం సర్టిఫికెట్ పొందలేకపోవడం, పింఛన్ రాకపోవడం దివ్యాంగుల హక్కుల చట్టం ఉల్లంఘన కిందకే వస్తుందని కోర్ట్ ఆఫ్ స్టేట్ కమిషన్ ఫర్ పర్సనల్ డిసేబులిటిస్ లో సెర్ప్ సీఈఓను ప్రతివాదిగా చేరుస్తూ ఇప్పటికే సామాజిక కార్యకర్త ఎండీ షాబుద్దీన్ ఫిర్యాదు చేశారు.
మూడేండ్లుగా తిరుగుతున్నా..
నాకు చెవులు వినిపించవు. 2018లో సదరం సర్టిఫికెట్ రెండేండ్ల గడువుతో ఇచ్చారు. ఆ కాల పరిమితి ముగియగానే పింఛన్ ఆగిపోయింది. 2021 నుంచి రెన్యువల్ కోసం తిరుగుతున్నా. స్లాట్ బుక్ కాకపోవడంతో సర్టిఫికెట్ రావడం లేదు. రెన్యువల్ కోసం వచ్చేవాళ్లకయినా స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి
-భూమయ్య, దివ్యాంగుడు, నగునూరు