పాలమూరు జిల్లాలో సగటున నెలకు 20 కేసులు

పాలమూరు జిల్లాలో సగటున నెలకు 20 కేసులు
  • మూడేండ్లలో 587 ఫోక్సో, రేప్​ కేసులు నమోదు
  • మహిళలు, మైనర్లపై వేధింపులు, లైంగిక దాడులు
  • టెక్నాలజీతో పాటే పెరుగుతున్న క్రైం రేట్​

మహబూబ్​నగర్​, వెలుగు : మహిళలు, మైనర్లపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. 2020తో పోలిస్తే 2022లో రేప్​,  ‘ఫోక్సో’ కేసులు డబుల్​ అయ్యాయి. మహబూబ్​నగర్​ జిల్లాలో  సగటున నెలకు ఇలాంటి కేసులు 20 వరకు  ఫైల్​అవుతున్నట్లు పోలీస్​ రికార్డులు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆన్​లైన్​ క్లాసుల పేరుతో ఆరో తరగతి​ నుంచే పిల్లలకు సెల్​ఫోన్లు కొనివ్వడం.. సెవెన్త్​ క్లాస్​ నుంచే స్టూడెంట్లు ప్రేమ పేరుతో అట్రాక్ట్​ కావడం.. వీడియో కాల్స్​ మాట్లాడటం లాంటి కారణాల వల్ల ఇలాంటి కేసులు పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.

టెక్నాలజీతో పాటే..

జిల్లాలో మూడేళ్లలో రేప్​, ఫోక్సో కేసులు 587 నమోదు అయ్యాయి. ఇందులో ఫోక్సో కేసులు 2020లో 77 ఉండగా, 2021లో 122, 2022లో 127 కేసులు నమోదయ్యాయి. రేప్​ కేసులు 2020లో 65 ఉండగా, 2021లో 92, 2022లో 104  ఫైల్​ అయ్యాయి. అయితే పెరుగుతున్న టెక్నాలజీ వల్లే మహిళలు, మైనర్లపై  అత్యాచారాలు, వేధింపులు పెరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నాయి. కొవిడ్​ లాక్​డౌన్​ టైంలో ఆన్​లైన్​ క్లాసులు  నిర్వహించడంతో ఆరో తరగతి నుంచే స్టూడెంట్ల పేరెంట్స్​ సెల్​ఫోన్లు  చేతికివ్వడంతో వారు మొబైల్స్​ను మిస్​ యూజ్​చేస్తున్నారు. పిల్లలు బెడ్​ రూమ్​లలో కూర్చొని క్లాసెస్​ వింటున్నారా? వీడియో కాల్స్​ మాట్లాడుతున్నా? సోషల్​ మీడియాలో ఉంటున్నారా? అనేది తల్లిదండ్రులు పరిశీలించడం లేదు. 

అడ్వాన్స్​ అయిపోతున్నారు..

ఐదేళ్ల కిందటి వరకు ఇంటర్​, డిగ్రీ చదివే స్టూడెంట్లు ఎక్కువగా లవ్​కు అట్రాక్ట్​అయ్యే వారు. ఇప్పుడు పరిస్థితి మారింది. స్కూలింగ్​స్టేజీలోనే పెరుగుతున్న టెక్నాలజీతో పాటు అడ్వాన్వ్​అవుతున్నారు. 7, 8, 9వ తరగతి పిల్లలు ఫ్రెండ్స్​, లవర్స్​ను మెయిన్​టెయిన్​చేస్తున్నారు. వీరిని అట్రాక్ట్​ చేస్తున్న యువకులు లవ్​ అని నమ్మించి రిలేషన్​లో ఉంటున్నారు. అమ్మాయిల పర్సనల్​ ఫొటోలను షేర్​ చేయించుకుంటున్నారు. వీడియో కాల్స్​ మాట్లాడి వాటిని రికార్డ్​ చేస్తున్నారు. అమ్మాయికి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత రియలైజ్​ అయ్యాక.. తర్వాత బ్లాక్​ మెయిల్​ చేస్తున్నారు. పర్సనల్​గా షేర్​ చేసిన ఫొటోలను సోషల్​ మీడియాలో పోస్ట్​ చేస్తామని బెదిరిస్తున్నారు. వీటికి భయపడి అమ్మాయిలు అలాగే రిలేషన్​షిప్​కంటిన్యూ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడా బయటకు రావడం లేదు. డూ ఆర్​ డై పరిస్థితులున్నప్పుడే యువతులు తల్లిదండ్రులకు విషయాలను చెబుతున్నారు. దీనిపై బాధితులు పోలీస్​ స్టేషన్లకు వస్తున్నా.. అమ్మాయిల తల్లిదండ్రులు కేసులు చేయొద్దంటూ పోలీసులను వేడుకుంటున్నారు. 

‘బ్యాడ్​ టచ్​-గుడ్​ టచ్’పై  అవగాహన 

మూడేళ్ల కిందటి వరకు షీ టీంలు జూనియర్​, డిగ్రీ కాలేజీల్లో ప్రతి ఆరు నెలలకోసారి ‘ బ్యాట్​ టచ్​-గుడ్​ టచ్’ గురించి యువతులకు అవగాహన కల్పించేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆరో తరగతి నుంచే పిల్లలకు దీని గురించి అవగాహన కల్పిస్తున్నారు. స్కూళ్లకు వెళ్లేటప్పుడు ఆటో డ్రైవర్లు, స్కూల్ ​బస్సు డ్రైవర్లు, ఇంట్లో ఉండే టైంలో పక్క ఇండ్లలో ఉండే అంకుల్స్​, యువకులు, క్లాస్​ రూమ్​లలో ఉన్నప్పుడు టీచర్లు చేస్తున్న వెకిలి చేష్టలను ఎలా గుర్తించాలనే దానిపై సదస్సుల ద్వారా వివరిస్తున్నారు.

ఉమెన్స్​డే రోజు పాలమూరు జిల్లా మిడ్జిల్​ మండలంలో బాలికపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఏడాది ఆగస్టు 9న మండలంలోని ఓ స్కూళ్లో  నాలుగో తరగతి  బాలికను అదే ప్రాంతానికి చెందిన మైనర్..​ పొలాల్లోకి తీసుకెళ్లి  అత్యాచారం చేయబోయాడు. స్థానికులు ఈ విష యాన్ని పోలీసులకు తెలుపగా, నింది తుడిపై  ‘ఫోక్సో’  కేసు ఫైల్​చేశారు. 

ఈ నెల 2 అర్ధరాత్రి ఉమ్మడి బాలానగర్​ మండలంలోని ఓ తండాకు చెందిన గిరిజన బాలికను ముగ్గురు యువకులు వేధించారు. మనస్తాపంతో ఆ బాలిక మరుసటి రోజే ఇంట్లో ఉరి వేసుకొని సూసైడ్​ చేసుకుంది. దీనిపై పోలీసులు ముగ్గురు యువకులపై ‘ఫోక్సో’ కేసు ఫైల్​ చేసి, రిమాండ్​కు తరలించారు.

అవేర్​నెస్​ కల్పిస్తున్నాం

లవ్​ అనగానే టీనేజర్లు త్వరగా అట్రాక్ట్​ అవుతారు.  వారికి చట్టం గురించి అవగాహన ఉండదు. షీ టీమ్స్​ ద్వారా స్కూళ్లు, కాలేజీల్లో అవేర్​నెస్​ ప్రోగ్రామ్స్​ నిర్వహిస్తున్నాం. ‘బ్యాడ్​ టచ్​- గుడ్​ టచ్’ గురించి వివరిస్తున్నాం. మా వద్దకు వస్తున్న ప్రతి కేసును పరిష్కరిస్తున్నాం. 

- హనుమప్ప, సీఐ, మహబూబ్​నగర్​