లైసెన్స్ పొందేందుకు చాలా కంపెనీలు ముందుకొస్తాయని అంచనా
లాభపడనున్న బజాజ్ ఫిన్సర్వ్ వంటి పెద్ద ఎన్బీఎఫ్సీలు
బిజినెస్ డెస్క్, వెలుగు: క్రెడిట్ కార్డు బిజినెస్లోకి ఎంటర్ అవ్వడానికి ఎన్బీఎఫ్సీలు క్యూ కడతాయని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. అనుమతి పొందిన ఎన్బీఎఫ్సీలు సొంతంగా క్రెడిట్ కార్డులను ఇష్యూ చేయడానికి ఆర్బీఐ వీలుకలిపించిన విషయం తెలిసిందే. దీంతో క్రెడిట్ కార్డ్ లైసెన్స్ కోసం ఎన్బీఎఫ్సీల నుంచి అప్లికేషన్లు కుప్పలు తెప్పలుగా వస్తాయని అంచనావేస్తున్నారు. కొత్త రూల్స్ ప్రకారం, ఆర్బీఐ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫామ్ను పొందిన, నికరంగా రూ. 100 కోట్ల ఫండ్స్ను కలిగివున్న ఎన్బీఎఫ్సీలు క్రెడిట్ కార్డ్ లైసెన్స్ కోసం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆర్బీఐ అనుమతి వస్తే బ్యాంకులతో పార్టనర్షిప్ కుదుర్చుకోకుండానే క్రెడిట్ కార్డులను ఇష్యూ చేయడానికి ఎన్బీఎఫ్సీలకు వీలుంటుంది. అర్హత ఉన్న ఎన్బీఎఫ్సీలు కొన్నే ఉన్నప్పటికీ, ఈ అవకాశాన్ని వదులుకోవడానికి పెద్ద ఎన్బీఎఫ్సీలు వెనకడుగేయకపోవచ్చని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో క్రెడిట్ కార్డ్ బిజినెస్ ఇంకా విస్తరించలేదు. రిటర్న్స్ ఎక్కువగా ఉండడంతో పాటు దేశంలో విస్తరించేందుకు అవకాశాలు ఉండడంతో క్రెడిట్ కార్డ్ బిజినెస్లోకి ఎంటర్ కావడానికి ఎన్బీఎఫ్సీలు ఎప్పటి నుంచో చూస్తున్నాయి. బజాజ్ ఫిన్సర్వ్ వంటి కంపెనీలు బ్యాంకులతో కలిసి కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను కూడా ఇష్యూ చేస్తున్నాయి. ఆర్బీఐ నుంచి లైసెన్స్ పొందితే సొంతంగా క్రెడిట్ కార్డులను ఇష్యూ చేయడానికి ఇటువంటి కంపెనీలకు వీలుంటుంది.
క్రెడిట్ కార్డు బిజినెస్ లాభసాటిదే..
చాలా ఎన్బీఎఫ్సీలు క్రెడిట్ కార్డ్ బిజినెస్పై ఆసక్తి చూపిస్తాయి అని పీఎన్బీ కార్డ్స్ డైరెక్టర్ విజయ్ జాసుజా అన్నారు. ‘క్రెడిట్ కార్ట్ బిజినెస్ లాభసాటిది. రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి. దేశంలో క్రెడిట్ కార్డ్ సెగ్మెంట్ పెద్దగా విస్తరించలేదు. లైసెన్స్ కోసం అప్లయ్ చేసుకునే కంపెనీలు ఎక్కువగానే ఉంటాయని అంచనావేస్తున్నాం. ఇప్పటికే కోబ్రాండెడ్ కార్డులను ఇష్యూ చేస్తున్న ఎన్బీఎఫ్సీలు తమ బ్యాంకింగ్ పార్టనర్లతో కొనసాగడానికి కుదరదు. ఈ కంపెనీలు ఈ రెండు (సొంతంగా లేదా పార్టనర్షిప్తోనా) ఆప్షన్లలో ఎదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది’ అని విజయ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు రెండు ఎన్బీఎఫ్సీలకు మాత్రమే క్రెడిట్ కార్డులను ఇష్యూ చేయడానికి ఆర్బీఐ అనుమతిచ్చింది. ఎస్బీఐ కార్డ్స్, బీఓబీ కార్డ్స్ ప్రస్తుతం క్రెడిట్ కార్డులను ఇష్యూ చేస్తున్నాయి. ఎస్బీఐ కార్డ్స్ ఎస్బీఐ సబ్సిడరీ కాగా, బీఓబీ కార్డ్స్ బీఓబీ సబ్సిడరీ కంపెనీ. ఆర్బీఐ కొత్త రూల్స్ వలన ఎక్కువగా లాభపడేది బజాజ్ ఫిన్సర్వ్ అని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఈ కంపెనీ ఆర్బీఎల్ బ్యాంకుతో కలిసి ఇప్పటికే కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను ఇష్యూ చేస్తోంది. కిందటేడాది డిసెంబర్ నాటికి బజాజ్ ఫిన్సర్వ్–ఆర్బీఎల్ కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల సంఖ్య 25.9 లక్షలకు పెరగడం గమనించాలి. ఆర్బీఎల్ బ్యాంక్తో ఉన్న తన పార్టనర్షిప్ను ఇంకో ఐదేళ్ల పాటు బజాజ్ఫిన్సర్వ్ పొడిగించుకుంది కూడా.
సులువుగా లైసెన్స్..
బజాజ్ ఫైనాన్స్ వంటి పెద్ద ఎన్బీఎఫ్సీలకు లైసెన్స్లను ఇవ్వడంలో ఆర్బీఐ ఓపెన్గా ఉంటుందని మాక్వెరీ రిపోర్ట్ వెల్లడించింది. ప్రస్తుతం ఆర్బీఎల్ బ్యాంకుతో కలిసి కో బ్రాండెడ్ కార్డులను ఇష్యూ చేస్తున్న ఈ కంపెనీ, లైసెన్స్ కోసం అప్లయ్ చేసుకోవచ్చని పేర్కొంది. బజాజ్ ఫిన్సర్వ్ లాంటి కంపెనీలు దేశ క్రెడిట్ కార్డ్ సెగ్మెంట్లో కాంపిటేషన్ పెంచుతాయని అంచనావేసింది. క్రెడిట్ కార్డ్ లైసెన్స్లను ఇవ్వడంలో ఆర్బీఐ సరళంగా వ్యవహరిస్తుందని, బ్యాలెన్స్షీట్ రిస్క్ తీసుకోవడంలో ఎన్బీఎఫ్సీలపై ఈజీగా ఉంటుందని మాక్వైరీ రిపోర్ట్ పేర్కొంది. ‘ఎన్బీఎఫ్సీలు క్రెడిట్ కార్డులను ఇష్యూ చేయడానికి ఆర్బీఐ ముందుకు రావడం ఆహ్వానించదగ్గ చర్య. క్రెడిట్ను పొందడానికి అర్హత ఉన్న వారికి సర్వీస్లు అందించడానికి మా లాంటి ఎన్బీఎఫ్సీలకు వీలుంటుంది’ అని పూనావాలా ఫిన్కార్ప్ ఎండీ అభయ్ భుటడా అన్నారు. కాగా, క్రెడిట్ కార్డ్ లైసెన్స్ కోసం అప్లయ్ చేయాలంటే ఎన్బీఎఫ్సీ కంపెనీల బోర్డులు ఆమోదించాలి. క్రెడిట్ కార్డ్ బిజినెస్ను 6 నెలలకు ఒకసారి ఆడిట్ చేయడానికి ఓ ఆడిట్ కమిటీని ఏర్పాటు చేయాలి.