- జనవరి 1 నుంచి కొత్త జీతాలు అమలు
- పీ ఆర్ సీ 1- 7-2018 నుండి అమలు
- కోవిడ్ బారిన పడిన అమరులైన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు కారుణ్య నియామకాలు
- జూన్ 30 లోగా కారుణ్య నియామకాలన్నీ పూర్తి చేస్తాం
- సీఎం జగన్ కీలక ప్రకటన
అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల ఫిట్ మెంట్ ను 23.29శాతం ఇవ్వనున్నట్లు ఎట్టకేలకు ప్రభుత్వం ప్రకటించింది. సుదీర్ఘ చర్చల అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. పీఆర్సీని 2018 జులై 1 నుంచి ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే కొత్త జీతాలు ఈ జనవరి 1, 2022 నుంచే అమలు చేస్తామని వెల్లడించారు. అలాగే ఉద్యోగుల రిటైర్మంట్ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. మానిటరి బెనిఫిట్ అమలు 2020 ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని తెలిపారు.
‘‘ఉద్యోగ సంఘాలతో నిన్నటి సమావేశం తర్వాత నా కుటుంబ సభ్యులైన ఉద్యోగుల ప్రతినిధులుగా మీరు చెప్పిన అన్ని అంశాలపైనా నిన్ననే సుదీర్ఘంగా కూర్చొని అధికారులతో చర్చించాను. ఈ ఉదయంకూడా మరోవిడత అధికారులతో మాట్లాడాను. నిన్న నేను 2–3 రోజుల్లో ప్రకటిస్తానని చెప్పాను. – కానీ నిర్ణయాన్ని ఎంత వీలైతే అంత త్వరగా చెప్తే మంచిదని భావించి ఈ మేరకు ఉదయం కూడా సమావేశం పెట్టాను. రాష్ట్ర విభజన వల్ల ఏర్పడ్డ సంక్లిష్ట సమస్యలు, కోవిడ్ కారణంగా తలెత్తిన ప్రతికూల పరిస్థితులు, ఒమైక్రాన్ ఎలాంటి ప్రభావం చూపుతుంది? దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ఎలాంటి ప్రభావం చూపబోతుందనే పరిస్థితుల మధ్య మనం ఉన్నామని, నిన్ననే చెప్పడం జరిగింది.
పలు దఫాలుగా చర్చలు జరిపాను. నిన్న ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు. చీఫ్ సెక్రటరీ గారి కమిటీ ఇచ్చిన నివేదికలో పేర్కొన్న ప్రకారం కంటే, 14.29 కంటే ఎంత మాత్రం కూడా ఇచ్చే పరిస్థితిలేదనే విషయాన్ని పదేపదే ఆర్థికశాఖ అధికారులు పలుదఫాలుగా చెప్పారు. మన ఆకాంక్షలుకూడా కాస్త తగ్గాలని కోరాను. అదే సమయంలో ఉద్యోగుల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకోవాలని సీఎస్గారికి, ఆర్థికశాఖ కార్యదర్శికీ చాలా సుదీర్ఘంగా చెప్పాను..’ అని జగన్ వివరించారు. ప్రభుత్వం తీసుకున్నఈ నిర్ణయం వల్ల రూ.10వేల 247 కోట్ల భారం పడుతుందని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి