- కిందటేడాది ఏప్రిల్-డిసెంబర్ మధ్య డబుల్ అయిన ఎగుమతులు
- పాపులర్ మోడల్ ఐఫోన్ 13..స్మార్ట్ఫోన్ల సేల్స్లో 4% వాటా దీనిదే
బిజినెస్ డెస్క్, వెలుగు: దేశం నుంచి 2.5 బిలియన్ డాలర్ల (రూ. 20,500 కోట్ల) విలువైన యాపిల్ స్మార్ట్ఫోన్లు కిందటేడాది ఏప్రిల్–డిసెంబర్ మధ్య ఎగుమతయ్యాయి. చైనాలో కొవిడ్ జీరో పాలసీ అమలవుతుండడం వలన యాపిల్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్లకు ప్రొడక్షన్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో చైనాకు వెలుపల ఐఫోన్ల ప్రొడక్షన్ను పెంచుకుంటున్న యాపిల్, ఇండియాలో తమ ఫోన్ల తయారీని పెంచుతోంది. కిందటేడాది ఏప్రిల్–డిసెంబర్ మధ్య యాపిల్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్స్ ఫాక్స్కాన్, విస్ట్రాన్లు ఇండియా నుంచి బిలియన్ డాలర్ల (రూ.8,200 కోట్ల) చొప్పున ఐఫోన్లను ఎగుమతి చేశాయి. మరో కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ అయిన పెగట్రాన్ 500 మిలియన్ డాలర్ల (రూ.4,100 కోట్ల) విలువైన ఫోన్లను ఎగుమతి చేసిందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. దేశం నుంచి యాపిల్ ఫోన్ల ఎగుమతులు వేగంగా పెరుగుతున్నాయని, దీనిని బట్టి చైనాకు వెలుపల కంపెనీ తన ప్రొడక్షన్ బేస్ను పెంచుకుంటున్న విషయం అర్థమవుతోందని ఎనలిస్టులు పేర్కొన్నారు. యాపిల్ తమ ఐఫోన్లను కిందటేడాది నుంచే ఇండియాలో అసెంబుల్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పటికీ మొత్తం ఐఫోన్ల ప్రొడక్షన్లో కేవలం చిన్న భాగం మాత్రమే ఇండియాలో తయారవుతోంది. అయినప్పటికీ, మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వలన చైనాకు ఆల్టర్నేటివ్గా ఇండియా ఎదగగలుగుతోంది. దేశాన్ని ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్గా మార్చేందుకు పీఎల్ఐ స్కీమ్ను ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఫాక్స్కాన్ ఈ స్కీమ్ కింద మొదటి ఏడాదే రూ. 360 కోట్ల విలువైన రాయితీలను దక్కించుకుంది. విస్ట్రాన్ ఎంత మేర రాయితీలు పొందిందో ఇంకా డేటా బయటకు రాలేదు. యాపిల్ ఫోన్ల సప్లయ్ చెయిన్ చైనాలో బాగా విస్తరించింది. 98 శాతం ఐఫోన్లు అక్కడే తయారవుతున్నాయి. యాపిల్ ఫోన్ల ప్రొడక్షన్ పూర్తిగా ఇండియాకు షిప్ట్ కావడం అంత ఈజీ కాదు.
దేశంలో ఐఫోన్ల హవా..
దేశ స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఐఫోన్ల హవా మొదలయ్యింది. యాపిల్ మొదటిసారిగా దేశంలో టాప్ స్మార్ట్ఫోన్ల సెల్లర్గా నిలవనుంది. ఐఫోన్ 13 ఎక్కువగా అమ్ముడవుతుండడంతో యాపిల్ మార్కెట్ వాటా పెరుగుతుందని మార్కెట్ రీసెర్చ్ కంపెనీ కౌంటర్పాయింట్ రీసెర్చ్ పేర్కొంది. 15 నెలల కిందట లాంచ్ అయిన ఐఫోన్ 13 మోడల్, ప్రస్తుతం దేశంలో పాపులర్ ఐఫోన్ మోడల్గా మారింది. కిందటేడాది అక్టోబర్లో అమ్ముడైన మొత్తం స్మార్ట్ఫోన్ సేల్స్లో ఐఫోన్ 13 వాటా 4 శాతంగా ఉందని ఈ సంస్థ వెల్లడించింది. ఇదే టైమ్లో శామ్సంగ్ గెలాక్సీ ఎం13 , షావోమి రెడ్మీ ఏ1 సేల్స్ వాటా మూడు శాతం చొప్పున ఉంది. పండుగలు ఉండడంతో ఫోన్ల అమ్మకాలు అక్టోబర్లో భారీగా పెరిగాయి. ఈ టైమ్లో ఎక్కువగా అమ్ముడైన టాప్ 5 ఫోన్లలో ప్రీమియం సెగ్మెంట్ నుంచి ఐఫోన్ 13 ఉండడం విశేషం. ఇండియాలో ఐఫోన్ 13 ధర రూ.64,900 గా ఉంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలలోని చివరి వారాల్లో రూ.50,000 కంటే తక్కువకే అందుబాటులోకి వచ్చింది.
స్టోర్ల కోసం హైరింగ్ ..
దేశంలో రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయాలని చూస్తున్న యాపిల్, ఇందులో పనిచేసేందుకు ఉద్యోగుల కోసం వెతుకుతోంది. టెక్నికల్, బిజినెస్, ఆపరేషనల్ స్పెషలిస్టుల కోసం చూస్తోంది.
ఫోన్ల ఎగుమతులకు రిజిస్ట్రేషన్..
స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, మానిటర్లు, మొబైల్ ఫోన్ల విడి భాగాలు వంటి ఎలక్ట్రానిక్ డివైజ్లను ఎగుమతి చేసే కంపెనీలకు రిజిస్ట్రేషన్, మెంబర్షిప్ను ఇష్యూ చేయాలని మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్ డివైజస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఎంఈడీఈపీసీ) కు ప్రభుత్వం ఆదేశించింది. ఫారిన్ ట్రేడ్ పాలసీ (ఎఫ్టీపీ) ప్రకారం, ఎక్స్పోర్ట్స్పై బెనిఫిట్స్ పొందాలంటే ఎగుమతిదారులు కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మెంబర్షిప్ తీసుకోవాలి. అంతేకాకుండా ఈ సర్టిఫికెట్ ఉంటే కస్టమ్స్, ఎక్సైజ్ బెనిఫిట్స్ కూడా పొందే వీలుంటుంది. గతంలో టెలికం ఎక్విప్మెంట్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (టీఈపీసీ) లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ లు నిర్ధిష్టమైన ప్రొడక్ట్లను ఎగుమతి చేసుకోవడానికి రిజిస్ట్రేషన్, మెంబర్షిప్ సర్టిఫికెట్ను ఇష్యూ చేసేది. టీఈపీసీ ఇష్యూ చేసిన ఇటువంటి సర్టిఫికెట్లు సోమవారంతో ఎక్స్పైరి అయిపోయాయి.