ఉదయ్​పూర్​… సరస్సులేవీ?

ఉదయ్​పూర్​…  సరస్సులేవీ?

రాజస్థాన్​లోని ఉదయ్​పూర్..​ ‘సిటీ ఆఫ్​ లేక్స్​ (సరస్సుల నగరం)’గా ఫేమస్. సహజం​గా ఏర్పడ్డ ఆ నీటి వనరులు రాన్రానూ పొల్యూషన్​, ఆక్రమణల బారినపడి నామరూపాలు లేకుండాపోతున్నాయి. దీంతో ఆ నగరం ఇప్పుడు ‘పిటీ ఆఫ్​ లేక్స్ (సరస్సులను చూసి జాలిపడే పరిస్థితి)’​గా మారిపోయింది. ‘మాస్టర్​ ప్లాన్​–2031’ ఏ మేరకు పూర్వ వైభవం తెస్తుందో?.  

ఉదయ్​పూర్..​ రాజస్థాన్​లో దక్షిణ దిక్కున ఉంటుంది. సారవంతమైన ఈ లోయ ప్రాంతానికి చుట్టూ ఎత్తయిన కొండలు సరిహద్దులుగా ఉంటాయి. అడుగడుగునా దట్టమైన అడవులు, రాళ్లతో కూడిన గుట్టలు కనిపిస్తాయి. దీంతో నేచురల్​గా ఏర్పడ్డ సరస్సులకు ఈ నగరం పెట్టింది పేరుగా మారింది. ‘సిటీ ఆఫ్​ లేక్స్​’గా 1568 నాటికే ఫేమస్​. రాణా ఉదయ్​ సింగ్​.. మేవాడ్​​ రాజ్య రాజధానిని చిత్తోర్​గఢ్​ నుంచి ఉదయ్​పూర్​కి మార్చటంతో అప్పటి నుంచి సిటీ ఆఫ్​ లేక్స్​ అనే పేరు స్థిరపడిపోయింది.  ఉదయ్​పూర్​లో ల్యాండ్స్​ ఏటవాలుగా ఉండటంతో వాన నీళ్లన్నీ దిగువ ప్రాంతాలకు చేరి సరస్సులుగా ఏర్పడేవి.  ఆ నీటి ప్రవాహానికి ఎక్కడికక్కడ చిన్న చిన్న ఆనకట్టలు కట్టి తాగు, సాగు నీటి అవసరాలు తీర్చుకునేవారు.  రాజపుత్రులు రిక్రియేషనల్​ ల్యాండ్​స్కేప్​లు ఏర్పాటు చేసుకున్నారు. సిటీకి దక్షిణాన పిఛోలా సరస్సు ఉంటుంది. దాని లోతు 4 నుంచి 8 మీటర్లు. ఈ లేక్​కి చుట్టూ రాతితో డ్యామ్​ నిర్మించి తాగునీరు సప్లయి చేసేవారు.

లేక్​ నెట్​వర్క్​

ఉదయ్​పూర్​లో పిఛోలా సరస్సుతోపాటు బడా మాదర్​, ఛోటా మాదర్​, బడీ తలాబ్​​ సరస్సులు కూడా ఉన్నాయి. ఈ మూడూ ఎగువ ప్రాంతంలో ఉండటంతో వాటిలోని నీరు దిగువ ప్రాంతాల్లోని ఆరు చిన్న సరస్సులతోపాటు ఉదయ్​సాగర్​ సరస్సుకుకూడా వచ్చి చేరుతుంది. పిఛోలా, ఫతేనగర్​ అనే రెండు పెద్ద సరస్సులు  సిటీకి నడిబొడ్డున ఉన్నాయి.  మిగతా సరస్సులు చిన్నపాటి ఓవర్​ఫ్లో ట్యాంకుల్లా పనిచేస్తుంటాయి. ఇవన్నీ లింకేజ్​ ఛానెల్స్​తో కనెక్ట్​ అయి ఉన్నాయి. అందువల్లే ఉదయ్​పూర్​ ఇప్పటికీ డ్రింకింగ్​ వాటర్​ విషయంలో ఏ లోటూ లేకుండా ఉంది. పిఛోలా సరస్సు చుట్టూ ఘాట్​లు, గుళ్లు కట్టారు. ఘాట్​లలో స్నానాల గదులు, ఇతర సౌకర్యాలు కల్పించారు. ఘాట్​లు కుటుంబ వేడుకలకు, ఆధ్యాత్మిక వ్యవహారాలకు వేదికలుగా ఉండేవి. ఒక విధంగా ప్రజల లైఫ్​స్టయిల్​కి కేంద్రాలుగా నిలిచేవి.  వీటిలో ఆడవాళ్ల జానపద పండుగలు, మగవాళ్ల పడవ పోటీలు నిర్వహించేవారు. గతంలో సరస్సులు జనాల నీటి అవసరాలు తీర్చే వనరులుగా ఉండేవి కాదు. ఎకోసిస్టమ్​లో భాగం​గా ఉండి, వాటర్​ రిజర్వ్​లుగా వ్యవహరించేవి. గ్రౌండ్​ వాటర్​ పెరగటానికి ఉపయోగపడేవి.

ఎన్విరాన్​మెంటల్​ ఎమర్జెన్సీ

ఉదయ్​పూర్​లో జనాభా, ఇళ్లు పెరగటంతో సిటీ సరిహద్దులు విస్తరించాయి. కొండ ప్రాంతాలను దాటిపోయాయి. సరస్సుల ఒడ్డున సుమారు 70 ఘాట్​లు, 80కి పైగా హోటళ్లు, 6000 ఇళ్లు వెలిశాయి. దీంతో ఈ నీటి వనరులు దాదాపు కనుమరుగవుతున్నాయి. గట్ల మీదే స్నానాలు చేయటం, బట్టలు ఉతకటం వంటివి పెరిగిపోయాయి. చెత్త, మురుగు, రసాయన మలినాలు, పారిశ్రామిక వ్యర్థాలు చేరుతుండటం; నాచు పేరుకుపోతుండటంతో సిటీకి ఏకైక మంచి నీటి వనరుగా ఉన్న సరస్సులు కాస్తా పొల్యూట్​ అవుతున్నాయి. సరస్సుల నుంచి 250 మీటర్ల లోపు రెస్టారెంట్లు, హోటళ్లు, గెస్ట్​ హౌస్​ల వంటి కమర్షియల్​ సెటప్​లు ఏర్పాటు చేయాలంటే.. హానికరమైన పదార్థాలను సరస్సులోకి వదలబోమని ముందే హామీ ఇవ్వాలని రూలు పెట్టారు. ఈ ప్రాంతంలో లీలా ప్యాలెస్​, ఒబెరాయ్​ ఉదయ్​విలాస్​ వంటి లగ్జరీ హోటళ్లు 2000 సంవత్సరంలో వచ్చాయి. వీటివల్ల టూరిజం ఇంటర్నేషనల్​ లెవల్​లో డెవలప్​ అయింది. కానీ లేక్​ ఫ్రంట్​ ల్యాండ్ రోజురోజుకీ తగ్గుముఖం పట్టింది.

మాస్టర్​ ప్లాన్​–2031​

ఉదయ్​పూర్​లోని​ సరస్సులకు పూర్వ వైభవం తేవటానికి రాజస్థాన్​ సర్కారు మాస్టర్​ ప్లాన్​–2031ని రూపొందించింది. దీని ప్రకారం ఫతేనగర్​, పిఛోలా సరస్సుల చుట్టూ గ్రీన్​ జోన్​లు అభివృద్ధి చేస్తారు.

ఇదొక నది తెలుసా?

ఇదేదో మురుగు కాలువ అనుకునేరు సుమా! ఒకప్పుడు ఉదయ్​పూర్​ నగరం​ మీదుగా పొంగి ప్రవహించిన అయద్​ నది! ఇప్పుడు చిన్నసైజ్​ డ్రైనేజీలా మారిపోయింది. దీన్నిబట్టి నీటి వనరులు ఏవిధంగా ఆక్రమణకు గురయ్యాయో చెప్పక్కర్లేదు. పూడికతీత పనులు చేయాలనే విషయాన్ని ప్రభుత్వం ఎప్పుడో మర్చిపోయింది. పిఛోలా, ఫతేనగర్​ సరస్సులలో నిండిపోయిన నీళ్లన్నీ ఈ నదిలోకి ప్రవేశించేవి.  ఈ నేపథ్యంలో సరస్సు లను రక్షించాల్సిన అవసరాన్ని హైకోర్టు నొక్కి చెప్పింది.