- నవంబర్ నుంచి అంతర్జాతీయ రాకపోకలకు అనుమతి
న్యూఢిల్లీ: వచ్చే నవంబర్ నుంచి విదేశీ ప్రయాణాల కోసం అంతర్జాతీయ సరిహద్దులను తిరిగి తెరవనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ శుక్రవారం ప్రకటించారు. లోకల్స్, పర్మనెంట్ రెసిడెంట్స్ కోసం సరిహద్దులను రీఓపెన్ చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఇండియాకు చెందిన కొవిషీల్డ్, చైనాకు చెందిన సినోవాక్ వ్యాక్సిన్లకు కూడా ఆ దేశ ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. ఈ వ్యాక్సిన్లు వేసుకున్న వారు తమ దేశంలోకి రావొచ్చని పేర్కొంది. ఇప్పటివరకు ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రా జెనెకా వ్యాక్సిన్లను మాత్రమే ఆస్ట్రేలియా గుర్తించింది. వీటిని వేసుకున్న వారికి మాత్రమే తమ దేశంలోకి వచ్చేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు ఇండియా, చైనా వ్యాక్సిన్లకు గుర్తింపు లభించింది.
ఫస్ట్ ఫేజ్లో పర్మనెంట్ రెసిడెంట్స్లు, సిటిజన్స్ను ఆస్ట్రేలియాను విడిచి వెళ్లడానికి అనుమతించనుంది. తర్వాత విదేశీ ప్రయాణికులను దేశంలోకి రావడానికి పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇతర దేశాల నుంచి వచ్చే ఆస్ట్రేలియన్లు ఫుల్ వ్యాక్సిన్ వేసుకున్నా.. ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాల్సిందేనని, అసలు వ్యాక్సిన్ వేసుకోని వారు కచ్చితంగా 14 రోజులు హోటల్ రూమ్లో క్వారంటైన్ అవ్వాలని చెప్పింది. క్వారంటైన్ ఫ్రీ ట్రావెల్ కోసం న్యూజిలాండ్లాంటి దేశాలతో కలిసి పనిచేస్తామని తెలిపింది. అంతర్జాతీయ ప్రయాణాలుచేసే వారికి కచ్చితంగా కరోనా టెస్టులు కొనసాగిస్తామని వెల్లడించింది. ఆస్ట్రేలియన్లు ఇతర దేశాలకు వెళ్లేందుకు అవసరమైన వ్యాక్సిన్ సర్టిఫికెట్ అంతర్జాతీయంగా చెల్లుబాటు అయ్యే విధంగా అందులో క్యూఆర్ కోడ్ను పొందుపర్చింది. ఇది ఎక్కడైనా స్కాన్ చేసుకునే విధంగా తయారు చేయడంతో పాటు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని చెప్పింది. దీని గురించి ఇప్పటికే కమర్షియల్ ఎయిర్లైన్స్, ఇతర దేశాలకు తెలియజేయనున్నట్లు ఆస్ట్రేలియా అధికారులు తెలిపారు.