కరోనాపై అవగాహనే అసలైన వ్యాక్సిన్

కరోనాపై అవగాహనే అసలైన వ్యాక్సిన్

కొవిడ్​ లక్షణాలకు రోజుకో సమస్య జతవుతోంది. ఆ లెక్కనే రోజుకో మందు కూడా సిఫార్స్​ చేస్తున్నారు. ఉన్న మందులు పనిచేయట్లేదని కొంతమంది అంటుంటే, కోలుకుంటున్నామని కొంతమంది అంటున్నారు. కొవిడ్​ భయం అందరిలోనూ ఉంది. కొవిడ్​ ప్రమాదకరమైనదే. కానీ అది అందరికీ కాదన్న నిజం మాత్రం చాలామందికి చేరడం లేదు. ఇప్పుడు కరోనా కంటే భయమే మహమ్మారిలా మారింది. కొవిడ్​ ఎన్ని రకాలుగా ఎఫెక్ట్​ చూపిస్తుందన్న అవగాహన ఉంటే ఈ భయం పోయినట్లే. ఈ మహమ్మారికి అవగాహనే వ్యాక్సిన్ అంటున్నారు డాక్టర్​ కె.ఎస్​. సోమశేఖర్​ రావు. 

కొవిడ్​ వస్తే భయపడొద్దు. అలాగని ఏమీ కాదని నిర్లక్ష్యం చేయొద్దు. కొవిడ్ పట్ల అలర్ట్​గా ఉండాలి. కొవిడ్​ అందరిలో ఒకేలా ఎఫెక్ట్ చూపట్లేదు. వయసు, ఫిజికల్​ ఫిట్​నెస్​, మెంటల్ కండిషన్​, లైఫ్​ స్టైల్, హెల్త్ ప్రాబ్లమ్స్​ని బట్టి కరోనా వైరస్​ మనిషిలో తన ప్రభావం చూపిస్తోంది. కాబట్టి కరోనా ఎలాంటి సమస్యలకు దారి తీస్తోంది. అవి ఎప్పుడు ప్రమాదకరంగా మారతాయో తెలుసుంటే కరోనాకు సరైన వైద్యం చేయించుకోవచ్చు. తేలికగా ఎదిరించొచ్చు. తొందరగా కోలుకోవచ్చు. ​మొత్తం కొవిడ్​ పేషెంట్స్​ వందమంది ఉంటే, వాళ్లలో కొవిడ్ నాలుగు రకాల ప్రభావం చూపిస్తుంది. 

ఏ లక్షణాలు లేనివాళ్లు (20 శాతం) 
వీళ్లకు కరోనా సోకి, పోయిన సంగతి కూడా తెలియదు.

మైల్డ్​ కొవిడ్​ లక్షణాలు (70 శాతం)
వీళ్లలో కరోనా వైరస్​ గొంతులోనే ఉంటుంది. ఊపిరితిత్తులకు వ్యాపించదు. నిమ్ము రాదు. బ్లడ్​ ఆక్సిజన్ లెవల్ 95 శాతం కన్నా తగ్గదు. కాబట్టి ధైర్యంగా ఉంటారు. పెద్దవాళ్లు, వేరే జబ్బులతో బాధపడేవాళ్లయితే తప్పకుండా డాక్టర్​ని కలవాలి. షుగర్​, కిడ్నీ, లివర్ ​, హార్ట్​, లంగ్స్, థైరాయిడ్​, హెచ్​ఐవీ లాంటి జబ్బులు ఉన్నవాళ్లు అవసరమైన టెస్టులు చేయించుకోవాలి. 

కొద్దిపాటి అనారోగ్యం (7 శాతం) 
వీళ్లకు హాస్పిటల్లో ట్రీట్​మెంట్​ అవసరం. నీళ్లు, మజ్జిగ, ఎలక్ట్రాల్ వంటి పదార్థాలు తీసుకోవాలి. లక్షణాలను బట్టి డాక్టర్ సలహాతో మందులు వాడాలి. సొంత వైద్యం మంచిది కాదు. వేరే వ్యాధులతో బాధపడేవాళ్లు అవసరమైన టెస్ట్​లు చేయించు కోవాలి.  కరోనా సోకిన వారం రోజులకు ఈ స్టేజ్​కి చేరుకుంటారు. కొవిడ్​ బారినపడిన ఐదవ రోజు నుంచి 12వ రోజు మధ్య జబ్బు తీవ్రరూపం దాలుస్తుంది. ఇలాంటి వాళ్లకు సరైన ట్రీట్​మెంట్ ఇవ్వాలంటే కొవిడ్​ ఎప్పుడు స్టార్ట్​ అయిందో కచ్చితంగా తెలియాలి. అందుకోసం మైల్డ్​లెవల్​ సింప్టమ్స్​ ఎప్పుడొచ్చాయో గుర్తు తెచ్చుకుని, డాక్టర్​కి చెప్పాలి. బ్లడ్​ ఆక్సిజన్​ లెవల్​ (90 నుంచి 94 మధ్యకు ) పడిపోతే చెస్ట్​ సీటీ స్కాన్​ చేయించాలి. హాస్పిటల్​లో చేర్చాలి. డాక్టర్​ సలహాతో హిమోగ్రామ్​, సీఆర్​పీ,  ఐఎల్6, ఫెర్రిటిన్, డీ– డైమర్​ పరీక్షలు చేయించుకోవాలి. ఈ టెస్టుల ఆధారంగా జబ్బు తీవ్రతను అంచనా వేస్తారు. ఈ పరీక్షల్ని ప్రతి 48 గంటలకు ఒకసారి చేయిస్తే, రిజల్ట్​ను బట్టి మెడిసిన్స్​ డోస్​ మార్చుకుంటూ పోతారు. ఈ స్టేజ్​లో ఉన్నవాళ్లలో  ఐదు శాతం మంది తీవ్ర అనారోగ్యానికి గురవుతారు.  వీళ్లలో బ్లడ్​ ఆక్సిజన్​ శాతం 90కి పడిపోతుంది. 

సీరియస్​గా.. (3 శాతం) 
ఈ స్థితిలో స్టెరాయిడ్స్​ వాడాలి. ఆక్సిజన్​ తగినంత అందిస్తూ ఉండాలి. కిడ్నీ, లివర్​ ప్రాబ్లమ్స్​ ఉన్నవాళ్లకు రెమ్డిసివిర్​ ఇవ్వకూడదు. 
మోడరేట్​, తీవ్రమైన లక్షణాలతో జబ్బు చేసిన వాళ్లు నాలుగ్గంటలకు ఒకసారి ఆక్సీ మీటర్​తో బ్లడ్ ఆక్సిజన్​ లెవల్, పల్స్​ రేట్​ని చెక్​ చేసుకుంటూ ఉండాలి.  

షుగర్​ పేషెంట్స్ 
కొవిడ్​ వస్తే షుగర్​ పేషెంట్స్​ చాలా అలర్ట్​గా ఉండాలి. డాక్టర్​ని కచ్చితంగా కలవాలి. కొవిడ్​ నుంచి కోలుకున్న తర్వాత కూడా కొంతకాలం జాగ్రత్తగా ఉండాలి. కొవిడ్​, స్టిరాయిడ్స్​ వల్ల ఒక్కోసారి షుగర్​ విపరీతంగా పెరిగిపోతుంది. ఇన్సులిన్​ డోస్​ పెంచాల్సి వస్తుంది. కొవిడ్​ నుంచి కోలుకున్న తర్వాత ఒక గ్లూకోమీటర్​ దగ్గర ఉంచుకుని, షుగర్​ లెవల్​ని చెక్​ చేసుకోవాలి.

టెన్షన్ వద్దు

  •   పాజిటివ్​ అని తేలగానే హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేదు. 
  •   ఇంట్లోఉంటూ, మందులు తీసుకోవడానికే ప్రయత్నించాలి. అవసరమైతేనే హాస్సిటల్​లో చేరాలి. 
  •   ఆందోళన ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. కాబట్టి ధైర్యమే కొవిడ్​కు మందు. 
  •   ప్రతి నాలుగు గంటలకు ఒకసారి ఆక్సిజన్​ లెవల్ చెక్​ చేసుకోవాలి. ఇలా చేస్తే కొవిడ్ సీరియస్​నెస్​ను రెండు రోజుల ముందే కనిపెట్టవచ్చు. 
  •   ఊపిరితిత్తులు బాగా పాడయిపోయిన వాళ్లు జబ్బు తీవ్రంగా ఉన్న టైంలోనే కాకుండా తర్వాత కూడా ప్రాణాయామం లాంటి వ్యాయామాలు చేస్తుండాలి.