ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి ప్రాచీన ఆయుర్వేదంతో చెక్ పెట్టొచ్చా? అంటే అవుననే అంటున్నారు ఆయుర్వేద వైద్య పరిశోధకులు. ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక వైద్య శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు సాగిస్తుండగా.. భారత్ లో ఆయుర్వేద ఔషధాల అభివృద్ధికీ కృషి జరుగుతోంది. కేరళకు చెందిన ప్రముఖ ఆయుర్వేదిక్ సంస్థ పంకజకస్తూరి హెర్బల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇప్పటికే కరోనాకు మందు సిద్ధం చేసింది. దీన్ని మనుషులపై ప్రయోగించేందుకు క్లినికల్ ట్రయల్స్ రిజిస్టరీ ఆఫ్ ఇండియా (సీటీఆర్ఐ) అనుమతి ఇచ్చిందని ఆ సంస్థ వెల్లడించింది. క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి భారత మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ కింద పని చేసే విభాగం సీటీఆర్ఐ.
ల్యాబ్ లో ప్రయోగాలు సక్సెస్..
రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ల్యాబ్ లో మనుషుల కణాలపై ఈ ఔషధాన్ని ప్రయోగించామని పంకజకస్తూరి సంస్థ తెలిపింది. ఈ ప్రయోగాలు విజయవంతమయ్యాయని, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని చెప్పింది. వైరల్ ఫీవర్, శ్వాసకోశ సంబంధ ఇన్ఫెక్షన్స్, అక్యూట్ వైరల్ బ్రాంకైటిస్ వంటి సమస్యలకు తమ ఔషధంగా బాగాపని చేస్తోందని వెల్లడించింది. ఇన్ ఫ్లూయెంజా, రెస్పిరేటరీ వైరస్ లను ఎదుర్కోగలదని శాస్త్రీయంగా ఆధారాలు ఉన్నాయని తెలిపింది. హ్యూమన్ సెల్స్ పై ప్రయోగాలు విజయవంతం కావడంతో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎథిక్స్ కమిటీ (ఐఈసీ), సీటీఆర్ఐ అప్రూవల్స్ వచ్చాయని, దేశ వ్యాప్తంగా పలు మెడికల్ కాలేజీల్లో కరోనా పేషెంట్లకు ఈ మందు ఇచ్చి ఫలితాలను పరిశీలించబోతున్నట్లు చెప్పింది.