న్యూఢిల్లీ: బజాజ్ ఫైనాన్స్ ఈ ఏడాది జూన్తో ముగిసిన మొదటి క్వార్టర్లో రూ. 3,437 కోట్ల లాభం సంపాదించింది. ఈ క్వార్టర్లో దాదాపు కోటి మందికి లోన్లు ఇచ్చింది. పూణే ప్రధాన కేంద్రంగా ఉన్న కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 4.5 లక్షల కోట్లకు చేరింది. తాజా క్వార్టర్లో తాము 38.4 లక్షల మంది కస్టమర్లను చేర్చుకున్నామని, మొత్తం కస్టమర్ బేస్ 21 శాతం పెరిగి 7.29 కోట్లకు చేరుకుందని ప్రకటించింది. ఏడాది క్రితం కంపెనీకి 6.03 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. కంపెనీ రికార్డు స్థాయిలో 99.4 లక్షల కొత్త లోన్లను మంజూరు చేసింది. ఇవి సంవత్సరానికి 34 శాతం పెరిగాయి.
వాయిదా వేసిన పన్ను బాధ్యత రూ. 73 కోట్లు మినహాయించి, నికర ఆదాయం 30 శాతం వృద్ధి చెందిందని కంపెనీ తెలిపింది. కన్సాలిడేటెడ్ పద్ధతిలో మొత్తం ఆదాయం రూ. 12,500.54 కోట్లకు పెరిగింది. ఇది క్రితం సంవత్సరం జూన్ -క్వార్టర్లో రూ. 9,285.86 కోట్లుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం సంవత్సరానికి 26 శాతం పెరిగి రూ. 8,398 కోట్లకు చేరుకుంది. లోన్లాసులు, కేటాయింపులు రూ.755 కోట్ల నుంచి రూ.995 కోట్లకు పెరిగాయి. ప్రొవిజన్ కవరేజ్ నిష్పత్తి 65 వద్ద ఉంది. గ్రాస్ ఎన్పీఏ నిష్పత్తి 1.25, నెట్ ఎన్పీఏ నిష్పత్తి 0.31గా ఉంది. డిపాజిట్లు రూ. 49,764 కోట్లు కాగా, వీటి విలువ కన్సాలిడేటెడ్ లోన్లలో 21 శాతం ఉంది. కంపెనీ వడ్డీ ఖర్చుల రూపంలో రూ.4,103 కోట్లు చెల్లించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్కంటే 55 శాతం ఎక్కువ. ఫీజులు, కమీషన్లు ఇతర వడ్డీయేతర ఆదాయం రూ. 1,680 కోట్లు పెరిగి, మొత్తం ఆదాయం రూ. 12,501 కోట్లకు చేరుకుంది. ఇది ఏడాదికి 35 శాతం కంటే ఎక్కువ. నిర్వహణలో ఉన్న ఆస్తుల (ఏయూఎం) విలువ వార్షికంగా 32 శాతం పెరిగి రూ. 270,097 కోట్లకు చేరుకుంది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ దాని అసోసియేట్ కంపెనీ స్నాప్వర్క్ టెక్నాలజీస్ లెక్కలు కూడా ఇందులో ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. బీఎస్ఈలో బుధవారం బజాజ్ ఫైనాన్స్ షేరు 2.29 శాతం నష్టపోయి రూ.7,431.05 వద్ద ముగిసింది.