- కొన్ని ప్రపోజల్స్ చేసిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్
- ఫ్రాడ్స్ చేసిన వారి అకౌంట్లతో నెగెటివ్ రిజిస్ట్రీ
- కొత్త అకౌంట్లలో ట్రాన్సాక్షన్లపై లిమిట్
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫ్రాడ్స్ను అరికట్టేందుకు దేశ బ్యాంకులు కొన్ని ప్రపోజల్స్ రెడీ చేశాయి. కొత్త అకౌంట్లలో ట్రాన్సాక్షన్ల లిమిట్ పెట్టడం, ఇప్పటికే దొరికిన మోసగాళ్ల అకౌంట్లతో ఒక ‘నెగెటివ్ రిజిస్ట్రీ’ ని ఏర్పాటు చేయడం, ఫ్రాడ్ జరిగినట్టు రిపోర్ట్స్ వచ్చాక ఫండ్స్ ఫ్లో ఆపేలా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను తీసుకురావడం.. ఇలా వివిధ ప్రపోజల్స్ను రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కి సూచించాయి. ఆర్బీఐ డేటా ప్రకారం, ఈ ఏడాది మార్చి క్వార్టర్లో జరిగిన ప్రతీ 55,635 ఆన్లైన్ ట్రాన్సాక్షన్లలో ఒకటి మోసపూరిత ట్రాన్సాక్షన్ ఉంది. 2021–22 లోని సెప్టెంబర్ క్వార్టర్లో ప్రతీ 59 వేల ట్రాన్సాక్షన్లలో ఒక ట్రాన్సాక్షన్ ఫ్రాడ్గా రికార్డయ్యింది. దీంతో పోలిస్తే తాజాగా ఆన్లైన్ ఫ్రాడ్స్ పెరిగినట్టు తెలుస్తోంది. ‘ఈ ఏడాది మార్చి క్వార్టర్లో ప్రాసెస్ అయిన ప్రతీ రూ. లక్ష పేమెంట్ వాల్యూలో రూ.1.45 మోసానికి గురయ్యింది’ అని ఆర్బీఐ డేటాను కోట్ చేస్తూ హిందుస్తాన్ టైమ్స్ పేర్కొంది. వాల్యూ, వాల్యూమ్ పరంగా ఫ్రాడ్స్ పెరిగాయని వెల్లడించింది. కాగా, ఈ ఏడాది జనవరిలో ఏకంగా 1,000 కోట్ల ఆన్లైన్ రిటైల్ పేమెంట్ ట్రాన్సాక్షన్లు జరగగా, రూ.51 లక్షల కోట్ల విలువైన ట్రాన్సాక్షన్లు ప్రాసెస్ అయ్యాయి.
ఇన్ఫర్మేషన్ షేర్ చేసేందుకు..
సైబర్ ఫ్రాడ్స్ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునేందుకు ఆర్బీఐ దక్స్ పేరుతో ఒక వెబ్ బేస్డ్ సిస్టమ్ను కిందటేడాది అక్టోబర్లోనే లాంచ్ చేసింది. ఫ్రాడ్ వివరాలతో పాటు, దీని ప్రభావం, నష్టపోయిన వారు, ఫ్రాడ్ జరగడానికి గల కారణాలు, ఐపీ అడ్రస్లు, రికవరీ మెకానిజం, ఆర్బీఐ అసెస్మెంట్ వంటి వివరాలు ఈ పోర్టల్లో ఉంటాయి. ఆర్బీఐ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) లు కలిసి ఇప్పటికే చాలా చర్యలు తీసుకున్నాయి. మరిన్నీ చర్యలు తీసుకునేందుకు ఐబీఏ తాజాగా కొన్ని సూచనలు చేసింది. ఇప్పటికే ఫ్రాడ్స్ చేసిన వారి అకౌంట్ల డేటాను స్టోర్ చేసేందుకు ఒక నెగెటివ్ రిజిస్ట్రీని ఏర్పాటు చేయాలని, ఈ డేటాను అన్ని బ్యాంకులు యాక్సెస్ చేసుకునేలా వీలు కలిపించాలని ఆర్బీఐకి ప్రపోజ్ చేసింది. ‘ మోసం చేసిన, పాల్పడిన వారి డేటా సీఎఫ్ఆర్/ సీపీఎఫ్ఐఆర్ ద్వారా ఆర్బీఐ దగ్గర అందుబాటులో ఉంది. ఈ డేటా ఎంహెచ్ఏ (సైబర్ పోలీస్) కు అందుబాటులో ఉంటోంది’ అని ఐబీఏ ఓ నోట్లో పేర్కొంది. కొత్తగా ఓపెన్ అయిన కాసా అకౌంట్లలో ట్రాన్సాక్షన్లను బ్యాంక్లు లిమిట్ చేయాలనే ప్రపోజల్ను కూడా బ్యాంక్ అసోసియేషన్ చేసింది. ఫ్రాడ్ జరిగిందని బ్యాంకులు గుర్తించాక, ఈ ఫండ్స్ ఇతర అకౌంట్లలోకి వెళ్లకుండా ఆపేందుకు స్టాండర్డ్ ప్రొసీజర్ను క్రియేట్ చేయాలని, ఒకవేళ ఫ్రాడ్ అమౌంట్ ఏదైనా అకౌంట్కు వెళ్లిందని బ్యాంకులు గుర్తిస్తే, ఈ అమౌంట్ను బ్లాక్ చేయడం, చట్టపరంగా మరిన్నీ చర్యలు తీసుకోవడం వంటివి బ్యాంకులు చేయాలని సలహాయిచ్చింది. సైబర్ ఫ్రాడ్స్ గురించి ఇన్ఫర్మేషన్ను బ్యాంకులు, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల మధ్య షేర్ చేసుకోవడానికి సెంట్రలైజ్డ్ కాంటాక్ట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కూడా బ్యాంక్ అసోసియేషన్ ప్రపోజ్ చేసింది.
2.25 లక్షల సిమ్ కార్డులు డీయాక్టివేట్
తప్పుడు డాక్యుమెంట్లతో తీసుకున్న 2.25 లక్షల మొబైల్ ఫోన్ నెంబర్లను టెలీకమ్యూనికేషన్స్ (డాట్) ఈ ఏడాది ఏప్రిల్లో డీయాక్టివేట్ చేసింది. ఈ నెంబర్లన్నీ బిహార్, జార్ఖండ్కు చెందినవే. అంతేకాకుండా తప్పుడు పద్ధతిలో సిమ్ కార్డులను ఇస్తున్న 517 పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) ను బ్లాక్లిస్ట్లో పెట్టింది. ‘ఈ ఏడాది ఏప్రిల్లో బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో 2.25 లక్షలకు పైగా మొబైల్ నెంబర్లను డీయాక్టివేట్ చేశాం. వీటిలో మెజార్టీ సిమ్ కార్డులు ఇల్లీగల్గా లేదా తప్పుడు పద్ధతిలో పొందినవే’ అని డాట్, స్పెషల్ డైరెక్టర్ జనరల్ టెలికం ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో ఫ్రాడ్స్ జరుగుతున్నాయని టెలికం సర్వీస్ ప్రొవైడర్లు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని వెల్లడించింది. బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన సుమారు ఏడు కోట్ల సిమ్ సబ్స్క్రయిబర్ల డేటాను ఎనలైజ్ చేసి, ఈ చర్యలు తీసుకున్నామని డాట్ పేర్కొంది.