
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : వచ్చే సీజన్ నాటికి భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని పినపాక, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాలతో పాటు ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లోని 1.50లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కలెక్టరేట్లో శనివారం పలు శాఖల అధికారులతో మంత్రి రివ్యూ నిర్వహించారు. భూ సేకరణ స్పీడ్గా చేసే విధంగా ఆఫీసర్లు ప్లాన్ చేసుకోవాలన్నారు.
జూలూరుపాడు టన్నెల్ దాటితే లలితపురం నుంచి ఇల్లెందు నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. మరో వైపు దేవాదుల నుంచి బయ్యారం మీదుగా ఇల్లెందుకు నీళ్లు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. రెండింటిలో ఏది ఖర్చు తక్కువతో కూడుకున్నదో అనే విషయమై సర్వే చేయించనున్నట్టు పేర్కొన్నారు.
పంట ఎండకుండా చర్యలు
ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టు కింద ఎండి పోతున్న పంట పొలాలను ఆదుకునేందుకు సీతారామ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు ఇస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టు కింద పంటలకు కృష్ణా నీళ్లు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, ఈ విషయమై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి, ఆయన సూచనల మేరకు సీతారామ ప్రాజెక్ట్ ద్వారా మోటార్లను ఆన్ చేశామన్నారు. కాగా, ఎన్పీడీసీఎల్, ఇరిగేషన్ ఉన్నతాధికారుల తీరుపై కొంత అసహనం వ్యక్తం చేశారు.
వరదలపై రివ్యూ...
గోదావరికి వరద పోటెత్తుతున్న క్రమంలో ఆఫీసర్లంతా అలర్ట్గా ఉండాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ఇరిగేషన్, ఆర్అండ్బీ, అగ్రికల్చర్, విద్యుత్, హెల్త్, రెవెన్యూ, పొలీస్, ఫైర్, పంచాయతీ శాఖల అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. చర్ల రోడ్డుపై వరద పోటెత్తితే నియోజకవర్గంలోని పలు మండలాలకు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉందని, వర్షాలకు ముందే ఈ రహదారిలోని బ్రిడ్జీ పనులు చేపట్టకపోవడంపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు.
అక్టోబర్ నుంచి జూన్లో పు పనులు పూర్తి చేసేలా ఆర్ అండ్ బీ అధికారులు ప్లాన్ చేసుకోవాలన్నారు. ఆయిల్ పామ్ రైతులకు అవసరమైన విధంగా విద్యుత్ సప్లై చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ , ఎస్పీ బి. రోహిత్ రాజు, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ విద్యాచందన, సీతారామ ప్రాజెక్ట్ ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, ఎన్పీడీసీఎస్ ఎస్ఈ మహేందర్తో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.