న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎలక్షన్ రిజల్ట్స్ పై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఈ ఫలితాలు వచ్చే లోక్ సభ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపబోవన్నారు. దేశం కోసం అసలు యుద్ధం 2024లో జరుగుతుందని స్పష్టం చేశారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయం వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ ప్రతిఫలిస్తుందని ప్రధాని మోడీ చేసిన కామెంట్స్ కు సమాధానంగా పీకే పైవ్యాఖ్యలు చేశారు. ‘దేశం కోసం సిసలైన యుద్ధం 2024లో జరుగుతుంది. అప్పుడే అన్నీ డిసైడ్ అవుతాయి. స్టేట్ ఎలక్షన్స్ తో దీన్ని నిర్ణయించలేం. ఇది సాహెబ్ (మోడీ)కు బాగా తెలుసు. అయినా కావాలనే రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తద్వారా ప్రతిపక్షంపై ఆధిపత్యం సాధించాలని చూస్తున్నారు. వారి వలలో చిక్కుకోకండి’ అని ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు.
Battle for India will be fought and decided in 2024 & not in any state #elections
— Prashant Kishor (@PrashantKishor) March 11, 2022
Saheb knows this! Hence this clever attempt to create frenzy around state results to establish a decisive psychological advantage over opposition.
Don’t fall or be part of this false narrative.
కాగా, నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం బీజేపీకి కొత్త ఉత్సాహాన్నిచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో ఇవాళే హోలీ మొదలైందన్నారు. మహిళలు, యువత ఓట్ల వల్లే బీజేపీకి ఇంత భారీ మెజార్టీ సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని పార్టీ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో మోడీ మాట్లాడారు. ఐదు రాష్ట్రాల ప్రజల హృదయాలను చూరగొనేందుకు కార్యకర్తలు రాత్రి పగలన్న తేడా లేకుండా శ్రమించారన్న ప్రధాని.. వారికి కృతజ్ఞతలు చెప్పారు. బీజేపీపై నమ్మకం పెరిగినందునే ప్రజలు తమకు ఓటు వేశారని ప్రధాని అన్నారు. గతంలో ప్రజలు కనీసావసరాల కోసం ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. పాలనలో పారదర్శకత తెచ్చి సుపరిపాలన అందించామని అన్నారు.
మరిన్ని వార్తల కోసం: