- వైట్ బాల్ ఫార్మాట్లో కీలకం కానున్న స్కై
- టెస్ట్ టీమ్లో చోటుపై నో గ్యారంటీ
న్యూఢిల్లీ: వెస్టిండీస్తో రెండు టెస్ట్లకు ఎంపిక చేసిన టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్కు చోటు ఎందుకు దక్కలేదు? ఐపీఎల్లో దుమ్మురేపిన అతన్ని రెడ్బాల్ క్రికెట్లో ఎందుకు కొనసాగించడం లేదు? ఐదు రోజుల ఫార్మాట్లో ఆడిన ఒక్క ఇన్నింగ్స్ 20 బాల్స్కే అతని కెరీర్ను పరిమితం చేస్తారా? అంటే.. ఇప్పటికైతే ఔననే సమాధానమే వస్తుంది. వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని వైట్బాల్ క్రికెట్పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టమని బీసీసీఐ పెద్దలు సూర్యకుమార్కు సూచించారని బోర్డు అధికారి ఒకరు వెల్లడించాడు. దీంతో సీనియర్ చతేశ్వర్ పుజారాపై వేటు వేసి ఆ స్థానంలో సూర్యను కాకుండా యంగ్స్టర్స్ రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్కు చోటు కల్పించారని వివరించాడు. అంటే రాబోయే రోజుల్లో ఇండియా వైట్బాల్ ఫార్మాట్లో స్కై (సూర్య కుమార్ యాదవ్) అత్యంత కీలకంగా మారబోతున్నాడని సెలెక్టర్లు ముందస్తుగా సంకేతాలిచ్చారు.
సూర్యనే ఎందుకు?
వచ్చే నెలలో జరగనున్న వెస్టిండీస్ టూర్ కంటే అక్టోబర్–నవంబర్లో జరిగే వన్డే వరల్డ్కప్పైనే సెలెక్టర్లు ఎక్కువగా దృష్టి పెట్టారు. విండీస్తో వన్డేలకు ఎంపిక చేసిన టీమ్ను చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం 20 మందితో బీసీసీఐ ఓ కోర్ గ్రూప్ను రెడీ చేస్తున్నది. ఇందులో మిడిలార్డర్ పాత్ర కోసం సూర్యను తీసుకుంది. ఇద్దరు ఓపెనర్లు ఫెయిలైనా.. సూర్య నిలబడితే ఇండియా పిచ్లపై ఈజీగా మ్యాచ్లు గెలవొచ్చని భారీ ప్లాన్స్ రచిస్తోంది. అలాగే టీ20ల్లో దుమ్మురేపిన అతను ఇప్పుడు సూపర్ ఫామ్లో ఉన్నాడు. దాన్ని మెగా వెంట్లోనూ కంటిన్యూ చేస్తే ఇండియా ఈజీగా కప్ గెలిచే చాన్స్ కూడా ఉంటుందని బోర్డు పెద్దలు అంచనా వేస్తున్నారు. అందుకే ఇప్పట్నించే సూర్యను వైట్బాల్ ఫార్మాట్కు రెడీ చేస్తున్నారు. ‘టెస్ట్ టీమ్లో సూర్య ఉంటే రుతురాజ్, యశస్విలకు ఫైనల్ ఎలెవన్లో ఆడే చాన్స్ రాదు. అందుకే కొత్త వారిని ట్రై చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇప్పటికైతే టెస్ట్ ఫార్మాట్ ప్రణాళికల్లో సూర్య లేడని అనుకోవడం లేదు. కానీ ఆసియా కప్, వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని అతన్ని విండీస్తో టెస్ట్లకు ఎంపిక చేయలేదు. ఈ రెండు టోర్నీలో స్కై అత్యంత ప్రధానమైన ప్లేయర్. కాబట్టి ప్రస్తుతానికి అతను వైట్బాల్ క్రికెట్పైనే ఫోకస్ చేయడం కరెక్ట్’ అని బీసీసీఐ అధికారి వివరించాడు.
ఫైనల్ ఎలెవన్లో ఉంటాడా?
టీ20లను పక్కనబెడితే వన్డేల్లో సూర్య రికార్డు అంత బాగా లేదు. అయినా వరల్డ్ కప్లో ఆడే ఫైనల్ ఎలెవన్లో అతను కచ్చితంగా ఉంటాడని బోర్డు పెద్దలు బలంగా చెబుతున్నారు. టాప్–4లో రోహిత్, కేఎల్ రాహుల్ / శుభ్మన్ గిల్, కోహ్లీతో పాటు సూర్య కచ్చితంగా ఉంటాడని భావిస్తున్నారు. ఇప్పటివరకు 23 వన్డేలు ఆడిన సూర్య 24.05 సగటుతో 433 రన్స్ మాత్రమే చేశాడు. ఇందులో రెండే హాఫ్ సెంచరీలు ఉన్నా వన్డేల్లో అతనే ప్రధాన ఆయుధమని బీసీసీఐ బాగా నమ్ముతోంది. అయితే సూర్యకు పోటీగా శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్ కూడా రేస్లో ఉన్నారు. వెన్ను నొప్పికి సర్జరీ చేయించుకున్న శ్రేయస్ మునుపటి ఫామ్ను చూపెడతాడా? అన్నది సందేహం. ఛేజింగ్లో సూర్యను మించిన బ్యాటర్ మరొకరు లేరనేది వాస్తవం. మోకాలి సర్జరీ నుంచి కోలుకుంటున్న రిషబ్ పంత్ మిడిలార్డర్లో ఏ మేరకు రాణిస్తాడన్నది కూడా ప్రశ్నార్థకంగా కనిపిస్తున్నది. ప్రత్యర్థి బౌలింగ్ దాడికి ఎదురొడ్డి నిలవాలంటే మిడిలార్డర్ చాలా బలంగా ఉండాలి. కాబట్టి ఏ లెక్కన చూసినా ఫైనల్ ఎలెవన్లో సూర్యకు ప్లేస్ కచ్చితంగా ఉంటుంది