మెటర్నిటీ ఆస్పత్రుల్లో అవస్థలు.. అడ్మిట్​ అవ్వాలంటే బెడ్లు దొరకట్లే

మెటర్నిటీ ఆస్పత్రుల్లో అవస్థలు.. అడ్మిట్​ అవ్వాలంటే బెడ్లు దొరకట్లే
  • మరో వంద బెడ్ల  ప్రపోజల్స్​ను పట్టని ప్రభుత్వం 
  • ఏడాదిన్నర నుంచి  అదనపు బెడ్ల కోసం ఎదురిచూపులు 

హనుమకొండ, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ ప్రసూతి  ఆస్పత్రులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గవర్నమెంట్​ ఆస్పత్రుల్లో  డెలివరీలు పెంచాలని  ప్రచారం చేస్తున్నారు కానీ, ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.   ఉమ్మడి వరంగల్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి హనుమకొండలోని జీఎంహెచ్​, వరంగల్​ సీకేఎం హాస్పిటల్​ కు రోజూ వందల మంది గర్భిణులు వస్తున్నారు.  కానీ, అడ్మిట్​ అవ్వాలంటే బెడ్లు దొరకడం లేదు.

రెండు ఆస్పత్రుల్లో చాలని బెడ్లు.. 

ఈ రెండు హాస్పిటల్స్​ లో వంద చొప్పున   బెడ్లు ఉన్నాయి.   రోజుకు సుమారు 25 మంది గర్భిణులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీంతో సరిపడా బెడ్లు లేక  తాత్కాలికంగా డాక్టర్లు  బెడ్లు ఏర్పాటు చేస్తున్నారు.  ఈ పరిస్థితి ఇబ్బందిగా మారడంతో  బెడ్ల సంఖ్య పెంచాలని గత  ఏడాది కాలంగా డాక్టర్లు  ఉన్నతాధికారులకు ప్రపోజల్స్​ పెడుతున్నారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు.   దీంతో ప్రసవం కోసం వచ్చిన గర్భిణులు  బెడ్ల కోసం తల్లడిల్లాల్సి వస్తోంది.

 ఫుల్​ రష్​

పీహెచ్​సీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో టార్గెట్​ కు మించి సాధారణ ప్రసవాలు చేస్తే.. ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు అందిస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్​ రావు గతేడాది  ప్రకటించారు.  మరోవైపు పీహెచ్​సీల్లో సరిపడా డాక్టర్లు, ఎక్విప్​మెంట్ లేకపోవడంతో పాటు అత్యవసరమైతే  సిజేరియన్ చేయడానికి  వీలు లేకపోవడం వల్ల ఉమ్మడి వరంగల్​ తో పాటు,  ఇతర జిల్లాల నుంచి నిత్యం గర్భిణులు వరంగల్  కు వస్తున్నారు.

 ఉర్సు గుట్ట దవాఖాన ఓపీ సేవలకే..

సీకేఎం ఆసుపత్రిపై భారం తగ్గించేందుకు, దానికి అనుబంధంగా  ఉర్సు  లో 30 బెడ్ల సామర్థ్యంతో హాస్పిటల్​ ఉంది.  దానికి ఆరుగురు మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్​ నర్సులు,  ఇతర  25 పోస్టుల్లో సిబ్బంది ఉండాలి. కానీ,  అందులో ఇద్దరు డాక్టర్లు, ల్యాబ్​ టెక్నీషియన్​, ఫార్మసిస్ట్​, ఏఎన్​ఎం పోస్టులను మాత్రమే ప్రభుత్వం  భర్తీ చేసింది.   ప్రసూతి సేవలకు సరిపడా స్టాఫ్​ లేక అక్కడ డెలివరీలు ఆగిపోయాయి. అక్కడి స్టాఫ్​ కూడా డిప్యూటేషన్​ పై సీకేఎంలోనే డ్యూటీ చేస్తున్నారు. ఫలితంగా ఉర్సు దవాఖాన కేవలం ఓపీ సేవలకే పరిమితమైంది.   వరంగల్ ఎంజీఎంలో 250 బెడ్ల సామర్థ్యంతో ఎంసీహెచ్​ బిల్డింగ్​ ఏర్పాటు చేయగా.. కొవిడ్​ స్టార్ట్ అయినప్పటి నుంచి దానిని కరోనా వార్డుగానే  వాడుతున్నారు.

హెల్త్​ సిటీ పైనే ఫోకస్​ 

 ఇటీవల వరంగల్ సెంట్రల్​ జైల్​ స్థలంలో 24 అంతస్తుల మల్టీ సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్​(హైల్త్ సిటీ) నిర్మిస్తుండగా..   మంత్రులు, లోకల్ లీడర్లంతా దానిపైనే ఫోకస్​ పెట్టారు. ఎంజీఎం సహా, జీఎంహెచ్​, సీకేఎం ఆసుపత్రులను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. అయితే  గర్భిణులు, బాలింతల కోసం  ఎంజీఎంను పూర్తిస్థాయి ఎంసీహెచ్​ వింగ్​గా  డెవలప్​ చేస్తారన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ దానిపై ఇంతవరకు అధికారికంగా ఎలాంటి క్లారిటీ  లేదు.    స్థానిక లీడర్లైనా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గర్భిణుల, బాలింతల అవస్థలు తీర్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.