- ఆటలకు బానిసలుగా మారుతున్న యువత
- చివరకు అప్పులపాలై ఆత్మహత్యలు.. రాష్ట్రంలో ఇటీవల పెరిగిన ఘటనలు
- ఆన్ లైన్ జూదంలో తెలంగాణ సెకండ్ ప్లేస్.. స్పోర్ట్స్ బెట్టింగ్లో టాప్
హైదరాబాద్, వెలుగు: ఓ యువకుడు జాబ్ కోసమని హైదరాబాద్వచ్చాడు. ఇంట్లో వాళ్లకు జాబ్ చేస్తున్నానని చెప్పి, రూమ్ లోనే ఉంటూ ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడ్డాడు. అదికాస్తా వ్యసనంగా మారి.. ఒకట్రెండు లక్షలు కాదు ఏకంగా రూ.2 కోట్లు పోగొట్టుకున్నాడు. మొత్తం అప్పులు తీసుకుని ఆటలు ఆడాడు. ఇదికాస్తా ఇంట్లో తెలిసి ఉన్న ఆస్తులన్నీ అమ్మినా ఆ అప్పు తీరలేదు. చివరకు ఆ యవకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నెల కిందట జరిగిందీ ఘటన. ఇదొక్కటే కాదు.. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ఇటీవల చాలా జరిగాయి. ఆన్ లైన్ గేమ్స్ ఆడేందుకు అప్పులు చేసి ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి.. తండ్రి వడ్లు అమ్మగా వచ్చిన డబ్బులు పోగొట్టి ఓ కొడుకు ప్రాణాలు తీసుకున్నారు. గర్ల్ఫ్రెండ్ నగలను కుదువపెట్టిన మరో యువకుడు.. ఆ డబ్బులన్నీ ఆన్లైన్ గేమ్స్ లో పోగొట్టుకున్నాడు. ఇట్ల వేలాది మంది యువకులు ఆన్లైన్ గేమ్స్ కు బానిసలుగా మారి ఆగమైపోతున్నారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి, చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారు. మనకు తెలుస్తున్నవి, బయటకు వస్తున్నవి కొన్నేనని.. ఇంకా బయటకు రాని ఘటనలు వేలల్లో ఉంటున్నాయని నిపుణులు అంటున్నారు.
విద్యార్థులు, చిరుద్యోగులే కాదు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ప్రొఫెషనల్స్ కూడా ఆన్లైన్ గేమ్స్ను సరదాగా ప్రారంభించి బానిసలుగా మారుతున్నారు. ఆందోళన కలిగించే విషయమేమిటంటే.. ఆన్లైన్ జూదంలోకి దిగుతున్న వాళ్లలో సగం మంది 20 నుంచి 29 ఏండ్లలోపు వాళ్లే ఉంటున్నారు. మరోవైపు రమ్మీ, క్యాసినో వంటి ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్ ఎక్కువగా ఆడుతున్నది మహారాష్ట్ర తర్వాత మన రాష్ట్రంలోనే కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా గ్యాంబ్లింగ్ గేమ్స్ ట్రాఫిక్లో 15.9 శాతం మహారాష్ట్ర నుంచి రికార్డ్అవుతుంటే.. తెలంగాణ నుంచి 9.9 శాతం నమోదవుతున్నట్టు ఇటీవల ‘సెవెన్ జాక్పాట్స్’ రిపోర్టులో వెల్లడైంది. ఇక స్పోర్ట్స్ బెట్టింగ్లోనైతే తెలంగాణే టాప్లో ఉండడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఏ రాష్ట్రంలోనూ లేనంతగా మన రాష్ట్రం నుంచే ఎక్కువగా ఆన్లైన్లో స్పోర్ట్స్ బెట్టింగ్ కాస్తున్నట్టు ఆ రిపోర్ట్ తేల్చింది. దేశవ్యాప్తంగా స్పోర్ట్స్బెట్టింగ్ ట్రెండ్స్ను తీసుకుంటే.. అత్యధికంగా తెలంగాణ నుంచే 22 శాతం మంది బెట్టింగ్లకు పాల్పడుతున్నట్టు వెల్లడైంది.
రెండు మూడేండ్ల సందే ఎక్కువైనయ్..
ఈ రెండు మూడేండ్లలోనే ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ వందల్లో పుట్టుకొచ్చాయి. రమ్మీ, పోకర్వంటి పేకాట గేమ్స్తో పాటు లూడో, క్రికెట్, పబ్జీ వంటి ఆటలతో గేమింగ్ యాప్స్ను తీసుకొస్తున్నారు. తొలుత కొన్ని కాయిన్లు ఫ్రీ అని చెప్పి యువతను ఆకర్షిస్తున్న యాప్స్.. ఆ తర్వాత వారిని నిలువునా ముంచేస్తున్నాయి. నెమ్మదిగా గేమ్కు అలవాటు చేసి.. వదల్లేనంతగా బానిసలుగా మార్చేస్తూ డబ్బులు కొల్లగొడ్తున్నాయి. ముఖ్యంగా రమ్మీ, పోకర్వంటి ఆటలకే జనాలు ఎక్కువ ఆకర్షితులవుతున్నారు. దానికితోడు క్రికెట్ బెట్టింగ్ యాప్లూ ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి.
ఐపీఎల్, వరల్డ్ కప్, ఇండియా ఆడే మ్యాచ్లతో పాటు ఐఎస్ఎల్ (ఫుట్బాల్), పీబీఎల్ (బ్యాడ్మింటన్) వంటి టోర్నీలకు జోరుగా బెట్టింగ్ లు నిర్వహిస్తున్నాయి. ఇవన్నీ అంతా ఓపెన్గానే జరుగుతున్నాయి. నిజానికి రాష్ట్రంలో వీటిపై నిషేధం ఉన్నా.. కొందరు యువకులు ఇతర మార్గాలను వెతుక్కుని మరీ ఆన్లైన్బెట్టింగ్స్ పెడుతున్నారు. కొన్నిసార్లు పెట్టిన డబ్బులకు ఎక్కువొస్తున్నా.. నష్టపోతున్నది అంతకంటే ఎక్కువగానే ఉంటున్నది.
యాప్స్ అంబాసిడర్లు స్టార్లే..
కొన్ని ఆన్లైన్గేమింగ్, బెట్టింగ్ యాప్స్ బహిరంగంగానే ప్రకటనలు ఇస్తున్నాయి. బెట్టింగ్కు యువత అలవాటు పడేలా స్పోర్ట్స్, సినిమా స్టార్లను పెట్టుకుని ప్రచారం చేయిస్తున్నాయి. అంతెందుకు ఐపీఎల్, ఐఎస్ఎల్, పీబీఎల్ వంటి టోర్నీలకు ఆ ఆన్లైన్గేమింగ్, బెట్టింగ్ యాప్స్ స్పాన్సర్లుగానూ వ్యవహరిస్తున్నాయి. ఇలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని యువతను ఆకట్టుకుని.. వాళ్ల నుంచి ఏటా రూ.వేల కోట్లు దండుకుంటున్నాయి. ఓ రిపోర్ట్ ప్రకారం మన దేశంలో ఆన్లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్మార్కెట్ వాటా 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.4,200 కోట్లు అని తేలింది. ఈ ఆర్థిక సంవత్సరం అది మరింత పెరుగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా, అమెరికాలతో పోలిస్తే మన దేశంలో ఆన్లైన్ గ్యాంబ్లింగ్, గేమింగ్ మార్కెట్ 38 శాతం రేటుతో వృద్ధి చెందుతున్నదట.
ఈ కేసులను సైబర్క్రైమ్స్లో కలిపేస్తున్నరు..
రాష్ట్రంలో ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగ్ వల్ల ఎంతమంది ప్రభావితమవుతున్నారని చెప్పడానికి సరైన గణాంకాలు లేవు. వేలల్లో ఘటనలు జరుగుతున్నా కొన్ని మాత్రమే పోలీసుల వరకు వెళ్తున్నాయి. అయితే ఆ కేసులను సైబర్ క్రైమ్స్ జాబితాలో కలిపి వెల్లడిస్తున్నారు. రాష్ట్రంలో పేకాటపై నిషేధం ఉంది. ఎక్కడైనా ఎవరైనా పేకాట ఆడుతున్నట్టు తెలిస్తే పోలీసులు వెళ్లి అరెస్ట్ చేస్తున్నారు. కానీ ఆన్లైన్ లో రమ్మీ, పోకర్, క్యాసినో వంటి వాటిపై మాత్రం సర్కారు ఎలాంటి చర్యలను తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఆన్లైన్ గేమ్స్కు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బెట్టింగ్ నిర్వహించే ఆన్లైన్ గేమ్స్ను బ్యాన్ చేస్తామని తెలిపింది. ఆన్లైన్ గేమ్స్ యాప్స్పై రివ్యూ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పింది.