బీజేపీ ఓట్లు పెరిగాయ్​

బీజేపీ ఓట్లు పెరిగాయ్​

ఢిల్లీ ఓటర్లు మరోసారి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని దూరం పెట్టారు. 1998లో అధికారాన్ని పోగొట్టుకున్నాక మళ్లీ గెలవలేకపోయింది. ఈ 22 ఏళ్లలో లోక్​సభ ఎన్నికల్లో మంచి విజయాలు దక్కించుకున్నా. అసెంబ్లీకి మాత్రం దూరంగానే ఉండిపోతోంది. అయితే, 2015లో జరిగిన ఎలక్షన్స్​లో కేవలం మూడు సీట్లనే గెలుచుకున్న బీజేపీ ఈసారి 8 సీట్లకు ఎదిగింది. అలాగే, ఓట్ల శాతంకూడా పెంచుకోగలిగింది. పోయిన ఎన్నికల్లో 32 శాతం రాగా, ఈసారి 38.59 శాతం సాధించింది. వెయ్యి లోపల ఓట్ల మెజారిటీతో 27 సీట్లను పోగొట్టుకుంది. సిట్టింగ్​ సీట్లలో ముస్తఫాబాద్ మినహా రోహిణి, కరవాల్​నగర్​లను నిలుపుకోగలిగింది. వీటితోపాటు ఆప్​ చేతిలోని ఘోండా, గాంధీనగర్​, రోహ్​తాస్​నగర్​, విశ్వాస్​నగర్​, లక్ష్మినగర్​, బదర్​పూర్​లను దక్కించుకుంది. బావన, కిరారీ, కృష్ణానగర్​, పత్​పర్​గంజ్​, షహద్రా స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చింది. ఇవన్నీ లోకల్​ అంశాల ప్రాతిపదికగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలం పెరిగిందనడానికి సూచనలుగా చెబుతున్నారు ఎనలిస్టులు.

ప్లానింగ్​లో ప్రాబ్లమ్​

బీజేపీ పోయినేడాది లోక్​సభ ఎన్నికల్లో 58 శాతం ఓట్లతో మొత్తం ఏడు ఎంపీ సీట్లనూ గెలిచేసింది. అప్పట్లో పాకిస్థాన్​, మిలిటెన్సీ, పుల్వామాపై దాడి వంటి నేషనల్​ ఇష్యూలతో బీజేపీ ఓట్లు అడిగింది. అదే వ్యూహంతో ఈసారికూడా ఓటర్ల దగ్గరకు వెళ్లడంతో దెబ్బ తిన్నట్లు ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో లోకల్​ ఇష్యూలపైనే ఫోకస్​ పెట్టాల్సిందన్నారు. ఢిల్లీలో తూర్పు యూపీ, బీహార్​ రాష్ట్రాలకు చెందిన ఓటర్లు దాదాపు 35 శాతం ఉంటారు. వీళ్లను పూర్వాంచల్​ ప్రాంతం ఓటర్లుగా గుర్తిస్తారు. వీళ్లు గతంలో తూర్పు, ఈశాన్య ఢిల్లీ ప్రాంతాల్లోనే ఉండేవారు. ఇప్పుడు దక్షిణ, ఔటర్​ ఢిల్లీలకుకూడా వ్యాపించారు. ఆప్​ చాలా జాగ్రత్తగా పూర్వాంచల్​కి చెందినవాళ్లకు ఎక్కువ సీట్లు ఇచ్చింది. నరేలా, బురారీ, బద్లి, రిఠాలా, సుల్తాన్​పూర్​ మజ్రా, దేవ్​లీ, అంబేద్కర్​ నగర్​, సంగ్రామ్​ విహార్​లతోపాటు ఈశాన్య ఢిల్లీలోని చాలాచోట్ల పూర్వాంచల్​ వాళ్లనే నిలబెట్టింది.

ఒక్కసారే గెలిచింది!

1993లో జరిగిన మొట్టమొదటి అసెంబ్లీ ఎలక్షన్స్​లో మాత్రమే బీజేపీ గెలవగలిగింది. మదన్​లాల్​ ఖురానా తొలి సీఎం అయ్యారు. హవాలా స్కాంలో ఖురానా పేరు కూడా ఉండడంతో ఆయనను మార్చి సాహిబ్​ సింగ్​ వర్మను సీఏంగా కూర్చోబెట్టారు. వర్మ హయాంలో ఢిల్లీలో ఉల్లిగడ్డల ధర ఆకాశాన్నంటింది. దీంతో ఎన్నికలు మరో రెండు నెలలుండగా, ఆయననుకూడా మార్చేసి సుష్మా స్వరాజ్​ని సీఎం చేశారు. ఈ ప్రయోగాలు ఢిల్లీ ఓటర్లలో అసంతృప్తికి దారి తీశాయి. కాంగ్రెస్​ దీనిని వాడుకుని అధికారానికి రాగలిగింది. రెండో అసెంబ్లీ ఎలక్షన్స్​ నుంచి వరుసగా మూడుసార్లు షీలా దీక్షిత్​ నాయకత్వంలో కాంగ్రెస్​ పవర్​ దక్కించుకుంది. 2013లో ఓడిపోయాక… ఇప్పటివరకు కాంగ్రెస్​ కోలుకోలేదు. ఇండియన్​ రెవెన్యూ సర్వీస్​ నుంచి వీఆర్​ఎస్​ తీసుకుని కేజ్రీవాల్​ పొలిటికల్​ ఎంట్రీ ఇచ్చారు. ఆయన పెట్టిన ఆమ్​ ఆద్మీ పార్టీ 2013లో గెలిచి, కాంగ్రెస్​ సహకారంతో అధికారానికొచ్చింది. కాంగ్రెస్​ పెత్తందారీతనం నచ్చక కేవలం 48 రోజులకే కేజ్రీవాల్​ రాజీనామా చేసేశారు. 2015లో జరిగిన ఎలక్షన్స్​లో ఆప్​ 67 సీట్లతో రికార్డు విజయం సాధించింది. అప్పట్లో బీజేపీ మూడు సీట్ల దగ్గర ఆగిపోయింది. ఈసారి ఎనిమిది సీట్లకు పెరిగి, ఓట్ల శాతం 38.59 శాతం సాధించింది.