బిజినెస్ డెస్క్, వెలుగు:బాబ్ వరల్డ్ యాప్ స్కామ్ బయటపడడంతో కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ డిజిటల్యాప్స్పై ఇంటర్నల్ ఆడిట్స్ చేపట్టినట్లు సమాచారం. తమ మొబైల్ యాప్స్ బలాలు, బలహీనతలు ఏమిటనేది తెలుసుకోవడం కోసమే ఈ ఇంటర్నల్ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు ఒక ప్రభుత్వ బ్యాంకు సీనియర్ ఆఫీసర్ చెప్పారు. తమంతట తాముగానే ఈ చొరవ తీసుకుంటున్నట్లు వివరించారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేపట్టామని, కొన్ని రోజులలోనే ఇది పూర్తవుతుందని ఆ ఆఫీసర్ వెల్లడించారు. డిజిటల్ యాప్ ద్వారా కొత్త కస్టమర్లను తాము ఎక్కువగా చేర్చుకోవడంలేదని ఆయన తెలిపారు. సేఫ్ బ్యాంకింగ్ కోసం ఇలాంటి ఇంటర్నల్ ఆడిట్స్ను అప్పుడప్పుడు చేపట్టడం తమకు సాధారణమేనని మరొక పీఎస్యూ బ్యాంకు సీనియర్ ఆఫీసర్ పేర్కొన్నారు. ఏదైనా కొత్త యాప్ లేదా ఫీచర్ తెచ్చినప్పుడు, చెక్స్ను నిర్వహిస్తూనే ఉంటామని అన్నారు. ఏ విధమైన లోపాలు లేకుండా చూడాలనే ఆ చెకింగ్స్ చేస్తామని పేర్కొన్నారు. నాన్–కాంప్లయెన్స్విషయంలో రాజీ పడలేమని ఆ బ్యాంకు సీనియర్ ఆఫీసర్ వివరించారు.
జులైలోనే మీడియా రిపోర్టులు...
బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్ల ఖాతాలలో ట్యాంపరింగ్ జరుగుతోందని, ఇందులో బాబ్ వరల్డ్ యాప్ పాత్ర ఉందని చెబుతూ ఈ ఏడాది జులై నెలలోనే మీడియాలో రిపోర్టులు వచ్చాయి. మొబైల్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ల సంఖ్యను ఎక్కువ చేసి చూపించేందుకు కస్టమర్లకు సంబంధం లేని ఫోన్ నెంబర్లతో వీరి అకౌంట్లను బ్యాంక్ ఆఫ్ బరోడా లింక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ రిపోర్టుల కారణంగా 60 మంది ఉద్యోగులను బ్యాంక్ తొలగించింది. ఇందులో 11 మంది అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఏజీఎం) స్థాయి ఆఫీసర్లు కూడా ఉన్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఏజీఎం లెవెల్ ఆఫీసర్లంటే స్కేల్ 5 కి చెందిన వారు. సాధారణంగా ఏరియా మేనేజర్లు, జోనల్ హెడ్స్ గా వారు కార్యకలాపాలు నిర్వహిస్తారు. అంటే, వారి కింద 25 మంది బ్రాంచ్ హెడ్స్పనిచేస్తుంటారని బీఓబీ ఉద్యోగి ఒకరు చెప్పారు. బాబ్ వరల్డ్ యాప్ కేసు ఆడిట్ కారణంగానే ఈ చర్య తీసుకుంటున్నట్లు బ్యాంకు తన సస్పెన్షన్ ఆర్డరులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.బాబ్ వరల్డ్ యాప్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడానికి వీల్లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించిన నేపథ్యంలో లోపాల సవరణకు చర్యలు మొదలు పెట్టామని బీఓబీ సీనియర్ ఆఫీసర్ ఒకరు వెల్లడించారు. రెండు వారాలలో దీనిపై ఒక రిపోర్టును ఆర్బీఐకి పంపించనున్నట్లు తెలిపారు.
బాబ్ వరల్డ్పై ఆర్బీఐ గరం....
తన మొబైల్ బ్యాంకింగ్ యాప్ బాబ్వరల్డ్ ద్వారా కొత్త కస్టమర్లను ఆన్బోర్డింగ్ చేయడం ఆపేయమని ఈ నెల 10 వ తేదీన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ)ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. ఈ ఆదేశాన్ని వెంటనే అమలులోకి తేవాలని బ్యాంకుకు సూచించింది. మొబైల్ యాప్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకునే ప్రాసెస్లో కొన్ని లోపాలు బయటపడటం వల్లే పై విధమైన ఆదేశాలు ఇచ్చినట్లు ఆర్బీఐ వెల్లడించింది.
దేశంలో డిజిటల్ పేమెంట్స్ జోరు
దేశంలో డిజిటల్ పేమెంట్స్ జోరుగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా యూపీఐ సెగ్మెంట్లో పేటీఎం, ఫోన్పే, గుగుల్పేలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని గ్లోబల్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ బెర్న్స్టీన్ సెప్టెంబర్ నెలలో ఒక రిపోర్టులో వెల్లడించింది. కార్డుల వంటి ఇతర క్యాష్లెస్ పేమెంట్స్ ఎదగడం ఇక కష్టమేనని ఆ రిపోర్టు పేర్కొంది. గత అయిదేళ్లుగా చూస్తే డెబిట్ కార్డు లావాదేవీలు నిలకడగా తగ్గిపోతున్నాయని వివరించింది. రాబోయే అయిదేళ్లలో మొత్తం రిటైల్ డిజిటల్ ట్రాన్సాక్షన్లలో 90 శాతం వాటాను యూపీఐ చేజిక్కించుకుంటుందని ఆర్బీఐ తన జూన్ బులెటిన్లో ప్రస్తావించింది.