న్యూఢిల్లీ నెక్స్ట్ జనరేషన్ నెట్వర్క్ ఏర్పాటుకు రెడీ అవుతోంది భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్). నెట్వర్క్ ఏర్పాటుకు రూ. 17,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా. దీంతోపాటు ఇప్పటికే ఉన్న అప్పులు తీర్చడానికి మరో రూ. 19,605 కోట్లు కావాలి. ఈ డబ్బు తెచ్చుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని కోరుతోంది బీఎస్ఎన్ఎల్. అంతకు ముందు చేతిలోని స్థలాల విక్రయం ద్వారా డబ్బు సమకూర్చుకోవాలని బీఎస్ఎన్ఎల్ ప్లాన్ చేసింది. కానీ కరోనా మహమ్మారితో ఆ ప్లాన్ ముందుకు సాగలేదు. తప్పనిసరి పరిస్థితులలో ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ సాయం కోరుతోంది. భూముల అమ్మకం ప్రాసెస్ ఊపందుకునేదాకా ప్రతీ ఏడాదీ ప్రభుత్వ గ్యారంటీ ఉంటే మేలని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ ప్రవీణ్ కే పుర్వార్ చెప్పారు. చేతికందే డబ్బుతో ఒకవైపు నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటూ, మరోవైపు ఉన్న అప్పులను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తామని అన్నారు. నెట్వర్క్ విస్తరణ కార్యరూపంలోకి రావాలంటే రూ. 20 వేల కోట్లు అవసరమవుతాయని, రాబోయే మూడేళ్లకు అప్పులపై వడ్డీలు చెల్లించడానికి మరో రూ. 20 వేల కోట్లు కావాలని ఆయన పేర్కొన్నారు. ఈ డబ్బు సమకూర్చుకోవాలని చెబుతూ పుర్వార్ ఇటీవలే టెలికం డిపార్ట్మెంట్ సెక్రటరీకి ఒక లెటర్ కూడా రాశారు. ఈ ఏడాది నుంచి 2024 దాకా మొత్తం రూ. 40 వేల కోట్లు సమీకరించుకోవాలని బీఎస్ఎన్ఎల్ ఆలోచన.
లక్ష సైట్ల ఏర్పాటు.....
దేశీయంగా దొరికే టెక్నాలజీతో 1 లక్ష సైట్లను డెవలప్ చేసేందుకు రూ. 12,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ఎక్విప్మెంట్, ఫైబర్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ల కోసం మరో రూ. 5 వేల కోట్లు అవసరమని లెక్కిస్తున్నారు. ఈ ఏడాది జులై చివరినాటికి బీఎస్ఎన్ఎల్కు 11.5 కోట్ల మంది మొబైల్ ఫోన్ యూజర్లున్నారు. బీఎస్ఎన్ఎల్ రెవెన్యూ మార్కెట్ షేర్ (ఆర్ఎంఎస్) 10 శాతంగా ఉంది. పోటీదారులైన రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాల కంటే బీఎస్ఎన్ఎల్ ఆర్ఎంఎస్ తక్కువే. 4 జీ టెక్నాలజీ తెచ్చేందుకు ప్రపోజ్ చేసిన టెండర్లలో గందరగోళం నెలకొనడంతో, దేశీయ ఎక్విప్మెంట్నే వాడాలని ఇప్పుడు నిర్ణయించింది. 4 జీ సర్వీసుల కమర్షియల్ లాంచ్ కోసమే ఓ పైలట్ ప్రాజెక్టును బీఎస్ఎన్ఎల్ చేపడుతోంది. టీసీఎస్ నాయకత్వంలోని కన్సార్టియమ్ తొలిసారిగా దేశీయ టెక్నాలజీతో బీఎస్ఎన్ఎల్ కోసం నెట్వర్క్ను ఏర్పాటు చేస్తున్నాయి. తేజాస్ నెట్వర్క్స్ సప్లయ్ చేసిన రేడియో ఎక్విప్మెంట్ సహా, ఇతర సాఫ్ట్వేర్లనూ టెలికం రిసెర్చ్ విభాగమైన సీ–డాట్ టెస్టింగ్ చేస్తోంది.
స్థలాలు అమ్మలేకపోతున్నాం..
సావరిన్ గ్యారంటీడ్ బాండ్ల జారీ ద్వారా సెప్టెంబర్ 2020 లో బీఎస్ఎన్ఎల్ రూ. 8,500 కోట్ల నిధులు సమీకరించింది. మరో రూ. 20 వేల కోట్ల సేకరణ కోసం చేతిలోని స్థలాలు అమ్మాలని అనుకుంది. కాకపోతే ఈ ప్లాన్ సక్సెస్ కాలేదు. మొత్తం అప్పులు రూ. 30 వేల కోట్ల దాకా ఉన్నాయని, ఆపరేషనల్ ఖర్చులను సొంతంగానే సంపాదించుకోగలుగుతున్నామని బీఎస్ఎన్ఎల్ చెబుతోంది. కిందటేడాది నుంచే ఆపరేషనల్ ప్రాఫిట్స్ వస్తున్నాయని పేర్కొంటోంది. మన దేశంలోని టెక్నాలజీని ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని, అయితే ఈ టెక్నాలజీని ఇంతకు ముందు ఎక్కడా వాడకపోవడంతో కొంత బిజినెస్ రిస్క్ ఉండొచ్చని బీఎస్ఎన్ఎల్ సీనియర్ ఆఫీసర్ ఒకరు చెప్పారు.