
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద కరోనా ట్రీట్మెంట్ సెంటర్ దేశ రాజధాని ఢిల్లీ, ఛత్తర్పూర్లోని రాధా సోమి సత్సంగ్ బియాస్లో ఆదివారం ప్రారంభమైంది. 10 వేల బెడ్స్ సామర్థ్యంతో రూపొందిన ఈ హాస్పిటల్లో నేటి నుంచి కరోనా పేషెంట్స్ను చేర్చుకోనున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సాయంతో సౌత్ ఢిల్లీ జిల్లా పాలనా యంత్రాంగం ఈ ఆస్పత్రి నిర్మాణాన్ని చేపట్టింది. పేషెంట్స్ ఎలాంటి ఒత్తిడికి గురవకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఐసోలేషన్లో ఉండటం కోసమే ఈ ఆస్పత్రిని రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఆస్పత్రిని దీన్ దయాళ్ ఉపాధ్యాయ (డీడీయూ) హాస్పిటల్, మదన్ మోహన్ మాళవీయ హాస్పిటల్తో అనుసంధానించారు. అలాగే అత్యవసర సూచనల కోసం లోక్ నారాయణ్ జయ ప్రకాశ్ (ఎల్ఎన్జేపీ), రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సాయం తీసుకునేలా లింకప్ చేశారు. ఈ సెంటర్ నిర్మాణ పనులను కేవలం పది రోజుల్లో పూర్తి చేయడం విశేషం.
ఢిల్లీలోని కరోనా పేషెంట్స్ డిస్ట్రిక్ట్ సర్వైలెన్స్ ఆఫీసర్స్ ద్వారా ఈ సెంటర్లో చేరొచ్చు. రీసెంట్గా గల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో పలువురు ఇండియా సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సెంటర్లోని వార్డులకు పలువురు పేర్లు జవాన్ల పేర్లు పెట్టాలని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) నిర్ణయించింది. ఈ సెంటర్ సుమారు 20 ఫుట్బాల్ ఫీల్డ్స్ పట్టేంత సైజులో ఉండటం గమనార్హం. ఇందులో 200 ఎన్క్లోజర్లు, ప్రతిదాంట్లో 50 బెడ్లను ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో కూలింగ్ కోసం 18 వేల టన్నల ఎయిర్ కండీషనర్స్ను వాడుతున్నారు. ఈ హాస్పిటల్లో పేషెంట్స్ బంధువులను అనుమతించరు. ఢిల్లీ రాష్ట్ర సర్కార్ ఈ ఆస్పత్రికి అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ అందిస్తుండగా.. సెంటర్ను ఆపరేట్ చేసే నోడల్ ఏజెన్సీగా ఇండో–టిబెటన్ బార్డర్ పోలీసు (ఐటీబీపీ) వ్యవహరించనుంది. అలాగే రాధా సోమి బియాస్కు చెందిన వాలంటీర్లు సెంటర్ను నడపడంలో సహాయ సహకారాలు అందించనున్నారు.