టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి సిబీఐ సమన్లు జారీ చేసింది. బెనర్జీ పశ్చిమ బెంగాల్ రాజకీయాలలో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. సీఎం మమతా బెనర్జీకి మేనల్లుడు. ఎంపీ.. టీచర్ల భర్తీలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణను నిలిపి వేసిన కొద్ది గంటలకే కేంద్ర దర్యాప్తు సంస్థ సమన్లు జారీ చేయడం కలకలం రేపింది.స్కూల్ రిక్రూట్మెంట్ స్కామ్లో సీబీఐ, ఈడీ విచారణకు హాజరుకావాలని కోల్కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సోమవారం సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. . ఈ తరుణంలో ఎంపీకి సమన్లు ఇవ్వడం వెనుక రాజకీయ ఉద్దేశం తప్ప మరొకటి లేదన్నారు సీఎం మమతా బెనర్జీ.
ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ స్కామ్కు సంబంధించి అభిషేక్ బెనర్జీని ప్రశ్నించాలని కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆదేశించిన కలకత్తా హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించిన కొన్ని గంటలకే సోమవారం మధ్యాహ్నం తృణమూల్ ఎంపీకి సీబీఐ నోటీసు అందజేసింది. అభిషేక్ బెనర్జీ సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ను ఉల్లంఘించినందుకు కోర్టు ధిక్కార పిటిషన్ను దాఖలు చేసే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల నియామకంలో జరిగిన కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఈడీ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయవద్దని కలకత్తా హైకోర్టు ఏప్రిల్ 13న ఇచ్చిన ఉత్తర్వుల్లో పశ్చిమ బెంగాల్ పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో టీఎంసి నేతల పాత్రపై విచారణ జరిపించాలని కేంద్ర సంస్థలను కోర్టు ఆదేశించింది.