![సింగరేణి బడుల్లో సీబీఎస్ఈ సిలబస్ !](https://static.v6velugu.com/uploads/2024/05/cbse-syllabus-in-singareni-schools_aQ58EN3Jig.jpg)
- అభిప్రాయ సేకరణలో ఈ విద్యావిధానం వైపే కార్మికుల మొగ్గు
- స్కూళ్ల రీఓపెన్ నాటికి ఏర్పాటు చేసేలా కసరత్తు
- ముందుగా -మూడు చోట్ల ప్రారంభించేలా సన్నాహాలు
కోల్బెల్ట్, వెలుగు : సింగరేణి ఉద్యోగులు, కార్మికుల పిల్లలకు సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) విధానంలో విద్యను అందించేందుకు యాజమాన్యం కసరత్తు చేస్తోంది. ఇటీవల నిర్వహించిన అభిప్రాయ సేకరణలో చాలా మంది సీబీఎస్ఈ వైపే మొగ్గు చూపారు. దీంతో స్కూళ్ల రీఓపెన్ నాటికి ఈ విద్యావిధానాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
49 ఏళ్లుగా విద్యాబోధన
తెలంగాణలోని ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి బొగ్గు గనుల ప్రాంతాల్లో సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో 49 ఏళ్ల కింద స్కూళ్లను ఓపెన్ చేశారు. కార్మికుల పిల్లలకు విద్యను అందించేందుకు ప్రతి ఏరియాలో 1975లో ఓ స్కూల్ను ప్రారంభించారు. ఇందులో సింగరేణి కార్మికుల పిల్లలకు ఫ్రీగా చదువు చెబుతుండగా, ఇతరులకు మాత్రం తక్కువ ఫీజులు వసూలు చేస్తూ ప్రాథమిక స్థాయి నుంచి హైస్కూల్ వరకు విద్యను అందిస్తున్నారు.
వీటితో పాటు శ్రీరాంపూర్ ఏరియాలో ఓ పాలిటెక్నిక్క్ కాలేజీ, కొత్తగూడెంలో మహిళ కాలేజ్ను నడుపుతున్నారు. తర్వాత విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో కొన్ని స్కూళ్లను ఎత్తి వేశారు. ప్రస్తుతం గోలేటి (బెల్లంపల్లి), మందమర్రి, శ్రీరాంపూర్ సీసీసీ, యైటింక్లైయిన్, సెక్టార్ 2 (గోదావరిఖని), భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు ప్రాంతాల్లోని హైస్కూళ్లలో సుమారు 9 వేల మంది వరకు స్టూడెంట్లు చదువుతున్నారు. రెగ్యులర్, కాంట్రాక్ట్ టీచర్లు కలిసి సుమారు 250 మందికిపైగా ఉంటారు. ఇందులో బోధన, బోధనేతర సిబ్బందికి సింగరేణి సంస్థే వేతనాలు చెల్లిస్తోంది. ఈ స్కూళ్లలో రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధానం సాగుతోంది.
సీబీఎస్ఈ సిలబస్ కోసం డిమాండ్
సింగరేణి స్కూళ్లలో సీబీఎస్ఈ విద్యావిధానం ప్రవేశపెట్టాలని ఉద్యోగుల నుంచి కొన్ని రోజులుగా డిమాండ్ పెరిగింది. సింగరేణిలో కొత్తగా సుమారు 20 వేల మంది వరకు ఉద్యోగులు జాయిన్ అయ్యారు. వీరంతా ఉన్నత విద్యను అభ్యసించి వచ్చినవారే. వారి పిల్లలకు సీబీఎస్ఈ సిలబస్ కోసం పట్టుబడుతున్నారు. సింగరేణి కార్మికులతో పాటు ఇటీవల జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లోనూ కార్మిక సంఘాలన్నీ సీబీఎస్ఈ సిలబస్ కోసం డిమాండ్ చేశాయి.
కొత్తగూడెం, రామగుండం, బెల్లంపల్లి రీజియన్లో ఒక్కో చోట సీబీఎస్ఈ విద్యను అందించాలని డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి సీఎండీగా బాధ్యతలు చేపట్టిన బలరాంనాయక్ సైతం కేంద్రీయ విద్యావిధానంపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో కార్మికుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఫైనల్ డెసిషన్ తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు.
పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కావడంతో స్కూళ్ల రీ ఓపెన్ నాటికి సీబీఎస్ఈ సిలబస్ విధానం అందుబాటులోకి తీసువచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విద్యాబోధనకు ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్, పూర్తిస్థాయి ఫ్యాకల్టీ, సెంట్రల్ టైబరీ, డిజిటల్ సిస్టం వంటి అధునాతన సౌలత్లు అవసరం ఉంటాయి.
సిలబస్పై అభిప్రాయ సేకరణ
సింగరేణి స్కూళ్లలో సీబీఎస్ఈ విధానం అమలు చేయాలని కార్మికులు, కార్మిక సంఘాల నుంచి డిమాండ్ రావడంతో ఇటీవల అభిప్రాయ సేకరణ చేపట్టింది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న తొమ్మిది స్కూళ్లలో కార్మికుల పిల్లలు ఎంత మంది చదువుతున్నారు ? సీబీఎస్ఈ సిలబస్ వైపు ఎందరు మొగ్గు చూపుతున్నారు ? స్టేట్ సిలబస్ కావాలని ఎందరు కోరుకుంటున్నారన్న వివరాలు సేకరించింది.
ఈ విషయంపై మార్చి 26న జారీ చేసిన సర్క్యులర్ ఆధారంగా ఏప్రిల్ 1న సేకరించిన వివరాలను కార్పొరేట్ ఆఫీస్కు అందజేశారు. ఎక్కువ మంది సీబీఎస్ఈ సిలబస్ వైపు మొగ్గు చూపడంతో స్కూళ్ల రీఓపెన్ నాటికి ఈ సిలబస్లో విద్యాబోధన చేసేలా సింగరేణి యాజమాన్యం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
రీ ఓపెన్నాటికి సెంట్రల్ సిలబస్
సింగరేణి ఎన్నికల్లో మా యూనియన్ తరఫున ఇచ్చిన హామీ మేరకు స్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్ అమలు చేసేందుకు కృషి చేస్తున్నాం. యూనియన్ ముఖ్య నేతలు ఇప్పటికే యాజమాన్యంతో చర్చించారు. అన్ని స్కూళ్లలో అమలుకు సంస్థ సానుకూలత వ్యక్తం చేసింది. సీబీఎస్ఈ ద్వారా కార్మికుల పిల్లలకు మెరుగైన విద్య అందుతుంది. స్కూళ్ల రీ ఓపెన్ నాటికి ఈ సిలబస్ అందుబాటులోకి వస్తుంది.
వాసిరెడ్డి సీతారామయ్య,
ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్