జూన్ లోనే మూడు నెలల రేషన్ బియ్యం

జూన్ లోనే మూడు నెలల రేషన్ బియ్యం
  • యాదాద్రి జిల్లాకు 13,517 టన్నులు అవసరం
  • మే నెలకు సంబంధించి మిగిలినవి 2 వేల టన్నులు​
  • మిగతావి జనగామ, వరంగల్​నుంచి పంపాలని ఆదేశాలు

యాదాద్రి, వెలుగు: వానాకాలం సీజన్​  నేపథ్యంలో రేషన్​లబ్ధిదారులకు మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని జూన్ నెలలో ఒకేసారి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు మూడు నెలలకు సరిపడా బియ్యం స్టాక్​అలాట్​చేసింది. ఎక్కడ వీలైతే అక్కడ నిల్వ చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

 2,17,323 రేషన్​కార్డులు 

యాదాద్రి జిల్లాలో 2,17,323 రేషన్​ కార్డులు, 7,06,368 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ ప్రతీ నెల 4,483 టన్నుల బియ్యం ఇస్తున్నారు. మూడు నెలలు జూన్, జూలై, ఆగస్టు కలిపి ఇవ్వాలంటే 13,517 టన్నులు అవసరం. మే నెలకు సంబంధించి 2 వేల టన్నుల స్టాక్​ ఉంది. మిగతా 11,517 టన్నులను జనగామ, వరంగల్​జిల్లాల నుంచి యాదాద్రి జిల్లాకు స్టాక్​పంపించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 

నిల్వ కోసం ముందస్తు చర్యలు

మూడు  నెలల బియ్యం ఒకేసారి వస్తుండడంతో సివిల్ సప్లయ్​ఆఫీసర్లు వాటిని నిల్వ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని 515 రేషన్ షాపులకు బియ్యం పంపిణీ ప్రారంభించారు. ఆయా​ షాపుల్లో ఎంత ప్లేస్​ ఉంటే ఆ స్థాయిలో స్టాక్ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లబ్ధిదారులకు నెల రోజులపాటు బియ్యం పంపిణీ చేయనున్నారు.